వికారాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖకు ఈ ఆర్థిక సంవత్సరం కాసుల పంట పండింది. ఈ ఏడాది జిల్లాలో వ్యవసాయేతర భూముల క్రయవిక్రయాలతో ఇప్పటివరకు రూ.3,598 కోట్ల ఆదాయం ఖజానాకు చేరింది. అందులో రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం ద్వారానే అధిక ఆదాయం సమకూరింది. అయితే ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో నెల రోజుల గడువున్న దృష్ట్యా వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లతో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది కొంతమేర రెవెన్యూ తగ్గే అవకాశాలు ఉన్నాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
ప్రతి ఆర్థిక సంవత్సరం చివర్లో రిజిస్ట్రేషన్లు పుంజుకునే అవకాశాలున్నా ఈ నెలాఖరులో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్తోపాటు ఎన్నికల కోడ్ అమల్లోకి రానుండడంతో రిజిస్ట్రేషన్లపై ప్రభావం పడే అవకాశాలున్నాయని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖకు చెందిన అధికారులు భావిస్తున్నారు. అయితే ప్రతి ఆర్థిక సంవత్సరం మార్చి నెలలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా వ్యవసాయేతర భూముల క్రయవిక్రయాలతో రూ.300 కోట్ల వరకు రెవెన్యూ వస్తున్నప్పటికీ ఈ ఏడాది మాత్రం మరో రూ.100 కోట్ల వరకు వచ్చే అవకాశమున్నది.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వేగంగా పారిశ్రామికాభివృద్ధి జరుగడం, రీజినల్ రింగ్రోడ్డు, అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు నాలుగు లేన్ల రోడ్డుగా బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ, మోమిన్పేటలో 1200 ఎకరాల్లో మొబిలిటీ వ్యాలీని ఏర్పాటు చేస్తుండడంతో ఉమ్మడి జిల్లాలో భారీగా లేఅవుట్లను ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా హైదరాబాద్వాసులు చాలావరకు శంకర్పల్లి, మొయినాబాద్, వికారాబాద్ వరకు తమ నివాసాలనను ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి చూపుతుండడంతో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల క్రయవిక్రయాలు భారీగా పెరిగాయి.
వ్యవసాయేతర భూముల క్రయవిక్రయాల ద్వారా ఉమ్మడి జిల్లాల స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖకు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ.3,598 కోట్ల రెవెన్యూ వచ్చింది. అత్యధికంగా రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం ద్వారానే రూ.1007 కోట్ల రాబడి చేకూరింది. అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అత్యధికంగా ఆదాయం గండిపేట, శేరిలింగంపల్లి, మహేశ్వరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి ప్రభుత్వ ఖజానాకు చేరింది. కాగా గతేడాది వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లతో రూ.3,861 కోట్ల ఆదాయం సమకూరగా.. 2,47,704 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 2,04,333 డాక్యుమెంట్లకు రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. కొడంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 1,140 డాక్యుమెంట్లు, షాద్నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 7,107, ఫారూఖ్నగర్లో 14,053, చేవెళ్లలో 7,811, హయత్నగర్లో 6,143, ఇబ్రహీంపట్నంలో 14,216, పరిగిలో 2,157, తాండూరులో 3,284, వికారాబాద్లో 5,720, జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో 19,354, సరూర్నగర్లో 6,858, చంపాపేటలో 12,606, పెద్ద అంబర్పేటలో 8,306, రాజేంద్రనగర్లో 11,138, మహేశ్వరంలో 17,816, శంషాబాద్లో 8,368, శేరిలింగంపల్లిలో 10,550, శంకర్పల్లిలో 4,821, గండిపేటలో 13,720, వనస్థలిపురంలో 12,200, ఎల్బీనగర్లో 10,460, అబ్దుల్లాపూర్మెట్లో 6487 డాక్యుమెంట్లకు సంబంధించి రిజిస్ట్రేషన్లు అయ్యాయి.