యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ఈ నెల14వ తేదీ వరకు బాలాలయంలో ఆంతరంగికంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో ఎన్. గీత తెలిపారు. 11 రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలను నవాహ్నిక దీక్షతో పాంచరాత్రాగమశాస్త్రం, భగవద్రామానుజ సంప్రదాయ సిద్ధంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని ఆమె తెలిపారు.
– యాదాద్రి, 3
యాదాద్రీశుడి క్షేత్రంలో ప్రతిఏటా ఫాల్గుణ మాసంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఉత్సవాలను మొదటగా సృష్టికర్త ప్రారంభించడంతో బ్రహ్మోత్సవాలు అన్న పేరు స్థిరపడింది. ఈ ఉత్సవాలతో స్వామిక్షేత్రం 11 రోజుల పాటు ముక్కోటి దేవతలకు విడిదిగా మారుతుందని అర్చకులు చెబుతున్నారు. పూర్వం స్వామివారి సన్నిధిలో వేదమంత్ర ఘోషలు వినిపించేవని చెబుతుంటారు. బ్రహ్మోత్సవ వేళ యాదగిరి వేదగిరి అని ప్రాచీన నామాన్ని సార్థకం చేసుకుంటుంది. ఈ సందర్భంగా సకల దేవతలను శాస్ర్తోక్తంగా ఆహ్వానించి వేదోక్తంగా పూజలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తున్నది. విశ్వక్సేన పూజలతో మొదలైన ఉత్సవాలు స్వయంభువులకు నిర్వహించే అష్టోత్తర శతఘటాభిషేకంతో పరిపూర్ణం అవుతాయి. మొదట ధ్వజారోహణంలో మహావిష్ణువు వాహనమైన గరుత్మంతుడికి పూజలు నిర్వహిస్తారు. మూడోరోజు నుంచి స్వామివారి అలంకార సంబరా లు జరుపుతారు. ఏడు, ఎనిమిది, తొమ్మిది రోజుల్లో విశేష పర్వాలైన ఎదుర్కోలు, తిరుకల్యాణ మహోత్సవం, రథయాత్ర నిర్వహిస్తారు. పదోరోజున చక్రతీర్థ స్నానం నిర్వహిస్తారు.
పంచనారసింహుడిగా విరాజిల్లుతున్న పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయం లో వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 4వ తేదీ స్వస్తి ప్లవనామ సంవత్సర ఫాల్గుణ శుద్ధ విదియ శుక్రవారం రోజు నుంచి ప్రారం భం కానున్నాయి. మార్చి 14న ఫాల్గుణ శుద్ధ ద్వాదశి సోమవారం రోజున డోలోత్సవం తో ముగుస్తాయి. ఉత్సవాల్లో 60 నుంచి 70 మంది రుత్వికులు, ఆచార్యులు , పండితులు పాల్గొననున్నారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి వారం రోజుల పాటు అలంకార సేవలను నిర్వహించనున్నారు. 6వ తేదీ ఉదయం 11గంటలకు మత్స్యావతారం, రాత్రి 9 గంటలకు శేషవాహన సేవ, 7న ఉదయం 11గంటలకు వటపత్రశాయి అలంకారసేవ, రాత్రి 9గంటలకు హంసవాహన అలంకార సేవ, 8న ఉదయం 11గంటలకు కృష్ణాలంకారసేవ(మురళీకృష్ణుడు), రాత్రి 9గంటలకు పొన్నవాహన సేవ, 9వ తేదీన గోవర్ధనగిరిధారిగా అలంకారం, రాత్రి 9గంటలకు సింహవాహన సేవ, 10వ తేదీన ఉదయం 11గంటలకు జగన్మోహిని అలంకార సేవ, రాత్రి 9గంటలకు అశ్వవాహనసేవ, బాలాలయంలో స్వామివారికి ఎదుర్కోలు ఉత్సవం, 11వ తేదీన ఉదయం 9 గంటలకు శ్రీరామ అలంకార సేవ(హనుమంత వాహన సేవ), రాత్రి 11 గంటలకు గజవాహన సేవలో బాలాలయంలో తిరుకల్యాణ మహోత్సవం, 12వ తేదీన ఉదయం 11 గంటలకు శ్రీమహావిష్ణు అలంకార సేవలను నిర్వహించనున్నారు.
యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉం చుకుని యాదాద్రి కొండపైన గల బాలాలయంలో నేటి నుంచి ఈ నెల 14వ తేదీ వరకు నిత్యకల్యాణోత్సవం, శాశ్వత కల్యాణం, నిత్య, శాశ్వత బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమం, మొక్కు సేవలను రద్దు చేస్తున్నారు. స్వామి వారి రాత్రి నివేదన అర్చన తదుపరి 8.15నుంచి 9.00గంటల వరకు బలిహరణ, ఆరగింపు రద్దు చేయనున్నారు. 10వ తేదీ నుంచి 12తేదీ సాయంత్రం భక్తులచే నిర్వహించే అర్చనలు, బాలభోగాలు నిలిపివేస్తున్న ట్లు ఆలయ ఈవో తెలిపారు. 13వ తేదీ నుంచి 14 వ తేదీ వరకు ఉదయం భక్తులతో నిర్వహించే అభిషేకం, అర్చనలను రద్దు చేస్తున్నారు.
లక్ష్మీనరసింహ స్వామికి ప్రభుత్వం తరఫున పట్టు వస్ర్తాలను రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి సమర్పించనున్నారు. ఆలయం తరఫున ఈవో ఎన్.గీత, అనువంశిక ధర్మకర్త, టీటీడీ తరఫున టీటీడీ ఆలయ ఈవో, పోచంపల్లి చేనేత సంఘం, గద్వాల్, కొత్తకోట ఆధ్వర్యంలో స్వామి, అమ్మవార్లకు పట్టువస్ర్తాలను సమర్పించనున్నారు.
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి బాలాలయంలో ఈ నెల 11న ఉదయం 11గంటలకు జరుగనున్న తిరుకల్యాణ మహోత్సవంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి పాల్గొననున్నారు.
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ప్రధానాలయ పునర్నిర్మాణాలు పూర్తయి పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో మార్చి 21నుంచి 28వ తేదీ వరకు మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా యాదగిరిగుట్ట పట్టణంలోని పాత హైస్కూల్ మైదానంలో జరిగే స్వామివారి తిరుకల్యాణోత్సవంతో పాటు దివ్య విమాన రథోత్సవాలను ఈ ఏడాది నిర్వహించడం లేదు. బాలాలయంలోనే స్వామివారి తిరు కల్యాణం, రథోత్సవం నిర్వహించనున్నారు.