కడ్తాల్, జూలై 31 : గ్రామాలు, తండాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. శనివారం మండల పరిధిలోని గోవిందాయిపల్లి గ్రామానికి ట్రాక్టర్ కొనుగోలుకు ప్రత్యేక గ్రాంటు మంజూరుకు, మైసిగండి గ్రామం నుంచి గోవిందాయిపల్లి గ్రామం వరకు బీటీ రోడ్డును నిర్మించాలని, గ్రామంలో సీసీ రోడ్లు నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ సర్పంచ్ రవీందర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు, సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానన్నారు. గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి పనుల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. అలాగే మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయం నిర్మాణానికి త్వరలో భూమి పూజ చేస్తామని, అభివృద్ధిలో కడ్తాల్ మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుదామని అన్నారు. నియోజకవర్గంలో డీడీలు కట్టిన ప్రతి ఒక్కరికి త్వరలో సబ్సిడీ పశువులను అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, ఉప సర్పంచ్లు ఎల్లాగౌడ్, రామకృష్ణ, నాయకులు శ్రీశైలం, ఈదమయ్య, బాల్రాజ్ తదితరులు పాల్గొన్నారు.