నినాదాల వెంట నిప్పుల వాగై కదిలారు. భావజాలాల జాతరలో ఊరేగింపులయ్యారు. ఇదే అదను కదిలిరమ్మన్నప్పుడల్లా ఉత్తుంగ తరంగాలై పరుగులు పెట్టారు. వెలుగుల కోసం రంగుల జెండాలన్నీ యువ భారతం ఎగురవేసింది. ఏడు దశాబ్దాల జాతి ప్రయాణంలో ఎన్నో సందర్భాల్లో నిప్పురవ్వలై మండిన మన నవతరం ఏ దారెంట నడవాలి? విపణి వీధిలో విజేతలుగా నిలవడంతో పాటు, దేశం ప్రతి మూలలో ఉషోదయానికి కొత్త దారిని అనుసరించక తప్పదు.
అందుకే ఇటీవల చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత యువతరానిదేనని పదే పదే చెప్తున్నారు.
ఎన్నో ఉద్యమాలు, భావజాల ప్రయోగాలు భారతదేశంలో జరిగాయి. మార్క్సిజం, మావో ఆలోచన విధానం, లోహియా వాదం, జేపీ నినాదం, గాంధేయవాదం, అంబేద్కరిజం, కాషాయ సిద్ధాంతం ఇలా ఎన్నో భావజాలాల విస్తరణకు విరామమెరుగని వాహికలుగా దేశ యువతరం పనిచేసింది.
సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వాల మార్పు వెనుక ప్రభావవంతమైన పాత్ర యువతరమే పోషించింది. ఏ దేశ ప్రగతికైనా, ఏ జాతి వికాసానికైనా నవతరమే వెన్నెముక అనే వాస్తవం ఎరుగని వారెవ్వరుండరు. నవతరాన్ని సరైన దారి లో నడిపించగలిగితే, పరిణతి పువ్వులై వికసించే భౌతిక పరిస్థితులు కల్పించగలిగితే, దేశంలో ఇంటిం టా ఆనందం కొలువై తీరుతుంది. ఆ దిశగా మన దేశ పాలకులు యువ భారత్ను నడిపించే ప్రయ త్నం చేశారా? నిరాశ లేని, నూతన ఆవిష్కరణలకు దారి దీపాలుగా యువతరాన్ని తీర్చిదిద్దగలిగారా? అని అన్వేషిస్తే సమాధానం దొరకడం కష్టమే.
మనం ఇప్పుడు జనాభా జాతరలో చైనాను దాటేశాం. ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంగా జెండా పాతేశాం. స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ 2023 నివేదిక ప్రకారం భారతదేశ జనాభా 142.86 కోట్లు. ఇందులో పనిచేసే వయస్సులో (15 నుంచి 65 సం) ఉన్న జనాభా 68 శాతం. విపణిలో అత్యధిక జనాభానే కాదు, అధిక యువ జనాభా కలిగిన దేశం కూడా మనదే. ఈ యువశక్తిని ప్రపంచ మార్కెట్కు వినియోగదారులుగా మలుస్తున్నామా? ఉత్పత్తి శక్తులుగా తీర్చిదిద్దుతున్నామా అన్నదే మన పాలకులు ఆలోచించాల్సింది. కానీ, జాతి జనులు నమ్మిన జాతీయపార్టీలు పార్లమెంట్లో ఫ్లయింగ్ కిస్లపై వాదోపవాదాలు చేయడంలో బిజీగా ఉన్నారు. నిందా, ప్రతినిందా పర్వం నడిపిస్తున్నారు. ఒకరి పాపాలను మరొకరు తవ్వుకుంటున్న కాంగ్రెస్, బీజేపీలు రాజకీయ పురాతత్వ శాస్ర్తాన్ని ప్రజలకు బోధిస్తున్నారు. ఈ పాలకులు నెత్తురు మండే, శక్తులు నిండిన నవతరానికి తొవ్వ చూపెడతారని ఎలా ఆశించగలం? ఈ రాజకీయపార్టీల వలలో చిక్కిన యువత పరిస్థితి ఆవుల కొట్లాటల మధ్య లేగదూడల కాళ్లు విరిగినట్టుగా మారింది. వసంతాన్ని ఆశిస్తే, వంచనను అందించారు ఈ దేశంలోని జాతీయపార్టీల నాయకులు. దాని పర్యవసానంగానే దాదాపు 25 శాతం నిరుద్యోగిత పాపం పాములా యువతరం మెడకు వేలాడుతున్నది.
