తాము ఏదైనా మాట్లాడొచ్చు. కానీ, ఎదుటివారే ఏం చెప్పకూడదు. విమర్శలు అసలే చేయకూడదు. ప్రభుత్వ పనితీరు బాగాలేదని వేలెత్తి చూపించే సాహసం చేయకూడదు. ఇదీ భారతదేశంలో మీడియా ఎదుర్కొంటున్న సమస్య. మన దేశ మీడియానే కాదు, అంతర్జాతీయ మీడియా సైతం ఇలాంటి వేధింపులే ఎదుర్కొంటున్నది. భావప్రకటనా స్వేచ్ఛ గురించి గుండెలు బాదుకొని చెప్పే కేంద్రం తన దగ్గరికి వచ్చేవరకు చట్టాన్ని అడ్డం పెట్టుకొని ప్రశ్నించేవారిని కట్టడి చేస్తున్నది. మోదీ ప్రధాని అయిన తర్వాత భారతీయ మీడియా స్వేచ్ఛను కోల్పోయిందనే విషయం ప్రపంచస్థాయి మీడియా అధ్యయనాలు తేటతెల్లం చేస్తున్నాయి.
విభిన్నతలున్న ఇండియాను నెహ్రూ అర్థం చేసుకున్నంతగా మరెవ్వరూ అర్థం చేసుకోలేదనే విషయం పదే పదే రుజువవుతూనే ఉన్నది. అందుకే ఆయన భిన్న స్వరాలు విన్పించాలని, కన్పించాలని కోరుకున్నారు. అలాంటి వారిని ప్రోత్సహించారు. మీడియాకు సంపూర్ణమైన స్వేచ్ఛనిచ్చారు.
నేడు దేశంలో మీడియా రెండురకాల సమస్యలను ఎదుర్కొంటున్నది. అందులో ఒకటి కేంద్రం తన పాల నా వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు జర్నలిస్టులపైనా, మీడియా సంస్థలపైనా తీవ్ర నిర్బంధాన్ని కొనసాగిస్తున్నది. తనకు వ్యతిరేకంగా వార్తలు రాసే జర్నలిస్టులను అరెస్టు చేస్తూ కట్టడి చేస్తున్నది. మీడి యా యాజమాన్యాలు తన మాట వినకుం టే ఈడీ, ఆదాయపు పన్ను శాఖ సర్వేల పేరుతో సోదాలు నిర్వహిస్తాయి. తన వైఫల్యాలు, ఏకపక్ష వైఖరి, ప్రజా వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నించకూడదని ఇలాంటి వేధింపులు, బెదిరింపులు చాలా తరచుగా జరుగుతూనే ఉన్నా యి. ప్రపంచ ప్రఖ్యాత మీడియా సంస్థ బీబీసీ ఇండియా ప్రధాన కార్యాలయంలో ఐటీ అధికారులు చేసిన సోదాల గురించి ప్రపంచం నివ్వెరపోయి చూసింది.
అప్రకటిత ఎమర్జెన్సీని మీడియాపై మో దీ ప్రభుత్వం ప్రయోగిస్తున్నదని భావించాలేమో. దేశీయ మీడియాలో మోదీకి అనుకూలంగా ఉంటే ఎంతైనా రాయొచ్చు. ఆయన శూరుడు, ధీరుడు. ఆయన మామిడిపండ్లు ఎలా తింటారో త్రీడీ ఎఫెక్ట్ విజువల్తో స్టోరీలు రాయొ చ్చు. కానీ రైతులకు ముప్పుగా మారిన రైతు వ్యతిరేక చట్టాల గురించి రాయొద్దు. టీవీల్లో చూపించొద్దు. దేశంలో రోజూ ఏదో ఒకచోట దళితులపై జరుగుతున్న దురాగతాల గురించి అసలు పట్టించుకోవద్దు. నిరుద్యోగ సమస్య, నానాటికీ క్షీణిస్తున్న రూపాయి విలువ, అడుగులు తడబడి విలవిల్లాడుతున్న ప్రజాస్వామ్యం గురించి రాయొద్దు, చూపొద్దు. ఇట్లా చేసినవారు దేశానికి, ధర్మానికి వ్యతిరేకులు! అందుకే గుజరాత్ అల్లర్ల గురించి బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీని మోదీ ప్రభుత్వం నిషేధించింది. ఇవన్నీ కూడా మీడియా విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిదర్శనాలు. అంతర్జాతీయంగా మోదీ తిరుగులేని నాయకుడని వాట్సాప్ యూనివర్సిటీలు ప్రచారం చేసుకుంటున్నాయి.
