ఢిల్లీ నుంచి వచ్చిన కాంగ్రెస్ నేతల మాటలు ఇక్కడి ప్రజలు నమ్మే స్థితిలో లేరు. అభివృద్ధి జరగకపోతే, పథకాలు సక్రమంగా అమలు కాకపోతే, రాష్ట్రం అధ్వాన్న స్థితిలో ఉంటే వారిచ్చే హామీలను ప్రజలు నమ్మేవారు. కానీ సీఎం కేసీఆర్ అలాంటి చాన్స్ ఇవ్వడం లేదు. ఆయన నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతి పథాన ముందుకు సాగుతున్నది. తెలంగాణ రాష్ర్టానికి సీఎం కేసీఆరే శ్రీరామరక్ష. ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని అలవికాని హామీలు ఇస్తున్న కాంగ్రెస్ను నమ్మితే నట్టేట ముంచుతరు!
బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించింది. కాళేశ్వరం వంటి భారీ ఎత్తిపోతల పథకంతోపాటు మిషన్ కాకతీయ, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి, ఇతర మధ్యతరహా, చిన్న ప్రాజెక్టుల పూర్తితో తెలంగాణ సాగునీటి రంగం స్వర్ణయుగాన్ని తలపిస్తున్నది. రైతుబంధు సాయం, 24 గంటల కరెంటు, రైతు బీమాతోపాటు సకాలంలో ఎరువులు, విత్తనాలు అందుతున్నాయి. ఇప్పటివరకు 21.35 లక్షల రైతులకు చెందిన రూ.11.812 కోట్ల రుణాలు మాఫీ అయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటికే 85 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. ధరణి పోర్టల్తో ఐదు నిమిషాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ జరిగిపోతున్నది. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో గ్రామాలు, పట్టణాల రూపురేఖలు మారాయి. పచ్చదనం పరిఢవిల్లుతున్నది.
ఇలాంటి మంచి పనులు జరుగుతున్నా అధికారంలోకి వస్తే అలవికాని హామీలను అమలు చేస్తామని కాంగ్రెస్ నాయకులు ప్రజలను మభ్య పెడుతున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన కాంగ్రెస్ నాయకులు ఆదివారం హైదరాబాద్లో జరిగిన సభలో అరు గ్యారంటీ పథకాలు అమలు చేస్తామని ప్రకటించారు. వీరు ప్రకటించిన పథకాలు కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో అమలు చేయడం లేదు. సాధ్యం కాని హామీలిస్తూ తర్వాత చేతులెత్తేయడం వారికి అలవాటే.
కర్ణాటక రాష్ట్రంలోనూ ఇలాగే చేస్తున్నారు. కాంగ్రెస్ పాలిత కర్ణాటక, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల్లో రూ. 4 వేల పింఛను ఎందుకు ఇవ్వడం లేదు? అక్కడ ఇవ్వనిది.. ఇక్కడెట్ల సాధ్యమైతది? దీని గురించి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. కర్ణాటకలో వృద్ధులకు రూ.800 పింఛను అందిస్తున్నారు. అదే రాజస్థాన్లో రూ.750, ఛత్తీస్గఢ్లో రూ.350 ఇస్తున్నారు. అలాంటి పార్టీని తెలంగాణ ప్రజలు ఎట్లా నమ్ముతారో వారికే తెలియదు.
తెలంగాణలో గతంలో రూ.200 ఉన్న ఆసరా పింఛన్ను రూ.2016కు పెంచింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. దివ్యాంగులుకు ఇచ్చే పింఛన్ మొత్తాన్ని ఇటీవలే సర్కారు రూ.3,016 నుంచి రూ. 4,016కు పెంచింది. రాష్ట్రంలో 2014లో 29 లక్షల మందికి పింఛన్ అందుతుండగా, ప్రస్తుతం 44 లక్షల మంది పింఛన్లు తీసుకుంటున్నారు. పింఛను లబ్ధిదారుల వయో పరిమితిని సైతం తెలంగాణ ప్రభుత్వం 60 నుంచి 57 ఏండ్లకు తగ్గించింది. 2014 నాటికి రాష్ట్రంలో 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో కేవలం 850 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే అందుబాటులో ఉండగా నేడు సీట్ల సంఖ్య 3,915 వరకు పెరిగింది. 2014లో ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో కలిపి మొత్తం 2,850 మెడికల్ సీట్లు మాత్రమే ఉండగా, నేడు మూడింతలు పెరిగిపోయాయి. ఏటా 10 వేల మంది డాక్టర్లను తయారు చేసే స్థాయికి తెలంగాణ చేరుకుంటున్నది. ఇది కాదా సీఎం కేసీఆర్ ఘనత. తెలంగాణ అభివృద్ధికి సీఎం కేసీఆర్, బీఆర్ఎస్సే గ్యారంటీ. ఇతరుల గ్యారెంటీ అవసరం లేదు. గత 50 ఏండ్ల పాలనలో అమలుచేయని హమీలను ఇప్పుడు అమలు చేస్తామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ప్రజలు ఆలోచించాలి. మోసపోతే గోస పడుతాం. కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో ప్రజలు గ్యారెంటీగా బంగాళా ఖాతంలో విసిరేయడం ఖాయం!
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
– గొట్టిముక్కుల బ్రహ్మచారి 94418 84389