వేధిస్తున్న కూలీల కొరత
కోత యంత్రాలకు పెరిగిన డిమాండ్
సమయం ఆదా అవుతుందంటున్న అన్నదాతలు
కృష్ణ, ఏప్రిల్ 25 : మండలంతోపాటు ఆయా గ్రామాల్లో వరి కోతలు కొనసాగుతున్నాయి. సకాలంలో వర్షాలు కురువడంతో సాగు నీటికి కొరత లేకపోవడంతో వేల ఎకరాల్లో రైతులు వరి పంటలను సాగు చేశారు. అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం కోట్లు వెచ్చించి భారీ ప్రాజెక్టులు నిర్మించడం, పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మరమ్మతులు చేయడంతో లిఫ్ట్ల ద్వారా వరి సాగుకు నీరు పుష్కలంగా అందడంతోపాటు నిరంతరంగా విద్యుత్ సరఫరాతో ఈ ప్రాంతంలో వరి సాగు అధికంగా చేపట్టారు. మండలంలో బోర్ల దగ్గర 15 వందల ఎకరాలు, బావుల వద్ద 90 ఎకరాలు, కెనాల వద్ద 1,160 ఎకరాలు, చెరువుల కింద 239 ఎకరాలు, ఎత్తిపోతల పథకం కింద, కృష్ణా నదీ తీరాన 6,794 ఎకరాల సాగు చేశారు. మొత్తం వరి సాగు మండలంలో 9,784 ఎకరాలు సాగు చేశారని వ్యవసాయాధికారులు తెలిపారు. మండలంలో అధిక మొత్తంలో వరి సాగు చేయడంతో కూలీల కొరత ఏర్పడింది. దీంతో ఉపాధి హామీ పథకంలో కూలీ రేట్లు పెరుగడంతో వ్యవసాయ పనులకు కూలీలు లభించడం లేదు.
కూలీల కొరత ఏర్పడడంతో అన్నదాతలు యంత్రాలతో కోతలు చేపట్టారు. యంత్రాల వినియోగంతో త్వరగా పనులు కావడం, ఒకరోజే ధాన్యాన్ని ఇంటికి తీసుకెళ్లే అవకాశం ఏర్పడడం. సమయం ఆదా అవుతున్నది. దీంతో యంత్రాలకు భారీగా డిమాండ్ పెరిగిపోయింది. వరి కోతకు యంత్రాలు ఇతర రాష్ర్టాల నుంచి ఇక్కడికి తీసుకొస్తారు. ఎకరా పొలం వరి కోతకు రూ.3000-3,500 ఉంటుంది. కూలీల కొరతతో సాగుకు దూరమైన అన్నదాతలు అధునాతన పరికరాలు రావడంతో వ్యవసాయం వైపు ఆకర్షితులవుతున్నారు. వరి సాగుకు యంత్రాలతో పనులు చకచకా జరుగుతుండడంతో ముఖ్యంగా దుక్కిదున్నడం, నారువేయడం, కోతలు కోయడం వంటి పనులన్నీ యంత్రాలతోనే చేపట్టడంతో అన్నదాతలు వ్యవసాయంపై ఆసక్తి కనబరుచుతున్నారు.