షాబాద్, మే 22 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు పథకం జిల్లాలో జోరుగా కొనసాగుతున్నది. ఆయా గ్రామాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. పేద ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహిస్తూ, ఉచితంగా కండ్లద్దాలతో పాటు, మందులు అందజేస్తున్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలో 80 బృందాల ద్వారా ఏర్పాటు చేసిన శిబిరాల్లో మొత్తం 10,440 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 408 మందికి కండ్లద్దాలు పంపిణీ చేశారు. 456 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ చేశారు.
వికారాబాద్ జిల్లాలో..
బొంరాస్పేట : జిల్లాలో కంటి వెలుగు వైద్య శిబిరాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. శిబిరాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. గ్రామాలు, మున్సిపల్ పరిధిలోని వార్డుల్లో నిర్వహించే వైద్య శిబిరాలకు ప్రజలు ఉత్సాహంగా తరలివచ్చి కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు. 42 కంటి వెలుగు కేంద్రాల్లో వైద్య బృందాలు అప్పటికప్పుడే పరీక్షలు నిర్వహించి కంటి సమస్యలున్న వారికి చుక్కల మందుతో పాటు విటమిన్ మాత్రలు పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వం ఉచితంగా కంటి పరీక్షలు చేసి కండ్లద్దాలు పంపిణీ చేస్తుండడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం జిల్లాలో 5,404 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 553 మందికి రీడింగ్ గ్లాసులు పంపిణీ చేయగా, 529 మందికి అద్దాలను ఆర్డరిచ్చారు. ఇదిలా ఉండగా జిల్లాలో ఇప్పటి వరకు 477 గ్రామాలు, 88 వార్డుల్లో కంటి వెలుగు వైద్య శిబిరాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.