రాష్ర్టాభివృద్ధి సాధకుడు, పేదల పెన్నిధి, మహానేత సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా అంబరాన్నంటాయి. హరిత ప్రేమికుడి జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులు ఊరూరా మొక్కలు నాటారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి కేక్లు కట్ చేసి ఒకరినొకరు స్వీట్లు తినిపించుకున్నారు. మసీదులు, చర్చిల్లోనూ ప్రార్థనలు చేశారు. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి అద్భుతమైన సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని సబ్బండ వర్గాలు కోరుకున్నాయి. మహేశ్వరం నియోజకవర్గంలోని మన్సాన్పల్లిలో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి మొక్కలు నాటడంతోపాటు ప్రజల మధ్య కేక్ కట్ చేసి సీఎం కేసీఆర్ బర్త్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు
రంగారెడ్డి, ఫిబ్రవరి 17, (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను జిల్లావ్యాప్తంగా సంబురంగా నిర్వహించారు. జిల్లా అంతటా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో పార్టీ ప్రజాప్రతినిధులు, శ్రేణులు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి మొక్కలు నాటారు. మహేశ్వరం మండలం మన్సాన్పల్లిలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి, మొయినాబాద్ మండల కేంద్రంలో చేవెళ్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కాలె యాదయ్య ఈ సందర్భంగా మొక్కలు నాటారు. షాద్నగర్ నియోజకవర్గ కేంద్రంతోపాటు కొత్తూరులో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, ఆమనగల్లు మండల కేంద్రంలో కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజల కలను సాకారం చేసి, రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో సీఎం కేసీఆర్ తీసుకెళ్తున్నారని మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని మన్సాన్పల్లిలో మొక్కలు నాటడంతోపాటు ప్రజల మధ్యలో కేక్ కట్ చేసి సీఎం కేసీఆర్ బర్త్ డే వేడుకలు నిర్వహించారు. రైతన్నకు అండగా ఉంటూ ప్రతి ఎకరాకు సాగునీరందించాలనే సంకల్పంతో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరాన్ని మూడేండ్లలో పూర్తి చేసి సాగు నీరందించిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే రైతుబంధు, రైతుబీమా, దళితబంధులాంటి పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకుగాను మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లకు ఆర్థిక భరోసాను కల్పిస్తున్నారన్నారు.
సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను గురువారం వికారాబాద్ జిల్లాలో సంబురంగా నిర్వహించారు. టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు జిల్లా పరిధిలో మూడు రోజులపాటు సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు జరిపారు. టీఆర్ఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అనంతగిరి శ్రీ అనంతపద్మనాభ స్వామి ఆలయంలో సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని పూజలు చేశారు. అనంతరం శివారెడ్డిపేట్ దర్గాలో ప్రార్థనలు జరిపారు. వికారాబాద్ మెథడిస్ట్ చర్చిలో ఎమ్మెల్యే ఆనంద్ ప్రార్థనలు చేసి కేక్ కట్ చేశారు. పరిగిలోని ఎమ్మెల్యే స్వగృహంలో సర్వమత ప్రార్థనలతోపాటు పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి కేక్ కట్ చేశారు. అనంతరం మొక్కలు నాటారు. కొడంగల్ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పూజలు చేశారు. తాండూరు పట్టణంలో సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ సునీతామహేందర్రెడ్డి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పార్టీ నాయకులు కేక్ కట్ చేసి, మొక్కలు నాటారు.