ఈ ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తామని ప్రతి రాజకీయ పక్షం ప్రకటించడం అత్యంత సహజం. తమ పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం కలిగించే విధంగా, ప్రత్యర్థి పార్టీ ఆత్మవిశ్వాసం దెబ్బతీసే విధంగా ఎన్నికల ముందు ప్రతి రాజకీయ పార్టీ ప్రకటనలు చేస్తుంటాయి. దీనిలో భాగంగానే ఈ సారి సొంతంగా 370 స్థానాల్లో విజయం సాధిస్తామని, మిత్రపక్షాలతో కలిపి 400 స్థానాల్లో గెలుస్తామని బీజేపీ ప్రకటించింది. అయితే బీజేపీ తన లక్ష్యాలను ప్రకటిస్తూ యుద్ధం ప్రారంభానికి ముందే వైరి పక్షాలను చెల్లాచెదురు చేస్తూ భయపెడుతున్నది. ఎన్నికల సమయంలో భారీ లక్ష్యాలతో ప్రత్యర్థులను వణికించడం సహజమే.
కానీ, ఈ సారి చిత్రంగా వైరి పక్షాలు తమను తామే భయపెట్టుకుంటున్నాయి. ఎన్నికలు జరుగుతుంటే అధికార పక్షం గెలుస్తుందా? ఓడిపోతుందా? అని చర్చ జరుగుతుంది. కానీ, ఇప్పుడు ప్రధాని మోదీ చెప్పినట్టు మిత్రపక్షాలతో కలిపి బీజేపీకి 400 సీట్లు వస్తాయా? లేదా? అనే చర్చ జరుగుతుండటం గమనార్హం. తమపై విశ్వాసం కోల్పోయిన విపక్షాలు.. బయటకు చెప్పకపోయినా మూడోసారి కూడా తామే గెలుస్తామని బీజేపీ చేస్తున్న ప్రచార మాయలో పడిపోయాయి. సీట్ల సంఖ్య చెప్పి బీజేపీ భయపెడితే, విపక్షాలు సైతం తమను తాము భయపెట్టుకుంటున్నాయి.
BJP | ఈ సారి బీజేపీ గెలిస్తే దేశంలో ప్రజాస్వామ్యం ఉండదు, రాజ్యాంగం ఉండదు, ఎవరికీ హక్కులు ఉండవనే ప్రచారాన్ని విపక్షాలు చేస్తున్నాయి. ఈ ప్రచారంతో విపక్షాలు ఆశిస్తున్న ప్రయోజనం ఏమిటో కానీ తమను తామే భయపెట్టుకోవడం వల్ల తాము నష్టపోవడమే కాదు, దేశానికి నష్టం కలిగిస్తున్నారు. సీట్ల సంఖ్య ఎంతైనా కావచ్చు, ఈ సారి కూడా బీజేపీ తిరిగి అధికారంలోకి రావడానికే ఎక్కువ అవకాశం ఉందనే ప్రచారం సాగుతున్నది. అప్పుడు విపక్షాలు ఏం చేస్తాయి? తాము భయపడిన విధంగా దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా అధికార పక్షం చేస్తే మౌనంగా చూస్తూ ఉంటారా?
ఇంతకన్నా ఎక్కువ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన సందర్భం కూడా ఉంది. అప్పుడేమీ దేశంలో ప్రజాస్వామ్యం లేకుండాపోయిందా? మిత్రపక్షాలతో కలిసి 400 సీట్లు గెలుస్తామని మోదీ చెప్తున్నారు. కానీ, 1984లో కాంగ్రెస్ పార్టీ సొంతంగా 404 సీట్లు గెలిచింది. ప్రతిపక్ష హోదా కూడా ఎవరికీ దక్కలేదు. బీజేపీ రెండు సీట్లకే పరిమితమైంది. వాజపేయి లాంటి హేమాహేమీలు ఓడిపోయారు. అంతమాత్రాన దేశంలో ప్రజాస్వామ్యమే లేకుండాపోలేదు కదా. ఐదేండ్ల తర్వాత 1989లో జరిగిన ఎన్నికల్లో అదే కాంగ్రెస్ పార్టీ 197 సీట్లకు పరిమితమైంది. 1984లో గెలిచిన సీట్లలో కనీసం సగం సీట్లను కూడా కాంగ్రెస్ నిలుపుకోలేకపోయింది. రెండు సీట్లకు పరిమితమైన బీజేపీ నిరాశతో కృంగిపోలేదు. జెండా పీకేయలేదు. ఆత్మవిశ్వాసంతో నిలబడింది. వరుసగా రెండు సార్లు గెలిచింది. మూడోసారి గెలుస్తామని ధీమాగా అంటున్నది.
తమదే మళ్లీ అధికారమని బీజేపీ చెప్పుకోవడంలో తప్పు లేదు. కానీ, ఇవే చివరి ఎన్నికలు అన్నట్టు.. బీజేపీ మళ్లీ గెలిస్తే అసలు ప్రజాస్వామ్యానికే ముప్పు అన్నట్టు విపక్షాలు భయపెట్టడం వల్ల నష్టపోయేది వారే. కాంగ్రెస్ తప్పిదాలే బీజేపీకి రాజమార్గాన్ని చూపించాయి. ఇందిరాగాంధీ హయాంలో ‘రోటీ, కపడా, ఔర్ మకాన్’ అనేది ప్రజలను కదిలించిన గొప్ప నినాదం. దేశ ప్రజలు తిండికి కూడా నోచుకోని కాలమది. కాబట్టి ఆ నినాదం ప్రజలను కదిలించింది, ఓట్ల వర్షం కురిపించింది. ఇప్పుడా నినాదానికి కాలం చెల్లింది. కనీస అవసరాలకు అంత ఇబ్బందేమీ లేదు. ఈ రోజుల్లో హిందూత్వ, జాతీయ భావం, దేశభక్తి అనేవి చాలా తీవ్రమైన ప్రభావం చూపుతున్న అంశాలుగా మారిపోయాయి. కాంగ్రెస్ మొదటి నుంచి మైనారిటీ ఓటు బ్యాంకుపై దృష్టి సారిస్తే బీజేపీ మెజారిటీ వర్గాల ఓటు బ్యాంకుపై దృష్టి సారించి విజయం సాధించింది.
అలా అని ‘మెజారిటీ ఓటు బ్యాంకు మొత్తాన్ని బీజేపీ తనవైపు తిప్పుకున్నది, ఇక ఆ పార్టీకి విజయం శాశ్వతం’ అని కూడా చెప్పలేం. విపక్షాలకు ఇక దేశంలో చోటే లేదని ప్రచారం సాగుతున్న కాలంలో సైతం బీజేపీకి 2019 ఎన్నికల్లో ఓటు వేసిన వారు 37.36 శాతం మంది మాత్రమే. ఆ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేసినవారు 62 శాతం మంది. మిత్రపక్షాలతో కలిపినా బీజేపీకి 45 శాతం మంది అనుకూలంగా ఓటు వేస్తే.. 55 శాతం మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. 45 శాతం మంది అనుకూలంగా, 55 శాతం మంది వ్యతిరేకంగా ఓటు వేస్తున్నప్పటికీ ‘బీజేపీ శాశ్వతంగా ఉంటుంది, విపక్షాలకు కాలం చెల్లింది’ అన్నట్టుగా విపక్షాలే భయపడుతున్నాయి. దేశంలో ప్రజాస్వామ్య పునాదులు బలంగా ఉన్నాయి. ఏ పార్టీ ఎంత మెజారిటీతో గెలిచినా ప్రజాస్వామ్యానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. ఏ నినాదం శాశ్వతం కాదు. దేశభక్తి, హిందూ మతం, జాతీయ భావం ఏ పార్టీకో పరిమితం కాదు. బీజేపీ పుట్టకముందు నుంచి ఈ దేశ ప్రజల్లో దేశభక్తి ఉంది. మతం పట్ల విశ్వాసం ఉంది, భవిష్యత్తులోనూ ఉంటుంది. ఒక పార్టీకి ఒక నినాదం శాశ్వతంగా ఓట్లు తెచ్చిపెట్టదు.
ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీకి సాధారణంగా కొంత వ్యతిరేకత ఉండడం సహజం. కానీ, వరుసగా రెండుసార్లు అధికారంలో ఉండి కూడా అత్యధిక సీట్లతో మళ్లీ అధికారంలోకి వస్తామని చెప్పుకోవడం బీజేపీ ఆత్మవిశ్వాసాన్ని తెలియజేస్తున్నది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి, ప్రజల తీర్పు కోరుతూ మరిన్ని ఎక్కువ సీట్లు గెలుస్తామనే ధీమాతో వెళ్తున్నారా? అంటే అలా ఏమీ కాదు. నిజానికి దేశవ్యాప్తంగా బీజేపీ తన ప్రచారంలో ఎక్కడా ‘గతంలో ఇచ్చిన హామీలు అమలు చేశాం కాబట్టి మరోసారి మాకు అధికారం ఇవ్వాలి’ అని కోరడం లేదు.
ఎన్నికల ప్రచారంలో హామీలనేవి ప్రధానాంశంగా మారితే.. అది తమకు లాభం కన్నా నష్టమే ఎక్కువ చేస్తుందనే విషయం ఆ పార్టీకి బాగా తెలుసు. అందుకే వాటి జోలికి వెళ్లడం లేదు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు, అందరికీ సొంతిళ్లు, రైతుల ఆదాయం రెట్టింపు, నల్లధనం తీసుకువచ్చి ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేయడం.. ఇవీ బీజేపీ ఇచ్చిన ప్రధానమైన హామీలు. పదేండ్ల పాలనలో 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చామని, రైతుల ఆదాయం రెట్టింపు చేశామని, అందరికీ ఇల్లు కట్టించామని బీజేపీ ఎక్కడా చెప్పడం లేదు. చెప్పదు కూడా.. అసలీ అంశాలే చర్చకు రాకుండా చూసుకుంటుంది. శ్రీరాముడు, అయోధ్య, హిందూత్వ, దేశభక్తి, పౌరసత్వం తదితర అంశాల ద్వారా బీజేపీ ప్రయోజనం పొందుతున్నది.
బీహార్లో నితీష్ కుమార్ జతకట్టడం, ఒరిస్సాలో పట్నాయక్ స్నేహ హస్తం అందించడం, పొత్తు కోసం చంద్రబాబు చేస్తున్న తీవ్ర ప్రయత్నాలతో బీజేపీ మరింత ఆత్మవిశ్వాసాన్ని మూటగట్టుకుంటున్నది. అందుకే మళ్లీ గెలుస్తామని ప్రచారం చేసుకుంటున్నది. అదే సమయంలో కాంగ్రెస్ పరిస్థితి దారం తెగిన గాలిపటంలా మారడం బీజేపీకి కలిసొస్తున్న అంశం.ఈ పదేండ్ల కాలంలో ఉద్యోగ అవకాశాలు ఏ మేరకు పెరిగాయి? రైతుల ఆదాయం రెట్టింపు అయిందా? చెప్పినవి ఎంత వరకు చేశారు? అనే చర్చే లేదు.
బీజేపీకి కావాల్సింది ఇదే.
కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియాగాంధీనే రాజ్యసభ ద్వారా పార్లమెంట్కు వెళ్తున్నారంటేనే.. దేశంలో ఆ పార్టీ పరిస్థితి ఏమిటో తెలుస్తున్నది. యుద్ధరంగంలో ప్రత్యర్థిని చూసి రాజే తప్పుకొంటే సైన్యం ఏం పోరాడుతుంది.
జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. విజయం శాశ్వతం కాదు, పరాజయం శాశ్వతం కాదు. వెలుగు శాశ్వతం కాదు, చీకటి శాశ్వతం కాదు. అన్నింటికీ కాలమే సమాధానం చెప్తుంది. గత ఎన్నికల్లో బీజేపీకి ఎదురులేకపోవచ్చు, రానున్న ఎన్నికల్లో తమదే విజయమని ఆ పార్టీ ప్రచారం చేసుకోవచ్చు. కానీ అది శాశ్వతం కాదు. 2024 చివరి ఎన్నికలు కావు. 2024 తర్వాత కూడా ఎన్నికలు ఉంటాయి. ఎన్నికలు వస్తూనే ఉంటాయి. ప్రజలు తమ తీర్పు ఇస్తూనే ఉంటారు.
-బుద్దా మురళి