మౌలిక సదుపాయాలు, నిర్మాణాత్మక ప్రణాళికలు లేకపోవడం వల్ల స్వదేశీ పెట్టుబడులు కూడా విదేశాలకు ఎగిరిపోతున్నాయి. దేశం నుంచి మేధో వలస మాత్రమే కాదు సంపద వలస సాగుతోందని కేసీఆర్ ఆవేదన చెందడం వెనుక ఈ సత్యాలే సలుపుతున్నాయి. సకల సంపదల భారతదేశంలో శక్తియుక్తులున్న యువతకు కొదవేలేదు. కానీ, లోతైన పాలనాదృష్టి కొరవడిన రాజకీయ నాయకత్వం కారణంగా నవతరానికి అవకాశాల కోసం నిత్య సమరం తప్పడం లేదు. వాస్తవానికి ప్రగతే ప్రామాణికంగా ప్రభుత్వం ఉంటే పెట్టుబడులు, కంపెనీలు ఎలా వెతుక్కుంటూ వస్తాయనడానికి తెలంగాణ రాష్ట్రమే ఉదాహరణ. వినూత్న విధానాలతో పారిశ్రామిక వర్గాలను ఆకట్టుకోవడం వల్ల పెట్టుబడిదారులకు తెలంగాణ రాష్ట్రం దేశంలో ప్రధాన గమ్యంగా మారింది. ఎనిమిదేండ్లలోనే దాదాపు 25 లక్షల కోట్ల పెట్టుబడులు, 18 వేల పరిశ్రమలు, తద్వారా 16 లక్షలకు పైగా ఉద్యోగాలు తెలంగాణలో అందుబాటులోకి వచ్చి దేశ పారిశ్రామికరంగ చరిత్రలో వేగంగా, లక్ష్యాలకు మించి సాధించిన రాష్ట్ర ప్రభుత్వంగా తెలంగాణ నిలిచింది. వివిధ కారణాల రీత్యా అవకాశాలకు దూరంగా ఉన్న వర్గాల యువతకు కూడా పారిశ్రామిక ప్రగతిలో వాటా కల్పించడానికి టీ-ఐడియా, టీ-ప్రైడ్ పేరుతో ప్రత్యేక ప్రోత్సాహం అందించింది కేసీఆర్ సర్కార్.
అనుమతుల కోసం విలవిలలాడే పద్ధతులకు చరమగీతం పాడి టీఎస్ ఐపాస్ను అమలుపరిచింది తెలంగాణ ప్రభుత్వం. ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ ద్వారా ఖాయిలా పడ్డ 334 చిన్న పరిశ్రమలకు తిరిగి ఊపిరి పోశారు కేసీఆర్. మూతపడిన రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ, సిర్పూర్ కాగజ్నగర్ పేపర్ మిల్లు, కమలాపూర్ రేయాన్స్ ఫ్యాక్టరీలను మళ్లీ తెరిపించారు. ఇలా ఎన్నో పాలనాచర్యల వల్ల ఐటీనే కాదు ఆటోమొబైల్, ఏరోస్పేస్, ఔషధ రంగాల్లో కూడా పెట్టుబడుల ప్రవాహం సాకారమైంది. తెలంగాణతో పాటు దేశ యువకుల కలలను, నైపుణ్యాలను సంపదగా స్టార్టప్ కంపెనీలు పండించ గలుగుతున్నాయి. ఇవేకాదు, దళితబంధు ద్వారా అణగారిన జాతుల యువతరాన్ని స్వయం ఉపాధి రంగంలో విజేతలుగా నిలుపుతూ కొత్త చరిత్రకు కేసీఆర్ ప్రభుత్వం పురుడుపోసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలా దేశ అధికార పీఠం మీద కూర్చున్న పార్టీలు, ప్రభుత్వాలు పనిచేసి ఉంటే ఏడున్నర దశాబ్దాల స్వతంత్ర భారతదేశం ఎన్ని విజయాలు సాధించి ఉండేదో కదా! విరాటుని కొలువులో పాండవుల మాదిరిగా విదేశాల్లో భారతీయ నవతరం ఉపాధి కోసం ఆశ్రయం పొందే పరిస్థితి ఉండేదే కాదు. చేతుల్లో పట్టాలు, కండ్లల్లో కన్నీటి కుండలు ఇండియాలో ఇంకా ఎంతకాలం? నవతరం న్యూ ఇండియా కోసం నవ్య మార్గంలో సాగే శపథం తీసుకోవాల్సిన చారిత్రక సందర్భం వచ్చింది.
