ఏ రాజకీయ నాయకుడికీ దక్కని ఘనమైన కీర్తి, రాజకీయ పోరాట పటిమ కలిగిన కేసీఆర్కు పొరుగు రాష్ర్టాల్లోనూ అద్భుతంగా ఆదరణ లభిస్తున్నది. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్తో పాటు అనేక రాష్ర్టాల్లోనూ కేసీఆర్కు మద్దతు పెరుగుతుండటం మనమంతా చూస్తున్నాం. 2001, ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించిన అనతికాలంలోనే జనం నుంచి విశేషమైన స్పందన వచ్చింది.
కరీంనగర్లో 2001 మే 17న నిర్వహించిన సింహగర్జనలో సమైక్య పాలకుల గుండెల్లో సమరశంఖాన్ని పూరించారు. తదనంతరం సుప్రీంకోర్టు ఆదేశాలతో 2001 జూలై 12, 15, 17న జరిగిన స్థానిక సంస్థల ఎన్నిక ల్లో రైతు నాగలి గుర్తుతో పెనుసంచలాన్ని సృష్టించింది నాటి టీఆర్ఎస్ పార్టీ. పాలకపక్షానికి ముచ్చెమటలు పట్టించడంతో పాటుగా నిజామాబాద్, కరీంనగర్ జిల్లా పరిషత్ స్థానాలను ఏకపక్షంగా కైవసం చేసుకోవడం ఒక చరి త్ర. జడ్పీ పీఠాలపై గులాబీ జెండాలను ఎగురవేయడం మరుపురాని సన్నివేశం. 1,040 ఎంపీటీసీ స్థానాలతో పాటుగా 87 మండలాల్లో మండల పరిషత్ పీఠాలను టీఆర్ఎస్ కొల్లగొట్టింది. 85 జడ్పీటీసీ స్థానాలు కైవసం చేసుకుంది. సైకిల్, హస్తం పార్టీలను తుత్తునియలు చేసి కేసీఆర్ కలబడి నిలబడి స్థానికసంస్థల ఎన్నికల్లో పెను సంచలనం సృష్టించి నేటికి సరిగ్గా 22 ఏండ్లు పూర్తవుతున్నది. నాటి చారిత్రక పరిస్థితులను ఇప్పుడు నెమరు వేసుకోవాల్సిన అత్యద్భుతమైన తరుణం ఇది.
చరిత్ర పునరావృతం: నాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కేవలం మూడు నెలల్లో పార్టీకి దక్కిన కొత్త గుర్తుతో బరిలో నిలిచి కేసీఆర్ సత్తా చాటారు. ఇప్పుడు కూడా మహారాష్ట్రలో అరంగేట్రం చేస్తోన్న భారత రాష్ట్ర సమితి 22 ఏండ్ల కిందటి రికార్డును తిరగరాస్తుందని, మరాఠీ గడ్డపై సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. కేసీఆర్ శక్తియుక్తుల గురించి తెలిసిన ప్రతి ఒక్కరికీ భవిష్యత్తు కండ్లముందే కదలాడుతుందనడంలోనూ ఆశ్చర్యం లేదు. మహారాష్ట్రలో రాబోయే ఎన్నికల్లో కారు వేగానికి జాతీయపార్టీలు, అక్కడి ప్రాంతీయ పార్టీల కోటలకు బీటలు వారడం ఖాయంగానే కనిపిస్తున్నది. హైదరాబాద్కు వరుస కట్టి గులాబీ కండువాలు కప్పుకుంటోన్న శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నేతల నమ్మకమే కేసీఆర్ సాధించబోయే విజయాలకు నిదర్శనం.
సింహగర్జన స్ఫూర్తితో: కరీంనగర్లో నాడు జరిగిన సింహగర్జన బహిరంగ సభ తీరు ప్రపంచంలోనే ఎక్కడా జరిగి ఉండకపోవచ్చు. హైదరాబాద్ నుంచి కరీంనగర్కు మూడున్నర గంటల్లో సాగే ప్రయాణం కాస్తా జన ప్రవాహంతో 8 గంటలు పట్టడమే ఇందుకు నిదర్శనం. హైదరాబాద్ నుంచి సింహగర్జనకు బయల్దేరిన కేసీఆర్కు అడుగడుగునా జనహారతి దక్కింది. తెలంగాణ వస్తుందా? అనుకున్న వాళ్లకు కేసీఆర్తోనే వస్తుందన్న నమ్మకాన్ని కల్పించింది. నిశ్బబ్ద విప్లవం మాదిరిగా జనం మదిలో పోగై ఉన్న తెలంగాణవాదం కేసీఆర్ రాకతో బద్దలై కన్నారం గడ్డపై గర్జించింది. ఇప్పుడు అదే చరిత్ర.. అదే కేసీఆర్తో రిపీట్ అవుతున్నది.
మహారాష్ట్రను ఏలుతున్నవారిపై నమ్మకం సడలిన మరాఠీయులకు ఆరాధ్యదైవంగా కేసీఆర్ నిలుస్తున్నాడు. అందుకే ఎదురొచ్చి స్వాగతాలు చెప్తున్నారు. గణనీయమైన మద్దతుతో బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేస్తున్నారు. తెలంగాణ స్వరాష్ట్ర సాధనలో గులాబీ జెండా ఇచ్చిన ధైర్యం, నమ్మకం ఇప్పుడేకంగా మరాఠీయులకు సైతం అండగా మారుతున్నది. 2023, ఫిబ్రవరి 5న నాందేడ్ తొలిసభ సక్సెస్ కావడం, మార్చి 26న కందార్లోహ సభతో ప్రభంజనం సృష్టించడం, ఏప్రిల్ 24న ఔరంగాబాద్లో సత్తా చాటడం అచ్చంగా 2001నాటి కరీంనగర్ సింహగర్జన సభతో మొదలైన టీఆర్ఎస్ ప్రస్థానాన్నే యాదికి తెస్తున్నది. అదిప్పుడు బీఆర్ఎస్ రూపంలోనూ నిజం కానుండటం తథ్యం.
(వ్యాసకర్త: నమస్తే తెలంగాణ ప్రతినిధి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా)
-జూపల్లి రమేష్రావు 94925 70992