తెలంగాణ కోసం పదవులను త్యాగం చేసి, పార్టీకి రాజీనామా చేసి, తెలంగాణ కోసం టీఆర్ఎస్ పార్టీనే పెట్టి పద్నాలుగేండ్లు పోరాటం చేసి, చావు నోట్లో తలపెట్టిన వ్యక్తి తెలంగాణ వాదా? తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉవ్వెత్తున ఉద్యమం సాగుతున్న సమయంలో తెలంగాణ ద్రోహుల పార్టీ (టీడీపీ)లో ఉండి, అనేక పోరాటాలు, ప్రాణత్యాగాల తర్వాత, పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టానికి ఏడాది కూడా నిండక ముందే, పసిగుడ్డును పురిటిలోనే చంపే ప్రయత్నం చేసి, నోట్లకట్టలతో అడ్డంగా దొరికిన వ్యక్తి తెలంగాణ వాదా? ఎవరు తెలంగాణ వాది?
ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన వ్యక్తి నేడు తెలంగాణ వాదం గురించి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి మాట్లాడటం అంటే తెలంగాణ తల్లి సిగ్గుతో తల వంచుకుంటుంది. రేవంత్రెడ్డి వ్యాఖ్యలను చూసి సభ్యసమాజం సిగ్గుపడటమే కాదు, జైళ్లో ఉన్న జేబు దొంగలు కూడా నవ్వుకుంటున్నారు. తెలంగాణ గురించి అప్పుడు ఆయన ఉన్న పార్టీ స్టాండ్ ఏమిటో క్లారిటీ ఇవ్వాలని తెలంగాణ కోసం పోరాడుతున్న యువకులు అడ్డుతిరిగి, అడ్డగించి నిలదీసి అడిగితే, కరీంనగర్లో తుపాకీ తీసుకొని యువకులపైకి ఎక్కుపెట్టిన వ్యక్తి తెలంగాణవాదా?
తెలంగాణ వాది అంటే ఎవరు? తెలంగాణ ఆత్మ, తెలంగాణ జీవితం, తెలంగాణ గోస, తెలంగాణ బాధలు, తెలంగాణ గాథలు తెలిసి, తెలంగాణను స్వప్నించి, సాధించి, తెలంగాణ భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు తెలంగాణ వాది. నిజమైన తెలంగాణ వాది ఎవరు? నాలుగు పార్టీలు మారి, పూటకో మాట మాట్లాడే వ్యక్తి తెలంగాణ వాదా?
తద్దినాలు, సమాధులని మాట్లాడుతున్న రేవంత్రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్కు పట్టిన చీడ పీడ. గాంధీభవన్లో దూరిన గాడ్సే. రంగులు మార్చే ఊసరవెల్లిలా పార్టీలు మార్చి, కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ర్టాన్ని అస్థిరపరిచి, తెలంగాణ ద్రోహుల పార్టీ ముఠా నాయకుడైన చంద్రబాబు డైరెక్షన్లో రాష్ట్ర ప్రభుత్వాన్నే కూల్చాలనే కుట్రకు సూత్రధారి, పాత్రధారి అయి, నామినేటెడ్ ఎమ్మెల్యేను కొని, కొత్త రాష్ర్టాన్ని కూల్చే కుట్రచేసి, నోట్ల కట్టలతో అడ్డంగా దొరికిపోయి, ఆ కేసు నుంచి తప్పించుకునేందుకు తెగిడిన నోటితోనే పొగిడి, టీపీసీసీ అధ్యక్ష పదవి తెచ్చుకున్న వ్యక్తి రేవంత్రెడ్డి. టీపీసీసీ అధ్యక్షుడైన మరుసటి రోజు నుంచే తెలంగాణ రాష్ర్టానికి తానే నెక్స్ ముఖ్యమంత్రిని అని తన పెయిడ్ ఆర్టిస్టులతో, వందిమాగధులతో భజన చేయించుకుంటూ, అధిష్ఠానాన్ని బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తూ, ఒంటెత్తు పోకడలతో కాస్తో కూస్తో తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఖతం పట్టించిన రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి. ఆయన పీసీసీ అధ్యక్షుడైన నాడే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి చెల్లుచీటి రాశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అదే రుజువై తీరుతుంది.
ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో అసలైన కాంగ్రెస్ నేతల్లేరు. ఎవరో కొందరున్నా పాపం వారు వృద్ధ జంబూకాలై విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇంకా అక్కడో, ఇక్కడో మిగిలిన అసలు కాంగ్రెస్ నేతలను రేవంత్ పార్టీ నుంచి బయటికి పంపించే ప్రయత్నం చేస్తూ, ఇసంత రమ్మంటే, ఇల్లంతా నాదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. రేవంత్రెడ్డి కబ్జా రాజకీయాలు తెలియని అసలైన తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ముక్కున వేలేసుకొని, ఆయనను పార్టీలోకి తెచ్చుకొని ఎంత పాపం చేశామంటూ పశ్చాత్తాపడుతున్నారు.
అనేక పోరాటాలు, రాజకీయ ఎత్తుగడలు, దేశ వ్యాప్తంగా తెలంగాణకు మద్దతును కూడగట్టి పార్లమెంటు ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాంగబద్ధంగా తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన మహానేత కె.చంద్రశేఖర్రావు. సాధించిన తెలంగాణను, స్వప్నించిన రీతిలో తీర్చిదిద్దుతూ, వరుసగా రెండుసార్లు తెలంగాణ ప్రజల దీవెనలతో ముఖ్యమంత్రి అయి, తెలంగాణ రాష్ర్టాన్ని తొమ్మిదేండ్లలోనే దేశంలో నెంబర్ వన్గా తీర్చిదిద్దిన మహానేత కేసీఆర్. వరిధాన్యం ఉత్పత్తిలో, తలసరి ఆదాయంలో, జీఎస్డీపీలో, మిషన్ భగీరథలో, మిషన్ కాకతీయతో, కాళేశ్వరం ప్రాజెక్టులో తెలంగాణను సస్యశ్యామలం చేస్తున్న మహానేత ముఖ్యమంత్రి కేసీఆర్. నీరు పల్లమెరుగు, నిజం దేవుడెరుగు అన్నారు పెద్దలు. కానీ, పల్లానికి వెళ్లాల్సిన నీటిని ఎత్తుకు తీసుకువచ్చి, గోదారమ్మను పరవళ్లు తొక్కిస్తున్న నేత ముఖ్యమంత్రి కేసీఆర్.
రేవంత్రెడ్డి మొన్న అమెరికాలో రైతులకు 24 గంటల ఉచిత కరెంటు అవసరమే లేదన్నారు. తన రాజకీయ గురువు అయిన చంద్రబాబు విధానాన్ని అక్కడ ప్రకటించారు. తెలంగాణ ప్రజలు, రైతాంగం ముక్త కంఠంతో రేవంత్రెడ్డి వ్యాఖ్యలను ఖండించడంతో ఏం చేయాలో పాలుపోక దాన్నుంచి బయటపడేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్లపై నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు కాదు.
తలకాయ కిందికి, కాళ్లు మీదికి చేసి తపస్సు చేసినా, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాదని తెలిసిన రేవంత్రెడ్డి మతితప్పి ఇష్టారీతిన మాట్లాడుతున్నాడు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ తెలంగాణ ప్రజలు కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీకే పట్టం గట్టి ఆయనను మూడోసారి ముఖ్యమంత్రిని చేస్తారు.
నోరు పారేసుకొని మాట్లాడుతున్న నేతలకు తెలంగాణ ప్రజలు సరైన గుణపాఠమే చెప్తారు. అలాంటివారికి తెలంగాణ ప్రజలు పిండం పెట్టి, సమాధి కట్టడం ఖాయం. ఇలాంటి తెలంగాణ ద్రోహుల పార్టీ నుంచి రేవంత్ను అరువు తెచ్చుకున్న అసలైన కాంగ్రెస్ పార్టీ నేతలు ఇకనైనా మేలుకొని అతన్ని పార్టీ నుంచి బయటికి పంపిస్తే, కనీసం అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా అయినా దక్కుతుంది. లేదంటే ఆ నాలుగు స్థానాలు కూడా మిగలవు.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
-ఎ.రమణకుమార్