రంగారెడ్డి, జనవరి 9 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లా ఓటరు ముసాయిదా జాబితాను రెండు రోజుల క్రితం ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం జిల్లా ఓటర్లు 35,57,415 మంది ఉన్నట్లుగా లెక్క తేల్చారు. వీరిలో పురుషులు 18,39,207, స్త్రీలు 17,17,763, ఇతరులు 445 మంది ఉన్నారు. గత ఏడాది చివరలో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల ముందు నవంబర్ 10న ఎన్నికల సంఘం జిల్లా తుది ఓటరు జాబితాను విడుదల చేసింది. దీనిలో జిల్లా మొత్తం ఓటర్ల సంఖ్య 35,23,219గా లెక్క తేలింది. తాజాగా లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మళ్లీ ఎన్నికల సంఘం ఓటు నమోదుకు అవకాశం కల్పించింది. దీంతో మరోసారి కొత్తగా ఓటు కోసం పలువురు దరఖాస్తు చేసుకున్నారు. నవంబర్లో విడుదల చేసిన తుది ఓటరు జాబితాతో పోలిస్తే ప్రస్తుత ముసాయిదా ఓటరు జాబితాలో కొత్తగా 34,196 మంది ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్నారు. సుమారు 56 రోజుల వ్యవధిలోనే జిల్లా ఓటర్ల సంఖ్య మరింతగా పెరిగింది.
22 వరకు అభ్యంతరాల స్వీకరణ
జిల్లా ఓటరు ముసాయిదా జాబితాను అన్ని పోలింగ్ కేంద్రాల్లో అధికారులు ప్రదర్శించారు. వీటిలో ఏమైనా అభ్యంతరాలుంటే ఈ నెల 22 వరకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. వచ్చిన అభ్యంతరాలను ఫిబ్రవరి 2న పరిష్కరిస్తారు. ఫిబ్రవరి 8న ఓటరు తుది జాబితాను ఎన్నికల సంఘం ప్రకటిస్తుంది. ఈ జాబితాలో ఉన్న వారందరూ వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంటుంది.