వికారాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సిట్టింగ్లకే టికెట్లు కేటాయించడంతో జిల్లాలోని సబ్బండ వర్గాల ప్రజలు సంపూర్ణ మద్దతిస్తున్నారు. జిల్లాలోని వికారాబాద్, తాండూరు, కొడంగల్, పరిగి నియోజకవర్గాల అభ్యర్థులుగా మెతుకు ఆనంద్, పైలట్ రోహిత్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డి, కొప్పుల మహేశ్రెడ్డిలను మరోసారి బరిలో దింపడంతో వారికి మద్దతుగా ఇతర పార్టీల నుంచి భారీగా బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతుండడం గమనార్హం. ఈ నెల 21న సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించగా మరుసటి రోజు నుంచి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ పార్టీలోకి వరుసగా చేరుతున్నారు. దీంతో జిల్లాలో కాంగ్రెస్, బీజేపీలు ఖాళీ అవుతున్న పరిస్థితి నెలకొంది. జిల్లాలో కనీవినీ ఎరుగని అభివృద్ధితోపాటు దేశంలో ఎక్కడాలేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తుండడం కూడా కాంగ్రెస్, బీజేపీల నుంచి పెద్దఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరుతుండడం గమనార్హం. ఓ వైపు సబ్బండ వర్గాల ప్రజల మద్దతు.. మరోవైపు ఇతర పార్టీల నుంచి భారీగా వలసలతో జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల సిట్టింగ్ ఎమ్మెల్యేలు రెండోసారి గెలవడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుతో సబ్బండ వర్గాల ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి జైకొడుతున్నారు. ఇప్పటికే జిల్లాలో కంచుకోటగా మారిన వికారాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ మరింత బలంగా అవుతున్నది. చోటా, మోటా నేతల నుంచి కార్యకర్తల వరకు అంతా గులాబీ వైపు క్యూ కడుతున్నారు. అటు రాష్ట్రంలోగాని, జిల్లాలోగాని కాంగ్రెస్, బీజేపీలతోపాటు ఇతర పార్టీలకు కాలం చెల్లినట్లేనని, మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వమే రానుందని గ్రహించిన ప్రజలు అధికార పార్టీ బీఆర్ఎస్వైపే ఆకర్షితులవుతున్నారు. వికారాబాద్ నియోజకవర్గంలో గత పది రోజుల్లో కాంగ్రెస్, బీజేపీలతోపాటు ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అభ్యర్థిత్వానికి సంపూర్ణ మద్దతునిస్తూ భారీగా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన నాటి నుంచి ఏదో ఒక కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లి సమస్యలను పరిష్కరించడంతోపాటు అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా చూడడంతో ఎమ్మెల్యే ఆనంద్ను రెండోసారి గెలిపించుకోవడమే లక్ష్యంగా బీఆర్ఎస్లో చేరుతున్నారు. గత పది రోజుల్లో 2 వేల మంది నేతలు, కార్యకర్తలు చేరడం గమనార్హం. బుధవారం ఒక్కరోజే బంట్వారం మండలంలోని పలు గ్రామాల నుంచి కాంగ్రెస్, బీజేపీలకు చెందిన 500 మంది నేతలు, కార్యకర్తలు ఎమ్మెల్యే ఆనంద్ సమక్షంలో పార్టీలో చేరారు.
