షాబాద్, మార్చి 3: రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలకు ప్రజలు తరలివచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల్లో 15,435 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 1,595 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. 1,263 మందికి ప్రిస్కిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ చేశారు. జిల్లాలో 80 బృందాల ద్వారా వైద్య సిబ్బంది ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. అవసరమున్న వారికి కంటి అద్దాలతో పాటు, ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు. జిల్లాలోని ఆయా మండలాల్లో కొనసాగుతున్న శిబిరాలను ఆరోగ్యశాఖ అధికారులు సందర్శించి సిబ్బందికి సలహాలు, సూచనలు అందిస్తున్నారు.
సంబురంగా ..
బొంరాస్పేట : అంధత్వం, కంటి జబ్బుల నివారణే లక్ష్యంగా ప్రభుత్వం ప్రారంభించిన కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమం వికారాబాద్ జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతున్నది. నేత్ర సంబంధిత వ్యాధులతో వచ్చిన వారికి జిల్లాలోని 42 కంటి వెలుగు కేంద్రాల్లో వైద్య బృందాలు అప్పటికప్పుడే పరీక్షలు నిర్వహిస్తున్నాయి. కంటి సమస్యలతో వచ్చే వారికి చుక్కల మందుతో పాటు విటమిన్ మాత్రలు పంపిణీ చేస్తున్నారు. ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించు కునేలా ప్రజలను చైతన్యం చేస్తున్నారు. కంటి వెలుగుకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది. ప్రజలు ఉత్సాహంగా శిబిరాలకు వచ్చి కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు. ప్రభుత్వం ఉచితంగా కంటి పరీక్షలు చేసి కండ్ల అద్దాలు పంపిణీ చేస్తుండడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, మండలాల నోడల్ అధికారులు కంటి వెలుగు శిబిరాలను సందర్శించి పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం జిల్లాలో 4,941 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 687 మందికి రీడింగ్ గ్లాసులు పంపిణీ చేయగా, 639 మందికి అద్దాల కోసం ఆర్డరిచ్చారు. ఇదిలా ఉండగా జిల్లాలో ఇప్పటి వరకు 179 గ్రామాలు, 41 వార్డుల్లో కంటి వెలుగు వైద్య శిబిరాలు నిర్వహించినట్లు డీఎంహెచ్వో పాల్వన్కుమార్ తెలిపారు.
పేదల జీవితాల్లో వెలుగులు
కంటి వెలుగు కార్యక్రమంతో మాలాంటి పేదల జీవితాల్లో ప్రభుత్వం వెలుగులు నింపుతున్నది. ముఖ్యమంత్రి పేదల పాలిట దైవంగా ఉన్నారు. ఇలాంటి సీఎం మనకు ఉన్నందుకు అందరం గర్వపడాలి. ఊర్లోనే పరీక్షలు చేసి అద్దాలు, మందులు ఇస్తున్నారు. నాకు కండ్లు మసకగా కనిపిస్తున్నాయి. కంటి పరీక్షలు చేసి మందులు, అద్దాలు ఇచ్చారు.
– సుభాన్గౌడ్, తల్లారం, చేవెళ్ల మండలం, రంగారెడ్డి జిల్లా