పాత ప్రభుత్వాలతో చితికిపోయిన ప్రజలు, కొత్త ప్రభుత్వాలతో చితికిపోకుంటే చాలని తెలంగాణ కవి చెరబండరాజు అన్నట్టు, దేశంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పెనం మీది నుంచి పొయ్యిలో పడేసేవారికి ఓటెయ్యని చైతన్యాన్ని ఊరూరా రగిలించే బాధ్యత యువకులు ఎత్తుకోవాలి. నూతన పారిశ్రామిక, ఉపాధి కల్పన విధానాలతో పాటు వ్యవసాయ విప్లవానికి బాటలు వేసే ఆలోచనను అందుకోవాలి. నెత్తురు, వెలుతురు కొల్పోతే, ఈ దేశంలో ఆనందం ఎండమావిగా మారిపోతుంది. అందుకే వెలుగుల కోసం నెత్తురు మండే శక్తులు యుక్తిగా నవ్యపథంలో అడుగులు వెయ్యాలి. యువశక్తిని ప్రేమించే కేసీఆర్ నాయకత్వంలో, నిర్దిష్ట ప్రణాళికలతో భారతదేశం అవసరాలు తీర్చే నాయకత్వ పటిమ కేసీఆర్లో తప్ప ఏ దేశ నేతలో ఉందని? అందుకే భావజాలాలను బద్దలుకొట్టి ఆచరణనే నూతన సిద్ధాంతంగా దేశం మూలమూలనా ప్రచారం చేపట్టాలి. ఇప్పుడు న్యూ ఇండియాకు యంగ్ ఇండియానే కాగడాగా మారి దారి చూపించాలి.
దశాబ్దాల కిందటి సూత్రీకరణలు,ఆలోచనా విధానాలతో భారత్కు భారమే తప్ప లాభం లేదు. నేడు నవీన దేశానికి జనం జీవితాల్లోంచి ఏరుకున్న వాస్తవాల పునాదితో కొత్త ఎజెండా ఎత్తిపట్టాలి. నేడు మహారాష్ట్ర యువకులు అలాంటి ఉన్నత రాజకీయ తత్వానికి జై కొడుతున్నారు. కండ్లు నీవే, కాళ్లు నీవే అన్నట్టుగా తెలంగాణ యువతరం, దేశ నవ యువ లోకానికి నాయకత్వం వహించే యజ్ఞంలో తెలివైన పాత్ర పోషించాలి.
ట్రిలియన్ డాలర్ల వృద్ధిలో నవ యువకులు తలెత్తుకొని నిలబడే రోజుల కోసం కదులుదాం. ‘ఎత్తిన జెండా దించమోయ్… మా గులాబీ జెండాకు జై’ అంటూ ముందుకే సాగుదాం. నెత్తురు ధారపోయాల్సిన పనిలేదు, ఒరిగిపోవాల్సిన అవసరం రాదు, కేవలం తెలంగాణ పోరాటం చూపిన దారిలో, కేసీఆర్ అడుగుల వెంట నవతరం నడిస్తే చాలు, నవ భారతం నిజమౌతుంది, మనందరిదవుతుంది.
వ్యాసకర్త: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్
-డాక్టర్ ఆంజనేయ గౌడ్
98853 52242