వికారాబాద్ పట్టణం కొత్తగడి, ఆలంపల్లి, వికారాబాద్ మండలం కొటాలగూడ, పుల్మద్ది, మదన్పల్లి, మద్గుల్చిట్టంపల్లి, సిద్దులూర్, కొంపల్లి, ఎర్రవల్లి, మైలార్దేవ్పల్లి గ్రామాల నుంచి, కోట్పల్లి మండలం కొత్తపల్లి, ఎన్కేపల్లి, బార్వాద్, నాసన్పల్లి, మోత్కుపల్లి, బీరోల్ గ్రామాల నుంచి, మర్పల్లి మండలం రావులపల్లి, పంచలింగాల్, కోట్మర్పల్లి, కొంషెట్పల్లి, నర్సాపూర్, మర్పల్లి, పెద్దాపూర్, తిమ్మాపూర్ గ్రామాల నుంచి, మోమిన్పేట్ మండలం మోమిన్పేట్, దేవరాంపల్లి, ఎన్కతల, మేకవనంపల్లి, చంద్రయాన్పల్లి, రావులపల్లి, అమ్రాదికుర్దు, అమ్రాదికలాన్, ధారూరు మండలం అవుసుపల్లి, మోమిన్కుర్దు, కెరెల్లి, స్టేషన్ ధారూరు, మున్నూరు సోమారం, ధర్మాపూర్, దోర్నాల గ్రామాల నుంచి కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు చేరారు.
తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలానికి చెందిన 500 మంది కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కొడంగల్ నియోజకవర్గంలో గత పది రోజుల్లో వెయ్యి మందికి పైగా కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కొడంగల్ మండలం చిన్ననందిగామ గ్రామం, బొంరాస్పేట్ మండలం నాజుఖంపల్లి తదితర గ్రామాలకు చెందిన పలు పార్టీల నేతలు, కార్యకర్తలు చేరారు. పరిగి నియోజకవర్గంలో గత పది రోజుల్లో 500 మంది ఇతర పార్టీలకు చెందినవారు ఎమ్మెల్యే మహేశ్రెడ్డి సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు. పరిగి నియోజకవర్గంలోని కులకచర్ల మండలం రాంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, చౌడాపూర్ మండలం మందిపల్ గ్రామానికి చెందిన 200 మంది బీజేపీ శ్రేణులు చేరారు.
దేశ చరిత్రలోనే ఎక్కడాలేని విధంగా దళితులు ఆర్థికంగా వృద్ధి చెందేందుకు దళిత బంధు, రైతులను అప్పుల ఊబి నుంచి కాపాడేందుకు రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలను బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఆసరా పథకాన్ని ప్రవేశపెట్టి పింఛన్ డబ్బులను వృద్ధులు, వితంతువుల పింఛన్ను రూ.200 నుంచి రూ.2016లకు, దివ్యాంగుల పింఛన్ను రూ.500 నుంచి రూ.3016లకు, తాజాగా రూ.4016లకు పెంచిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్దే. ఆసరా పథకంతోపాటు ఆహార భద్రతా పథకాన్ని ప్రవేశపెట్టి పేదలకు కడుపు నిండా భోజనం పెట్టాలనే ఉద్దేశంతో కుటుంబ సభ్యుల సంఖ్యతో నిమిత్తం లేకుండా కుటుంబంలో ఎంత మంది ఉన్నప్పటికీ.. సభ్యుల్లో ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున పంపిణీ చేస్తున్నది. బీసీ కులవృత్తులు, మైనార్టీలకు ఆర్థిక చేయూతనందించేందుకు రూ.లక్ష ఆర్థిక సహాయం అందిస్తున్నారు.
మిషన్ భగీరథతో ఇంటింటికీ నల్లా ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. చెరువులకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు మిషన్ కాకతీయ, పేద కుటుంబాలకు చెందిన ఆడబిడ్డల పెండ్లిళ్లకు ఆర్థిక చేయూతనందించేందుకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రభుత్వం అమలుచేస్తున్నది. ఇవేకాకుండా డబుల్ బెడ్రూం ఇండ్లు, తదితర సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నది. సంక్షేమ పథకాలతోపాటు కోట్ల రూపాయలతో జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నది. జిల్లాలోని ప్రతి గ్రామానికి రోడ్లు వేయించడంతోపాటు గ్రామాల నుంచి మండలాలకు, మండలాల నుంచి జిల్లా కేంద్రానికి లింక్ రోడ్లు, అన్ని గ్రామ పంచాయతీల్లోనూ సీసీ రోడ్ల ఏర్పాటుకు భారీగా నిధులు వెచ్చించింది. ఈ విధంగా కనీవినీ ఎరుగని అభివృద్ధి జరగడంతో ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు.