షాబాద్, ఏప్రిల్ 18 : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ‘కంటి వెలుగు’ శిబిరాలకు అనూహ్య స్పందన లభిస్తున్నది. కంటి సమస్యలు పోయి చూపు చక్కగా కనిపిస్తుండడంతో జనం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో మంగళవారం 13,027 మందికి కంటి పరీక్షలు చేయగా, 787 మందికి రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేశారు. 605 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ చేశారు. వికారాబాద్ జిల్లాలో 4963 మందికి కంటి పరీక్షలు చేయగా, 535 మందికి రీడింగ్ గ్లాసెస్ను అందించి, 526 మందికి ప్రిస్క్రిప్షన్పై అద్దాల కోసం ఆర్డర్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న కంటి వెలుగు కార్యక్రమంతో ఎంతో మందికి కంటి సమస్యలు దూరమవుతున్నాయని ఉమ్మడి జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల కంటి సమస్యలు తీర్చేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయా గ్రామాల్లో కొనసాగుతున్న కంటి వెలుగు క్యాంపులకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 80 బృందాల ద్వారా ఏర్పాటు చేసిన కంటి వెలుగు కేంద్రాల్లో 13,027 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 787 మందికి కంటి అద్దాలు అందజేశారు. 605 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ చేశారు. వైద్యసిబ్బంది తమకు కేటాయించిన గ్రామాల్లో క్యాంపులు ఏర్పాటు చేసి కంటి పరీక్షలు చేస్తున్నారు. అవసరమున్నవారికి మందులు ఉచితంగా అందిస్తున్నారు.
330 గ్రామాలు, 67 వార్డుల్లో కంటి వెలుగు శిబిరాలు
బొంరాస్పేట : జిల్లాలో నిర్వహిస్తున్న కంటి వెలుగు వైద్య శిబిరాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. గ్రామాలు, మున్సిపల్ పరిధిలోని వార్డుల్లో నిర్వహించే వైద్య శిబిరాలకు ప్రజలు ఉత్సాహంగా తరలివచ్చి కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు. 42 కంటి వెలుగు కేంద్రాల్లో వైద్య బృందాలు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం కంటి పరీక్షలు చేసి కండ్లద్దాలు పంపిణీ చేస్తుండడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, మండలాల నోడల్ అధికారులు కంటి వెలుగు శిబిరాలను సందర్శించి పర్యవేక్షిస్తున్నారు. మంగళవారం బొంరాస్పేట మండలంలోని మూడిమామిళ్లతండాలో నిర్వహించిన కంటి వెలుగు శిబిరానికి తండా ప్రజలు క్యూ కట్టారు. సిబ్బంది వారికి కంటి పరీక్షలు నిర్వహించి కళ్లద్దాలు పంపిణీ చేశారు. మంగళవారం జిల్లాలో 4963 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 535 మందికి రీడింగ్ గ్లాసులు పంపిణీ చేయగా, 526 మందికి అద్దాలను ఆర్డరిచ్చారు. జిల్లాలో ఇప్పటివరకు 320 గ్రామాలు, 67 వార్డుల్లో కంటి వెలుగు వైద్య శిబిరాలను నిర్వహించినట్లు డీఎంహెచ్వో పాల్వన్కుమార్ తెలిపారు.