షాబాద్, ఏప్రిల్ 24 : గ్రామాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 80 బృందాల ద్వారా ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల్లో 11,874 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 530 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. 519 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ చేశారు. అవసరమున్నవారికి కంటిఅద్దాలతోపాటు ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు. రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు.
354 గ్రామాలు, 71 వార్డుల్లో కంటి వెలుగు శిబిరాలు
బొంరాస్పేట : వికారాబాద్ జిల్లాలో నిర్వహిస్తున్న కంటి వెలుగు వైద్య శిబిరాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. 42 కంటి వెలుగు కేంద్రాల్లో వైద్య బృందాలు అప్పటికప్పుడే పరీక్షలు నిర్వహించి కంటి సమస్యలున్నవారికి చుక్కల మందుతోపాటు విటమిన్ మాత్రలు పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వం ఉచితంగా కంటి పరీక్షలు చేసి కండ్లద్దాలు పంపిణీ చేస్తుండడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, మండలాల నోడల్ అధికారులు కంటి వెలుగు శిబిరాలను సందర్శించి పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో 5149 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 566 మందికి రీడింగ్ గ్లాసులు పంపిణీ చేయగా, 675 మందికి అద్దాలను ఆర్డరిచ్చారు. జిల్లాలో ఇప్పటి వరకు 354 గ్రామాలు, 71 వార్డుల్లో కంటి వెలుగు వైద్య శిబిరాలను నిర్వహించినట్లు డీఎంహెచ్వో పాల్వన్కుమార్ తెలిపారు.
పేదల ప్రభుత్వం : టి.రాంచంద్రయ్య, న్యాలట గ్రామం, చేవెళ్ల మండలం
గతంలో ఎన్నో ప్రభుత్వాలు పాలించాయి. పేదల కోసం ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టలేదు. సీఎం కేసీర్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం. పేదల సంక్షేమానికి అనేక పథకాలు తీసుకొచ్చి ఆదుకుంటున్నారు. ఇప్పుడు కంటి వెలుగు పథకంతో గ్రామాలకే వైద్యులు వచ్చి కంటి పరీక్షలు, ఉచితంగా మందులు, అద్దాలు ఇస్తున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి ధన్యవాదాలు.