ప్రపంచంలో అన్ని దేశాల కంటే దృఢమైన రాజ్యాంగం మనది. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా కూడా భారత్కు గుర్తింపు ఉన్నది. అలాంటి ఈ దేశంలో కనీవినీ ఎరుగని రీతిలో జరిగిన ఎంపీల సస్పెన్షన్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నది. ప్రజల గొంతుకలుగా ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులను చట్టసభల నుంచి బయటకు పంపించడం ప్రజలను విస్మయానికి గురిచేస్తున్నది.
Parliament | ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 146 మంది లోక్సభ, రాజ్యసభ సభ్యులను సస్పెండ్ చేయడం కేంద్రంలోని బీజేపీ సర్కారు తీరును ప్రస్ఫుటం చేస్తున్నది. 75 ఏండ్ల స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్న ఈ గడ్డపై కోట్లాది మందికి ప్రతినిధులైన 146 మంది ఎంపీలను ఒకే సెషన్లో సభా కార్యకలాపాల నుంచి బహిష్కరించడం ఇదే తొలిసారి. గతంలో ఇందిరాగాంధీ హత్య సమయంలో భారీగా ఎంపీలను సస్పెండ్ చేశారు. అయితే ఇప్పుడు అంతకు రెట్టింపు మందిని ఒక సెషన్లోనే సస్పెండ్ చేయడం విడ్డూరంగా మారింది. ప్రజాస్వామ్య దేశమంటే ఇదేనా? అన్న ప్రశ్నలు నేటి తరం యువతలో మెదులుతున్నాయి. ప్రశ్నించడానికి, ప్రజల సమస్యలను ప్రస్తావించడానికి ఎన్నికల్లో ఓటేసి గెలిపించిన ప్రజా ప్రతినిధులను అధికార కేంద్ర ప్రభుత్వ సూచనలతో ఇలా చేయడం సహేతుకమైనది కాదు. ఇది నిజంగా ప్రజాస్వామ్య విలువలకు, ప్రజాస్వామ్య దేశానికి కళంకమే.
తాజాగా కేంద్ర ప్రభుత్వంలోని గణాంక శాఖ వెలువరించిన లెక్కల ప్రకారం భారతదేశ జనాభా 144 కోట్లు. చైనాను దాటుకొని ప్రపంచంలోనే అత్యధిక జనాభాను కలిగిన మన దేశంలో 543 మంది లోక్సభ సభ్యులున్నారు. వీరంతా ప్రత్యక్ష ఎన్నికల్లో నేరుగా ప్రజల ఓట్లతో ఎన్నికైనవారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో దేశ సార్వభౌమత్వాన్ని రక్షించడం, ప్రజల తరఫున గళం వినిపించడం ఎంపీల ప్రధాన విధి. ఒక్కో ఎంపీ తాజా జనాభా లెక్కలను అనుసరించి దాదాపుగా 25 లక్షల మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజ్యసభలో మొత్తం 250 మంది సభ్యులుండగా ఇందులో 12 మంది మాత్రమే రాష్ట్రపతి ద్వారా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఎంపికవుతారు. మిగిలిన 238 మంది పెద్దల సభలకు ఎన్నికల సంఘం విధివిధానాల ద్వారా వచ్చేవారే. వీరు కూడా దేశ ప్రజలందరికీ ప్రాతినిధ్యం వహిస్తూ దేశానికి అవసరమైన చట్టాల రూపకల్పనలో పాలుపంచుకుంటారు. సలహాలు, సూచనలు అందిస్తారు. ప్రజల సమస్యలను లేవనెత్తే పార్లమెంట్ సభ్యులను ఒక కలం పోటుతో సమావేశాల నుంచి బయటకు పంపడం అన్నది నిజంగా హేయమైనది. ఈ ప్రక్రియ ప్రజాస్వామ్యానికే కాకుండా దేశ ప్రజలకు అవమానకరం. ఈ నెల 14న 14 మంది ఎంపీలతో మొదలైన బహిష్కరణ పర్వం 18న 78 మందితో సస్పెన్షన్ వేటు కొనసాగింది. మరుసటి రోజు మరో 49 మంది గొంతు నొక్కగా ఈ సంఖ్య 141కు చేరింది. ఈనెల 20న ఇద్దరు, పార్లమెంట్ సమావేశాల చివరి రోజు మరో ముగ్గురు ఎంపీలను సస్పెండ్ చేయడంతో ఈ సంఖ్య 146కు చేరుకున్నది.
సరిగ్గా 22 ఏండ్ల కిందట 2001, డిసెంబర్ 13న భారత పార్లమెంట్పై ఉగ్రమూకల దాడిలో 9 మంది అసువులు బాశారు. ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. యూపీఏ సర్కారు భద్రతా వైఫల్యాలను ఎత్తిచూపింది. సీన్ కట్ చేస్తే అదే డిసెంబర్ 13న మరోసారి పార్లమెంట్లో భద్రతా వైఫల్యం జరిగింది. ఈసారి ఏకంగా లోక్సభలోకి ఇద్దరు వ్యక్తులు నేరుగా ప్రవేశించి అలజడి సృష్టించడం కలకలం రేపింది. అందులోనూ డిసెంబర్ 13నే ఈ ఘటన జరగడంతో 144 కోట్ల మంది ప్రజల్లో అనేక అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి.
భద్రతా వైఫల్యంపై యావత్ దేశం మోదీ సర్కారు తీరును ఎండగడుతున్న సందర్భంలో బాధ్యతాయుతమైన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్ష పార్టీలు నిలదీయడం ప్రతిపక్షాలుగా వారి కనీస బాధ్యత. కేంద్రమే స్వయంగా కల్పించుకొని ఈ వ్యవహారంపై నోరు విప్పి నిష్పక్షపాతంగా ప్రకటన చేస్తే అంతా చల్లబడేది. అందుకు విరుద్ధంగా ఏన్డీయే సర్కారు వ్యవహరించడం ద్వారా ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి పార్లమెంట్ ఉభయ సభల్లో శాంతియుతమైన నిరసనలను తలపెట్టడం ఏ మాత్రమూ తప్పుకాదు. ప్రధాని మోదీ మీడియా ముందుకు రారు. కనీసం మీడియా సమావేశాలను నిర్వహించరు. నేరుగా ప్రజలతో మాట్లాడరు. కలిసేది అంతకంటే లేదు. ఒకవేళ ఆయన మాట్లాడాల్సి వస్తే ‘మన్ కీ బాత్’లో ప్రసంగిస్తారు. అంతే తప్ప ప్రజల సాధక బాధకాలను స్వయంగా చూసిన దాఖలాలు లేవు. దేశంలోని సమస్యలు, ప్రశ్నలకు కేంద్ర సర్కారు నుంచి సమాధానాలను ఆశించడం గగనమైపోయిం ది. గత్యంతరమే లేని ఈ క్లిష్ట సమయంలో పార్లమెంట్ సభ్యు లు గొంతెత్తిన పాపానికి వారిని బయటకు పంపడం అంటే ప్రజాస్వామ్య గొంతును నొక్కడమే. పార్లమెంట్ సాక్షిగా మనం రాసుకున్న రాజ్యాంగ విలువలను పాతిపెట్టడమే అవుతుంది.
పార్లమెంట్ సమావేశాల నుంచి సస్పెన్షన్కు గురైన ఎంపీలంతా నిరసనకు దిగి పెద్దఎత్తున కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. నిరంకుశంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరును వారు ప్రశ్నించారు. అందులో భాగంగానే ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ను అనుకరిస్తూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎంపీ నిరసనను వ్యక్తం చేశారు. మాక్ పార్లమెంట్ మాదిరిగానే సభ్యులంతా కలిసి వినూత్నంగా చేసిన ఈ నిరసనకు ఉప రాష్ట్రపతి నొచ్చుకోవడం ఇప్పుడొక పెద్ద సమస్యగా మారింది. ఇదిప్పుడు జాతి సమస్యగా, దేశం ఎదుర్కొంటున్న భారీ సవాల్గా కేంద్రంలోని పెద్దలంతా చిత్రీకరిస్తున్నారు. రాజ్యాంగం ప్రకారం నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది. అందులో పార్లమెంట్లో ప్రజల గొంతుకై తమ వాణిని వినిపించాల్సిన వ్యక్తుల గొంతు నొక్కినప్పుడు వారంతా పార్లమెంట్ వెలుపల నిరసన తెలియజేయడం కూడా తప్పే అన్నట్టుగా కేంద్రం వకాల్తా పుచ్చుకోవడం విడ్డూరంగా ఉన్నది. భద్రతా వైఫల్యంపై నిరసన చేస్తున్న ఎంపీలను బయటకు పంపిన రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్కు పార్లమెంట్ వెలుపల ఎంపీల నిరసన కూడా అదే రీతిలో కనిపించడంలో ఆశ్చర్యమేమీ లేదు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాల్సిన లోక్సభ, రాజ్యసభ స్పీకర్లు ఆవేశకావేశాలకు లోనుకాకుండా పార్టీలకు అతీతంగా ఎంపీల చర్యలను చూడాల్సి ఉంటుంది. ఒకరికి వత్తాసు పలుకుతున్నట్టుగా చర్యలు తీసుకుంటే వాటి పర్యావసానాలు సైతం అదే స్థాయిలో ఉంటాయి. అందుకు సస్పెన్షన్ చేసిన వ్యక్తులు ఓపికగా భరించాల్సిందే. లేదంటే రాజ్యాంగ సవరణతో నిరసనలపై ఉక్కుపాదం మోపితే సరిపోతుంది. అనేక అంశాలపై రాజ్యాంగ సవరణలు చేసే వారికి ఇదేం పెద్ద పనేమీ కాదు కదా?
–జూపల్లి రమేష్ రావు
94925 70992