కాకతాళీయమే అయినా, కొవిడ్ సమస్యకు మౌలికంగా పర్యావరణంతో సంబంధాన్ని చూస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ శనివారం నాడు చెప్పిన మాటలు, ప్రముఖ అంతర్జాతీయ సోషలిస్టు పత్రిక ‘మంత్లీ రివ్యూ’ తాజా సంచిక ప్రచురించిన వ్యాసం ఒకే విధంగా ఉండటం గమనార్హం. కొవిడ్కు కారణమేమిటి, చికిత్స ఏది? అనే ప్రశ్నలపై ఎడతెగని చర్చోపచర్చలు ఎట్లా సాగి ఏమి తేల్చినా, అంతిమమైన మౌలిక సత్యం మాత్రం మానవుడు పర్యావరణంతో నెరపుతున్న సంబంధం ఎటువంటిదన్నదే.
ప్రకృతి వనరులను యథేచ్ఛగా కొల్లగొట్టటం, అవసరాలకు మించి దురాశలు, ప్రపంచాన్నంతా దోపిడీ చేయటం.. వంటివాటితో పర్యావరణాన్ని ఒకవైపు, పర్యావరణానికి మానవునికి గల సమతులన సంబంధాన్ని మరొకవైపు ధ్వంసం చేయటం మొదలైంది. అటువంటి విధ్వంసంలో భాగంగా ఆరోగ్యాలు ఛిన్నాభిన్నమయ్యాయి.
ఈనెల 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేస్తూ, “పర్యావరణ పరిరక్షణను మించిన సంపద మరొకటి లేదనే విషయం ప్రస్తుతం కరోనా సమయంలో మరొకసారి రుజువైంది”అని అన్నారు. ఆయనది క్లుప్తమైన సందేశమే గాని వివరమైన వ్యాసం కాదు. కరోనాకు, పర్యావరణ పరిరక్షణకు సంబంధాన్ని చూడటంలో తన మేధస్సులో ఏమేమి ఆలోచనలు ఉన్నాయో మనకు తెలియదు. అయితే ఒకటి చెప్పవచ్చు. పర్యావరణ పరిరక్షణ అనగానే స్థూల దృష్టికి చెట్ల పెంపకం అనే మాట ఒక్క టే స్ఫురిస్తుంది. తనది అటువంటి పరిమిత దృష్టికాదు. పర్యావరణ పరిరక్షణ కోసం మంచినీటి సరఫరా సహా ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలను ఆయన ప్రస్తావించారు. ఇవి కరోనా సందర్భంలో ఆరోగ్య పరిరక్షణతో నిమిత్తం గలవి అనేది గుర్తించవలసిన విషయం.
కేసీఆర్ మరికొన్ని కీలకమైన వ్యాఖ్యలు ఇతర సందర్భాలలో చేస్తూ వస్తున్నారు. వాటివైపు తిరిగి వచ్చే ముందు, ‘మంత్లీ రివ్యూ’ పత్రిక వ్యాసం ఏమన్నదో ఒకసారి చూద్దాం. ‘పెట్టుబడి మరియు వ్యాధులయొక్క పర్యావరణం’(Capital and the Ecology of Disease ) అనే శీర్షికతో ఆ పత్రిక సంపాదకుడు జాన్ బెలామీ ఫాస్టర్, బ్రెట్ క్లార్క్, హన్నా హోల్మన్ రాసిన వ్యాసమది. ఆ ముగ్గురూ వేర్వేరు పాశ్చాత్య విశ్వవిద్యాలయాలలో సోషియాలజీ ప్రొఫెసర్లు. వ్యాసం వెలువడింది ఈ జూన్ సంచికలోనే. పర్యావరణానికి, వ్యాధులకు గల సంబంధం ఎటువంటిదో క్రీ.పూ. 400 కాలంలోనే గ్రీకు తత్తవేత్త హిపోక్రటిస్ చేసిన చర్చతో వారి వ్యాసం మొదలవుతుంది. ఆ తత్తవేత్త రాసిన గ్రంథం పేరు ‘వాయువులు, జలాలు, ప్రదేశాలు’. ఇందులో అంతర్నిహితంగా మొక్కలు, చెట్లు అనే అర్థం కూడా వస్తుంది. వీటి అన్నింటికి, అక్కడ నివసించే మానవులకు మధ్య సమతులమైన సంబంధం, సమ తులనమైన పరిరక్షణ ఉన్నప్పుడే ఆరోగ్య పరిరక్షణ కూడా జరుగుతుంది. ఈ సంబంధాలు, సమతులనాలు, పరిరక్షణలన్నవి పర్యావరణ పరమైనవి, సామాజికమైనవి కూడా.
