నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు తేలిపోయింది. కరెంటు కోతలతో రైతులు ఆగమైపోతున్నరు. సాగునీరందక పంటలు ఎండిపోతున్నయి. రైతుల గురించి ఒక్కో మంత్రి ఒక్కో మాట మాట్లాడుతున్నడు. రైతుల పక్షాన బాధ్యత తీసుకునే వారు కరువైన్రు. వచ్చే ఆగస్టులోగా రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెట్టడం కాదు, దమ్ము ధైర్యం ఉంటే భార్య పిల్లలపై ఒట్టు వేసి చెప్పాలి.
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఇది చేస్తాం.. అది చేస్తాం అని నమ్మించిన్రు. కానీ ఏదీ చేయలే. రేవంత్ రెడ్డి వందరోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తమన్నవ్. డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తానన్నవ్. అన్నింటికీ ఎగనామం పెడితివి. ఆడబిడ్డ పెండ్లి చేసుకుంటే కల్యాణలక్ష్మి కింద తులం బంగారం అని చెప్పి ఇనుప ముక్క కూడా ఇప్పటివరకు ఇవ్వకపోతివి. ప్రజలందరికీ నేనొక్కటే చెబుతున్నా. ఇలాంటి దొంగల మాటలు నమ్మద్దు. మరోసారి మోసపోవద్దు. ప్రజలారా ఇప్పటికైనా మేల్కోవాలి. తెలంగాణ గొంతుకైన బోయినపల్లి వినోద్ కుమార్ను గెలిపించుకోవాలి. వచ్చేనెల 10న సిరిసిల్లలో కేసీఆర్ రోడ్షోకు కార్యకర్తల పెద్ద సంఖ్యలో తరలిరావాలి.
– ప్రజలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ పిలుపు
రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ)/కోనరావుపేట, ఏప్రిల్ 25: మాయమాటలు చెప్పి, దేవుని పేరు చెప్పి ఓట్లు అడిగేవారిపై జాగ్రత్తగా ఉండాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇప్పటికే మోసగాళ్ల చేతిలో మోసపోయారని, మరోసారి మోసపోతే మనది మనమే మోసపోయినట్లు అవుతుందని చెప్పారు. తెలంగాణ గొంతుక బోయినపల్లి వినోద్కుమార్ను కరీంనగర్ ఎంపీగా గెలిపించాలని కోరారు. మే 13న కారు గుర్తుకు ఓటేసి ఢిల్లీలో తెలంగాణం వినిపించేలా చూడాలని కోరారు. సిరిసిల్ల తెలంగాణ భవన్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అధ్యక్షతన గురువారం నిర్వహించిన ముస్తాబాద్, గంభీరావుపేట, తంగళ్లపల్లి క్లస్టర్స్థాయి కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్లమెంట్ ఎన్నికలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. గురువారం రాత్రి కోనరావుపేటలోని అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన రోడ్ షోకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆధికారంలోకి రావాలనే ఆశతో అరచేతిలో వైకుంఠం చూపించిందని విమర్శించారు. ఇంట్లో ఉండే అత్తకోడళ్లకు 2500, కల్యాణలక్ష్మి కింద తులం బంగారం, రెండు లక్షల రుణమాఫీ, పెన్షన్ 4వేలు ఇలా 420 హామీలు ఇచ్చి వాటిని తుంగలో కలిపిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని విమర్శించారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో 24 గంటల కరెంటు, వ్యవసాయానికి ఇవ్వడం జరిగిందని, కాంగ్రెస్ వచ్చినంక కరెంటు లేదు, రైతుబంధు లేదు, దళిత బంధు ఇవ్వలేదని దుయ్యబట్టారు. పచ్చని మాగాణితో కళకళలాడుతున్న తెలంగాణను నీళ్లియ్యక నెర్రెలు బారి ఎండబెట్టారని వివరించారు. కేసీఆర్ ఇచ్చిన రైతుబంధును ఇవ్వనోడు రుణమాఫీ ఎలా చేస్తాడని ప్రశ్నించారు.
తెలంగాణ ప్రజల పరిస్థితి ఇప్పుడు పాలిచ్చే బర్రెను అమ్ముకుని దున్నపోతును కొనుక్కున్నట్లు అయిందన్నారు. ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ అభివృద్ధికి రూపాయి కొత్తలు కూడా తేలేదని విమర్శించారు. ఏమున్నా టీవీలో కనబడడం తప్ప ఇప్పటివరకు ఒక్కసారి కోనరావుపేటకు రాలేదన్నారు. దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం తప్ప చేసింది ఏమీలేదని వివరించారు. కాంగ్రెస్ నాలుగు నెలల పాలనలోనే సిరిసిల్ల ఉరిసిల్లగా మారుతున్నదని, ఇప్పటికే ఎందరో నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు, ఎంపీపీ చంద్రయ్యగౌడ్, సింగిల్ విండో చైర్మన్లు నర్సయ్య, రామ్మోహన్రావు, సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, పార్టీ మండలాధ్యక్షుడు మల్యాల దేవయ్య, మహిళా విభాగం మండలాధ్యక్షురాలు చీటి సంధ్య పాల్గొన్నారు.
బండి సంజయ్ ధర్మం, ధర్మం అనడం తప్ప ఒక ఎంపీగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించలేదు. కరీంనగర్ అభివృద్ధికి నయా పైసా తేలేదు. ఎనుకటి నుంచి అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పాలు గుడ్డు, కూలీలకు కల్పించే ఉపాధి పనిని కూడా ఆయన చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది. బీఆర్ఎస్ ఎంపీలు గెలిచి ఏం చేస్తారని కొన్ని పార్టీల నాయకులు మాట్లాడుతున్నరు. వారికి నేనొక్కటే చెబుతున్నా. ఆనాడూ తెలంగాణ ఉద్యమ టైంలో ఐదుగురు ఎంపీలం దేశంలోని 32 రాజకీయ పార్టీలను ఏకం చేసి తెలంగాణ తెచ్చుకున్నం. కేసీఆర్ నాయకత్వంలో స్మార్ట్ సిటీ, జాతీయ రహదారులు, రైలు కోసం కొట్లాడి తెచ్చినం. ఇవన్నీ బీఆర్ఎస్ ఎంపీలతోనే సాధ్యమైనయి. ఇగ బీజేపీ నుంచి నలుగురు ఎంపీలు గెలిచి కనీసం తెలంగాణ బిడ్డల కోసం నవోదయ పాఠశాల కూడా తేలేదు. కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో కోనరావుపేటలోని మల్కపేట రిజర్వాయర్తో పాటు నిమ్మపల్లి మూలవాగు ప్రాజెక్టు జీవనదిగా మారేలా లిప్ట్ పనులు చేపట్టినం. రోడ్లు, బ్రిడ్జిల కోసం 50కోట్లు కేటాయించాం. ఇవన్నీ బీఆర్ఎస్తోనే సాధ్యమైనయి రానున్న ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించాలి.
– బోయినపల్లి వినోద్కుమార్, కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి