ఆడబిడ్డలకు అండగా కల్యాణలక్ష్మి
మెరుగైన వైద్యం కోసమే వరంగల్లో సూపర్ స్పెషాలిటీ దవాఖాన
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్, కల్యాణ లక్ష్మి చెక్కుల అందజేత
కృష్ణకాలనీ, జూన్ 22 : పేద ప్రజల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భూపాలపల్లి మండలంలోని 68 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు, 46 మంది లబ్ధిదారులకు రూ.15,60,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద ప్రజలకు అత్యాధునిక వైద్యసేవలందించేందుకు సీఎం కేసీఆర్ వరంగల్ సెంట్రల్ జైలును కూలగొట్టి 33 అంతస్తుల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టించేందుకు భూమిపూజ చేసినట్లు తెలిపారు. త్వరలోనే వరంగల్లో పేద ప్రజలకు ఖరీదైన వైద్యం అందనుందన్నారు. అంతేకాకుండా వరంగల్కు వెటర్నరీ, డెంటల్ కాలేజీని కూడా మంజూరు చేసినట్లు చెప్పారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిర్మితమైన 100 పడకల వైద్యశాలలో 40మంది సిబ్బందిని నియమించడానికి మంత్రి వర్గ సమావేశం ఆమోదం తెలిపిందని, త్వరలోనే ఆ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు.
కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని కోరారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు రాష్ట్రంలోని ప్రతి ఇంటికి అందుతున్నాయన్నారు. ఆడబిడ్డల కోసం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలతో రాష్ట్రంలో బాల్య వివాహాలు చాలా వరకు తగ్గాయన్నారు. రూ.5 కోట్లతో చెల్పూర్ రోడ్ను అభివృద్ధి చేస్తామని, త్వరలోనే పనులను ప్రారంభిస్తామని చెప్పారు. జూలై ఒకటి నుంచి పట్టణ, పల్లె ప్రగతి పసనులు ప్రారంభం కానున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్పర్సన్ కళ్లెపు శోభారఘుపతిరావు, మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణీ సిద్దు, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, ఎంపీపీ మందల లావణ్య, పీఏసీఎస్ చైర్మన్ మేకల సంపత్, టీఆర్ఎస్ అర్బన్, మండల ఆధ్యక్షుడు క్యాతరాజు సాంబమూర్తి, మందల రవీందర్ రెడ్డి, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.