వంద ప్రశ్నలకు ఒక్క సమాధానం సరితూగితే… వెయ్యి సందేహాలను ఒక్క సందర్భం నివృత్తి చేయగలిగితే… మనసును తొలిచే అనేక అపోహలను ఒక్క సన్నివేశం తొలగించగలిగితే… అదే బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ నేతృత్వంలో జరిగిన ఖమ్మం భారీ బహిరంగ సభ. ఏడాదిగా తెలంగాణలోని ప్రతిపక్ష నాయకులు, సోషల్ మీడియాలో అసత్య ప్రచారంతో ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నం చేస్తున్న కేసీఆర్ విద్వేషకులందరూ ఆలపిస్తున్న రాగం భావం ఒక్కటే. కేసీఆర్ బలహీనపడుతున్నారు. రాష్ట్రంలో కేసీఆర్పై వ్యతిరేకత ఉందనీ, రాష్ట్రంలో అధికారాన్ని కాపాడుకోవటానికి బీఆర్ఎస్ అంటున్నారని, కేసీఆర్ దేశవ్యాప్తంగా ఎవరిని కలిసినా ఆదరించట్లేదనీ.. ఇట్లా పలురకాల వ్యాఖ్యానాలను ప్రచారం చేస్తున్నారు.
అశేష జనవాహిని సమక్షంలో కేసీఆర్తో పాటు ముగ్గురు ముఖ్యమంత్రులు, ఒక మాజీ సీఎం, సీపీఐ జాతీయ కార్యదర్శి కలయికలో జరిగిన భారీ బహిరంగసభ ఖమ్మం సభ. ఈ సభ ఒకే వేదికపై ఐక్యతా భావాన్ని, పరస్పర సహకారాన్ని చాటిన సందర్భం, తెలంగాణ అభివృద్ధిని అభినందించిన విషయం, బీజేపీకి ప్రత్యామ్నా యం రావాల్సిన అవసరాన్ని నినదించిన దృశ్యం పైన పేర్కొన్న దుష్ప్రచారాన్ని పటాపంచలు చేసింది. జాతీయస్థాయిలో అన్ని పార్టీలను, మీడియాను, విమర్శకులను విశేషంగా ఆకర్షించింది. గతంలో కేసీఆర్ వివిధ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, ఎన్నికల నుంచి మొదలుకొని పలు పథకాల ప్రారంభం వరకు అనేక సభలను నిర్వహించారు. ఇంతకంటే పెద్ద సభలనూ నిర్వహించారు. కానీ ఖమ్మంలో జరిగిన ఈ సభకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ సభ చరిత్రలో నిలిచిపోతుంది.
ఇదే విషయాన్ని కొద్దిగా వివరంగా చర్చించుకుంటే… ఈ సభా నిర్వహణకు ఖమ్మం నగరాన్ని ఎంచుకోవడం గురించి కచ్చితంగా మాట్లాడుకోవాలి. సభకు ముందు నుంచీ, మీడియా చర్చల్లో, నాయకులను మీడియా అడిగిన ప్రశ్నల్లో రాసిన అభిప్రాయాల్లో, ఇతరపార్టీల నాయకులు కూడా మాట్లాడిన అంశం ‘ఎందుకు ఖమ్మం?. జాతీయపార్టీగా రూపాంతరం చెందినప్పుడు హైదరాబాద్లోనో, ఢిల్లీలోనే సభపెట్టాలి కానీ ఖమ్మం ఏమిటి?’ ఇది ఫెయిలవుతుందనీ చాలామంది ఒకడుగు ముందుకేసి ఖమ్మం ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ బలం తక్కువనీ, అట్లాంటి చోట ఐదు లక్షలతో సభ అంటే దుస్సాహసమనీ అభిప్రాయపడ్డారు. చివరివరకూ ఆహ్వానించబడిన అతిథులు రావట్లేదని, కంటివెలుగు ప్రారంభ కార్యక్రమానికి మాత్రమే పరిమితమవుతారనీ ప్రచారం చేశారు. కానీ ఇక్కడే మరొక్కసారి సదరు విమర్శకులందరూ కేసీఆర్ బలాన్ని తక్కువ అంచనా వేశారు. వ్యూహాన్ని అర్థం చేసుకోలేకపోయారు.