వాస్తవానికి పర్యావరణ ప్రాముఖ్యతను, దానికి ఆరోగ్య పరిరక్షణతో, సమాజ భద్రతతో గల సంబంధాలను భారతీయులతో పాటు పలు ఇతర సమాజాల తత్తవేత్తలు కూడా గుర్తించి చెప్పారు. కాని తేడా వచ్చింది ఆధునీకరణ అనబడే దానితోనే. పారిశ్రామికీకరణలు, అధికోత్పత్తులు, ఆధునిక సాంకేతికతలు, మార్కెట్లు, వలస రాజ్యాలు, పెట్టుబడిదారీ విధానాలు ప్రకృతి వనరులను యథేచ్ఛగా కొల్లగొట్టటం, అవసరాలకు మించి దురాశలు, ప్రపంచాన్నంతా దోపిడీ చేయ టం, దీనంతటికి అవసరమైన సైనిక బలగాలు, అత్యాధునిక ఆయుధ సంపత్తులు, యుద్ధాలు.. వంటివన్నీ ఈ సోకాల్డ్ ఆధునీకరణ పరిధిలోకి వచ్చాయి. ఇది యావ త్తూ పాశ్చాత్య ప్రపంచాన్ని కేంద్రంగా చేసుకొని సాగింది. అక్కడి నుంచి ఇతర దేశాలకు వ్యాపించింది. పర్యావరణాన్ని ఒకవైపు, పర్యావరణానికి మానవునికి గల సమతులన సంబంధాన్ని మరొకవైపు ధ్వంసం చేయటం మొదలైంది. అటువంటి విధ్వంసంలో భాగంగా ఆరోగ్యాలు చిన్నాభిన్నమయ్యాయి. వైద్యం సైతం ఈ శక్తుల చేతిలో సహజంగానే వ్యాపారంగా మారింది.
ఈ తరహా ఆధునీకరణలు, వాటి వల్ల ప్రకృతి, మానవ ఆరోగ్య విధ్వంసాలను గ్రీకు, భారతీయ తత్తవేత్తలే ఊహించగల అవకాశం లేదు. దీనిని మొదట పసికట్టి రాసినవాడు బెర్నార్డినో రమాజ్జిని (1633-1714)అని మంత్లీ రివ్యూ వ్యాసం పేర్కొంటున్నది. ఆయన గ్రంథం పేరు ‘ద డిసీజెస్ ఆఫ్ వర్కర్స్’. ఆ తర్వాత ఈ తరహా అధ్యయనా లు అన్ని ఖండాలలో జరిగాయి. ఇటువంటి పరిణామాల వల్లనే ప్రపంచమంతటా పర్యావరణ పరిరక్షణ ఉద్యమా లు మొదలయ్యాయి. ‘భూమి అందరి అవసరాలను తీర్చగలదు గాని దురాశలను కాద’ని గాంధీజీ హెచ్చరించటానికి గల నేపథ్యం ఇదే. సరిగా ఇటువంటి అవగాహనతోనే, వేర్వేరు మాటలలో ఇదే విధమైన హెచ్చరికలను కేసీఆర్ మొదటినుంచీ చేస్తూ వస్తున్నారు. ఆయన ఈ శనివారం చేసిన ప్రకటన ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆలోచన కాదు.
కరోనా విషయానికి వస్తే.. మనుషులు జీవాయుధాలను,రసాయన ఆయుధాలను ఉపయోగించటం క్రీస్తు పూర్వం నుంచే ఉందని ఆధునిక కాలంలోనూ అనేక దేశాలు చేస్తాయని, ఎక్కువ మందికి తెలియకపోవచ్చు. ఇప్పుడు వాటికి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, 3-డి టెక్నాలజీలను జోడించటం పెద్ద దేశాలన్నీ చేస్తున్నాయని కూడా తెలియకపోవచ్చు. ఇటువంటి పరిస్థితుల మధ్య, ఇతర పెట్టుబడిదారీ దేశాలకు తనకు మధ్య ఎక్కువ తేడా ఏమీలేకుండా తయారైన చైనానుంచి కరోనా క్రిమి బయటపడింది. అది వారు ఉద్దేశపూర్వకంగా చేసినది కాకున్నా, యాక్సిడెంటల్ లీక్ మాత్రమే అయినా లేక సహజమైనా.. ఫలితం ఒకటే అవుతున్నది.
టంకశాల అశోక్