హైదరాబాద్, జూలై 30 (నమస్తేతెలంగాణ) : తన ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి సీఎం రేవంత్రెడ్డి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఇంజినీర్లు, పెన్షనర్లను లక్ష్యంగా చేసుకొని అసత్య ప్రచారం చేస్తున్నారని బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో విమర్శించారు.
అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులవుతున్నా పీఆర్సీ అమలుచేయలేదని, పెండింగ్ డీఏలు ఇవ్వకుండా రిటైర్డ్ ఉద్యోగులను రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ పాఠశాలలను కుదించడం, ప్రశ్నించే వారిని అణచివేయడం సరికాదని, సీఎం వెంటనే తన వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
హైదరాబాద్, జూలై 30(నమస్తే తెలంగాణ) : ‘ఇంజినీర్లు నీలా క్రిమినల్స్ కాదు, దేశానికి క్రియేటర్స్.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హిట్లర్ లాంటి అహంకారపూరిత వైఖరి వీడి, వారికి వెంటనే క్షమాపణ చెప్పాలి’ అని రెడ్కో మాజీ చైర్మన్ వై సతీశ్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.

వారిని క్రిమినల్ వేస్ట్ అనడం సీఎం అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. గతంలో డ్రగ్స్ బానిసలని, రిటైర్డ్ ఇంజినీర్లను జైల్లో పెడ్తానని బెదిరించిన రేవంత్రెడ్డి, ఇప్పుడు విద్యార్థులను అవమానిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.