గతంలో అనేకమార్లు ఇతరులు కేసీఆర్ శక్తిని తక్కువచేసి చూపించే ప్రయత్నం చేశారు. ప్రతిదాన్ని కేసీఆర్ తన చేతల తో తిప్పికొట్టారు. అదే చాణక్యనీతిని కేసీఆర్, ఖమ్మంను వేదికగా చేసుకొని ఐదు లక్షల మంది తో సభ అని ముందే ప్రకటించి మరీ, పదిరోజుల వ్యవధిలో అత్యంత విజయవంతంగా నిర్వహించి విమర్శకులకు దీటైన సమాధానం ఇచ్చారు.
ఈ సభకు సంబంధించి మరో ప్రత్యేకమైన విషయం ఏమంటే.. కేసీఆర్ కంటే ముందు మాట్లాడిన ప్రధాన వక్తలు ఇంగ్లిషు, హిందీ భాషల్లో మాట్లాడారు. వారు జాతీయ అంశాలు, బీజేపీ నిరంకుశ వ్యవహారశైలి, ప్రజలకు జరుగుతున్న నష్టం, కాంగ్రెస్ వైఫల్యాలు, ప్రత్యామ్నాయం గురించి ప్రస్తావించారు. ఖమ్మం చుట్టుపక్కల ప్రాంతమంతా హిందీ ఎక్కువగా చెలామణిలో ఉండదు. అయినా ఆ ప్రసంగాలన్నింటినీ ప్రజలు ఓపికగా విన్నారు. ముఖ్యమైనవాటికి వారు స్పందించారు. ‘కేసీఆర్’ పేరు వక్తల ప్రసంగాల్లో వచ్చిన ప్రతిసారీ కేరింతలు కొట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
చివరగా జరిగిన కేసీఆర్ ప్రసంగం ఆసాంతం, అది కేంద్ర వైఫల్యాలను ప్రస్తావించినా, తెలంగాణ ప్రగతిని గురించి చెప్పినా, ప్రజల మేలు గురించి, దేశంలో ప్రజల మేలు కోసం ప్రత్యామ్నాయం రావాల్సిన ఆవశ్యకతను వివరించినా అద్భుతంగా స్పందించారు. సంఘీభావాన్ని ప్రకటించారు. ప్రత్యేకించి యువత ఉత్సాహం, స్పందన కేసీఆర్ పట్ల, బీఆర్ఎస్ పట్ల వారికున్న అభిమానం చెక్కుచెదరనిదని స్పష్టీకరించారు.
సభ తర్వాత జరిగిన అనేక చర్చల్లో ప్రతిపక్షాల స్పందనలో వారి డొల్లతనం, విషయలేమి, నిస్సహాయత, అకారణ ద్వేషం స్పష్టంగా కనిపించింది. అనుకున్నంత జనం రాలేదని, కేసీఆర్ ప్రసంగం బాగోలేదని, వచ్చిన వక్తలు కేసీఆర్ను పొగడలేదని, రకరకాలుగా మాట్లాడి వారి అజ్ఞానాన్ని, అమాయకత్వాన్ని చాటుకున్నారు. ఒక నాయకుడైతే పవన్కళ్యాణ్, చిరంజీవి లాంటి సినిమా స్టార్లు పెడితే ప్రజలు ఇంతకంటే ఎక్కువొచ్చారని సెలవిచ్చారు. కానీ వాళ్లకర్థం కానిదేమంటే కేసీఆర్ సినిమా స్టార్ కాదు, ఒక సినిమా ఫ్లాపయితే కనపడకుండా పోయేరకం కాదు. కేసీఆర్ పీపుల్స్స్టార్, సమస్యలెన్నున్నా, ఒత్తిడిలెన్నొచ్చినా, రాజకీయ ప్రత్యలందరూ కలిసికట్టుగా దాడిచేసినా వెరవని బెదరని ప్రజల మనిషి. అందుకే ప్రాంతమేదైనా పరిస్థితులేవైనా ప్రజాదరణ వస్తున్నది. అదే ఖమ్మం సభలోనూ జరిగింది. ఈ సభతో కేసీఆర్పై, ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నదని జరుగుతున్న ప్రచారం వట్టి బూటకమని మరోసారి ప్రజలు తేల్చిచెప్పారు.
ఈ మధ్యకాలంలో మీడియాలో మోదీ అనుకూల ‘మీడియా’లో జరుపుతున్న ఉద్దేశపూర్వక చర్చ ఏమంటే ‘మోదీ వర్సెస్ ఎవరు?’, విపక్షాల్లో సరైన నాయకుల్లేరు, విపక్షాల్లో అనైక్యత ఉన్నది. ప్రతిపక్షాలకు నాయకుడెవరు, జట్టు తయారుచేయగలిగే సామర్థ్యం ఎవరికీ లేదు, మోదీ సామర్థ్యం ముందు ఎవరూ నిలవలేరు. ఇదొక ప్రణాళికతో జరుగుతున్న ప్రచారం. దానికి తోడు తెలంగాణలో ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారం సరే సరి. కేసీఆర్ను ఎవరూ ఆదరించట్లేదు, చెలిమికి వెనుకాడుతున్నారు. ఈ రెండు పసలేని ప్రచారాలకు కూడా ఖమ్మం సభ సరైన సమాధానం ఇచ్చింది.
‘మోదీ వర్సెస్ ఎవరు?’ అనే చర్చలో బీజేపీ నాయకులు రెండు విషయాలు మర్చిపోతున్నారు. ప్రజాస్వామ్య భావనను అగౌరవ పరుస్తున్నారు. ఈ దేశం అధ్యక్ష తరహా పాలనలో లేదనీ, అదే సమయంలో బీజేపీ ఒక జాతీయపార్టీగా మోదీని మించి ముందుకు చూడగలిగే సామర్థ్యాన్ని కోల్పోయిందని. అర్థం చేసుకోలేని సిద్ధాంతపరమైన దివాళాకోరుతనాన్ని ప్రదర్శిస్తున్నారు.
ఈ సభ సందర్భంగా మరో విషయం గమనించదగింది. అదే, ఈ సభ పట్ల మీడియా, ప్రత్యేకించి జాతీయ మీడియా చూపించిన ప్రత్యేక ఆసక్తి. ఇచ్చిన కవరేజీ బీఆర్ఎస్ను ప్రకటించిన రోజు ఢిల్లీలో పార్టీ ఆఫీస్ను ప్రారంభించిన రోజు కంటే పదింతలు ఎక్కువగా ఖమ్మం సభ జరిగిన తీరుతెన్నులు, హాజరైన నాయకుల షెడ్యూళ్ల నుం చి మొదలుకొని వారి ప్రసంగాల వరకు, తద్వారా దేశంలో రాబోయే రోజుల్లో సంభవించగలిగే రాజకీయ పరిణామాలు తదితర అంశాలపై విస్తృతంగా కవర్ చేయడమే కాకుండా టీవీ చర్చల్లో, ప్రత్యేక స్లాట్లలో సంపాదకీయాల్లోనూ ప్రస్తావించారు. జాతీయ మీడియానే కాకుండా, ఆయా రాష్ర్టాల్లో ప్రధానమనుకున్న పత్రికలూ, టీవీ చానళ్లు, వెబ్సైట్లు, సోషల్మీడియాలో కూడా ఈ సభపై ఇచ్చిన కవరేజీ, ప్రచురించిన అంశాలు, సభ సక్సెస్ అయిన విషయాన్ని, అనుకున్న లక్ష్యా న్ని సాధించిన అంశాన్ని, ఈ సభ ద్వారా ఆవిష్కృతమైన ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ప్రస్థానాన్ని దాని ప్రాముఖ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పాయి. ఒక జాతీయ ఛానల్లో ‘ఈ సభ ఒక కొత్త ఒరవడికి ఆరంభమవుతుంది, ప్రత్యామ్నా య రాజకీయశక్తుల ప్రయత్నాలకు కొత్త భాష్యం చెప్పింద’ని వ్యాఖ్యానించడం గమనార్హం.
దీన్నిబట్టే ‘బీజేపీకి సరైన ప్రత్యామ్నాయం కావాలి, రావాలి’ అనే భావన దేశ ప్రజల్లో ఎంత ప్రబలంగా ఉందనే విషయం అర్థమవుతున్నది. మోదీ ప్రభుత్వం ఎంత అణచివేసినా ప్రశ్నించే వారుంటే తోడవుతామన్న సందేశం ఇచ్చినట్లయింది. ఇంతవరకూ ప్రధాన ప్రతిపక్ష అసమర్థతను చూపించి రాజ్యమేలుతున్న కేంద్ర నాయకత్వానికి మేలుకొలుపు అయింది. ఇదేదో సాధారణ ప్రయత్నం కాదనీ అర్థమైంది. జాతీయ రాజకీయ యవనికపై కేసీఆర్ ప్రభ పెరుగుతున్నదనే సంకేతం ఇచ్చింది. మోదీ ప్రభుత్వం ఏర్పడిన ఎనిమిదిన్నరేండ్ల కాలంలో జరిగిన నిరంతర ప్రయత్నం అతి ప్రచారం. చిన్నచిన్న విషయాలు, ప్రభుత్వం రొటీన్గా చేసే కార్యక్రమాలను కూడా అద్భుతాలుగా, అవి మోదీ విజయాలుగా ప్రజలను వెర్రివాళ్లుగా చేసే ఒక ప్రచార పర్వం కొనసాగుతున్నది. ప్రచార హోరు మాటున మోదీ వైఫల్యాలను దాచే ప్రయత్నం నిర్విరామంగా నడుస్తున్నది. రైలు వేగం పెరిగినా మోదీ గొప్పే, రొటేషన్లో వచ్చే జీ-20 లాంటి సమావేశాలు భారత్కు కేటాయించబడినా మోదీ గొప్పనే. కానీ ఉద్యోగాలు పోయినా, ధరలు ఆకాశాన్నంటినా అదిమాత్రం అంతర్జాతీయ సమస్య. అంకెలు, లెక్కలు చెప్పరు. చెప్పినా బూటకం.
రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులను ప్రారంభించడానికొచ్చే ప్రధానిని బహుశా ప్రపంచంలోనే
తొలిసారి చూస్తున్నాం.
కేంద్ర వ్యవహారశైలికి భిన్నంగా తెలంగాణ అభివృద్ధి అన్నిరంగాల్లో లెక్కలతో సహా సాక్షాత్కారం. దానికి కేంద్రం ఇస్తున్న అవార్డులే నిదర్శనం. అదే తెలంగాణ మాడల్గా సుపరిచితం. ఇదే తెలంగాణ మాడల్ను, దీన్ని దేశమంతా చర్చ పెట్టే విషయాన్ని, బీజేపీకి కేంద్రం లో ప్రత్యామ్నాయశక్తి రావాల్సిన అవసరం, దేశం బీజేపీ పాలనలో గాడి తప్పిందన్న అంశాలను ప్రస్తావనకు తేవడంతో ఖమ్మం సభ దేశ ప్రజలకు ఒక కొత్త ఆలోచనను కల్పించింది. దేశ భవిత కోసం మార్పు తేగలుతామనే భరోసానిచ్చింది. భావి భారత మేలుకు ఒక ప్రగతిశీల ప్రభుత్వ ఏర్పాటుకు సమరశంఖాన్ని ఊదింది. దిశానిర్దేశం చేసింది. కేసీఆర్ నేతృత్వంలో ఆ దిశగా బీఆర్ఎస్ ప్రయత్నం కొనసాగుతుంది. అబద్ధం అప్రతిహతమని విర్రవీగుతున్న వేళ, నిశీధి సంకెళ్లను తెంచుకొని, నిర్బంధ శృంఖలాలను ఛేదించి నిజం ముందుకెళ్లేందుకు, ఈ సభ కావాల్సిన ఉత్సాహాన్నిచ్చింది. ఈ స్ఫూర్తి కొనసాగుతుంది. భవిష్యత్ ప్రస్థానానికి పునాది అవుతుంది. జై తెలంగాణ.. ‘జై భారత్’..
(వ్యాసకర్త:రావుల శ్రీధర్రెడ్డి , 99855 75757, రాష్ట్ర విద్య, సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్)