ఇండియాలో అమలవుతున్న తిరోగమన, ప్రజాస్వామ్య వ్యతిరేక పోకడల గురించి అంతర్జాతీయ మీడియా అసలు పట్టించుకోవద్దని మోదీ అండ్ కో కోరుకుంటున్నది. అందుకే జమ్ముకశ్మీర్, ఈశాన్య రాష్ర్టాల్లోకి ఇతర దేశాల మీడియా ప్రతినిధులు వెళ్లాలంటే అనుమతులు తప్పకుండా తీసుకోవాలనే నిబంధనలను ప్రభుత్వం పెట్టింది. బయటి దేశాల మీడియా ప్రతినిధులు ఇక్కడి వాస్తవాలను చెప్పొద్దని ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాల నుంచి సదరు రిపోర్టర్లకు మెయిల్స్ వస్తున్నాయి. మాట వినకుంటే వీసాల కాలపరిమితి కుదించేలా చేస్తున్నారని న్యూస్ వెబ్సైట్ స్క్రోల్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా పాత్రికేయులు, వార్తాసంస్థలు, నెటిజన్లకు ఉన్న మీడియా స్వేచ్ఛ గురించి, ఈ విషయంలో ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరు గురించి వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ఏటా ప్రపంచానికి చెప్తూ ఉంటుంది. జర్నలిజానికి ముప్పుగా పరిణమించే దేశాల జాబితాలో ఇండియా కూడా చేరిపోయింది.
ఇండియాలో జర్నలిస్టులపై జరుగుతున్న హింస, మీడియాపై ప్రభుత్వ అప్రకటిత నిర్బంధం, రాజకీయ పక్షపాత వైఖరులు, కేంద్రీకృత యాజమాన్య పోకడలు భారతదేశంలో మీడియా స్వేచ్ఛకు ప్రతిబంధకాలుగా మారుతున్నాయని రిపోర్టర్స్ ‘విత్ ఔట్ బోర్డర్స్’ తన నివేదికలో స్పష్టం చేసింది. ఇండియా స్పెండ్ నివేదిక ప్రకారం కూడా భారత్లో తప్పుడు సమాచారం వ్యాప్తి బలంగా జరుగుతున్నదని తేలింది. అంతేకాదు, ప్రభుత్వానికి ఇష్టం లేని వార్తలు ప్రచారం చేస్తున్నప్పుడు.. ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల ముందుకు వస్తున్నాయని ప్రభుత్వాలు భావించినప్పుడు ఇంటర్నెట్ షట్డౌన్లు కూడా అవుతున్నాయని ఇండియా స్పెండ్ స్పష్టం చేసింది. అంతేకాదు, పైన పేర్కొన్న అన్ని అంశాల వల్ల మీడియా స్వేచ్ఛను కోల్పోయే దేశాల జాబితాలోకి భారత్ చేరిపోయిందని కూడా చెప్పిందీ సంస్థ.
ప్రతీసారి పొరుగు దేశంతో పోల్చి చూసుకొని చెప్పడం కొందరికి అలవాటయింది. ప్రశ్నించే మీడియా ఉన్న దగ్గర ప్రజాస్వామ్యం మూడు పువ్వులు ఆరు కాయలుగా పరిఢవిల్లుతుంది. పత్రికా స్వేచ్ఛ విషయంలో నార్వే దేశం తొలి వరుసలో ఉన్నది. డెన్మార్క్, స్వీడన్ లాంటి దేశాలు టాప్ 2, టాప్ 3 స్థానాల్లో ఉన్నాయి. మన దేశంతో పోలిస్తే కొన్ని రెట్లు చిన్నవి ఆ దేశాలు. కానీ మీడియాకు స్వేచ్ఛను ఇవ్వడంలో తొలి వరుసలో ఉన్నాయి. అక్కడ ఇలాంటి నేతలు లేరు కాబోలు. ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామిక విలువలను గౌరవించి కాపాడి, ముందుతరాలకు ఆదర్శంగా నిలిచేవారు అక్కడున్నారు.
భారత రాజ్యాంగ తన పౌరులకు ఆర్టికల్-19 ద్వారా ప్రసాదించిన భావప్రకటనా స్వేచ్ఛను పూర్తిగా వినియోగించుకునే అవకాశాన్ని ప్రపంచంలోనే అత్యధిక మం ది సోషల్ మీడియా ఫాలోవర్లున్న మోదీ ప్రభుత్వం తప్పకుండా అర్థం చేసుకుంటుందని భావించడం అత్యాశేమీ కాదు. చివరిగా ఒక మాట, భారత్ను విశ్వగురు చేస్తామని చెప్తున్న పాలకులు ముం దుగా మీడియాకు స్వేచ్ఛనిస్తే చాలు అదే ప్రపంచానికి భారత్ గురించి చాటి చెప్తుంది.
(వ్యాసకర్త: ప్రధాన కార్యదర్శి, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్)
-ఆస్కాని మారుతీసాగర్
90107 56666