Atmanirbhar Bharat | కరోనా వైరస్ ( coronavirus ) విస్తృతంగా వ్యాపిస్తున్న తరుణంలో చితికిపోతున్న చిరువ్యాపారులకు ఆర్థిక సహకారాన్ని అందించాలన్న లక్ష్యంతో కేంద్రం 2020 జూన్ 1న ఆత్మనిర్భర్ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. అందులో భాగంగా బల్దియా పరిధిలోని చిరు వ్యాపారులు, వీధి విక్రయదారులను గుర్తించి వారికి 10వేలు రుణం అందించి ఇవ్వాలని సంకల్పించింది. సిరిసిల్ల ( Sircilla ) పట్టణ జనాభా 92,092. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆత్మనిర్భర్ పథకం అమలులో 5శాతం మంది చిరువ్యాపారులకు రుణాలు అందించాలి. కాగా, అధికారులు మొత్తం 6,680 మందిని ఈ పథకంలో అర్హులుగా గుర్తించగా, 5,935 మంది రుణాల కోసం దరఖాస్తులు చేరుకున్నారు. అన్ని అర్హతలను పరిగణలోకి తీసుకున్న అధికారులు వీరిలో 4,968మందికి రుణాలు పంపిణీ చేశారు.
ఆత్మనిర్భర్ పథకంలో భాగంగా లక్ష్యాన్ని చేరుకోవడం కోసం బల్దియా అధికారులు పకడ్బందీ కార్యాచరణ అమలుచేశారు. కమిషనర్ వెల్దండి సమ్మయ్య పర్యవేక్షణలోని మెప్మా, మున్సిపల్ అధికారులను వార్డుల వారీగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. రోడ్ల వెంట ఉన్న చిరు వ్యాపారులను గుర్తించడంతోపాటు దరఖాస్తు చేసుకున్న వారి అర్హత వివరాలను ఇంటింటికీ వెళ్లి సేకరించారు. రుణాల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బ్యాంకర్లతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు 4,968మందికి రుణాలు పంపిణీ చేయగా వారి నుంచి ప్రతి నెలా వసూళ్లు క్రమంగా జరిగేందుకు ప్రత్యేక సిబ్బందిని కేటాయించారు.
లక్షలోపు జనాభా కలిగిన మున్సిపాలిటీలో 5శా తం చిరు వ్యాపారులు, వీధివిక్రయదారులను గు ర్తించి వారిని ఆత్మనిర్భర్ పథకంలో చేర్చడంలో ము న్సిపల్ అధికారులు సఫలీకృతమయ్యారు. మొత్తం 4,968 మందికి 4కోట్ల 96లక్షల, 80 వేల రుణాలు ఇప్పటివరకు పంపిణీ చేశారు. ము న్సిపల్ జనాభాలో 5శాతం చిరువ్యాపారులకు ఆత్మనిర్భర్ రుణాలు అందించాలన్న కేంద్ర ప్రభు త్వం లక్ష్యం చేరుకోవడంతో సిరిసిల్ల బల్దియాకు జాతీ యస్థాయిలో ప్రథమ ర్యాంకు కేటాయించింది.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆత్మనిర్భర్ పథకం అమలు కోసం పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళ్లాం. మెప్మా అధికారులు, బ్యాంకర్లు, ఆర్పీలు అందరూ సమష్టిగా కృషి చేశారు. స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం కూడా తీసుకున్నాం. అందరి సహకారంతో జాతీయ స్థాయిలో నిర్వహించిన సర్వేలో ప్రథమ స్థానంలో నిలిచాం. చిరు వ్యాపారులకు ఈ రుణాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి.
– వెల్దండి సమ్మయ్య, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్
కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ఆత్మనిర్భర్ పథకం అమలు చేయడం చిరు వ్యాపారులకు చేయూతగా నిలిచింది. రుణాలు అందించేందుకు అర్హులైన చిరు వ్యాపారులను గుర్తించడంలో అధికారులు విజయవంతమయ్యారు. ఇంటింటికీ వెళ్లి అర్హుల జాబితాను సిద్ధం చేసి రుణాలు అందించాం. సిద్దం చేసి రుణాలు అందించాం. కరోనాతో నష్టపోయిన వారికి ఈ రుణ సహాయం ఆర్థిక ఎదుగుదలకు ఉపయోగకరంగా మారింది.
– జిందం కళ, సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్