దుర్భిణీ వేసి వెతికినా కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలకు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు దేశంలో ఎక్కడా సురక్షితమైన చోటు కనిపించడం లేదు. ఈ విషయాన్ని పరోక్షంగా కాంగ్రెస్ నాయకులే దేశానికి చాటి చెప్పారు. ధీమాగా రంగంలోకి దిగేందుకు వారికి దేశంలో ఎక్కడా నియోజకవర్గాలే కనిపించడం లేదు. కానీ తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం వారిని ఇక్కడి నుంచే పోటీ చేయమని ఎగబడి మరీ పిలుస్తుండటం గమనార్హం. కాంగ్రెస్ అధినాయకురాలు సోనియాగాంధీ తెలంగాణ లోని ఖమ్మం నుంచి పోటీ చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ తీర్మానం చేసింది.
పలువురు నాయకులు ఆమె ఖమ్మం నుంచి పోటీ చేయాలని, రాహుల్గాంధీ , ప్రియాంకగాంధీ కూడా తెలంగాణ నుంచే పోటీ చేయాలని కోరారు. సోనియాగాంధీ ఖమ్మం నుంచి పోటీ చేస్తారు, వారు చేయకపోతే తాను ఖమ్మం నుంచి పోటీ చేస్తానని రేణుకా చౌదరి ప్రకటించారు. చివరకు సోనియా రాజస్థాన్ నుంచి రాజ్య సభకు వెళుతున్నారు. అంటే లోక్ సభ ఎన్నికల పోటీకి దూరమై పోతున్నారన్న మాట.
మన్మోహన్ సింగ్ రాజ్యసభ ద్వారానే ప్రధాన మంత్రి పదవి వరకు వెళ్లారు. రాజ్యసభ ద్వారా పార్టీకి నాయకత్వం వహించడం తప్పేమీ కాదు. కానీ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎంత బలహీనంగా ఉందో దేశానికి తద్వారా చాటి చెప్పినట్టయ్యింది. రాజ్యసభకు వెళతారనే వార్త కన్నా ముందు దేశం మొత్తంలో కాంగ్రెస్కు సురక్షితంగా కనిపించిన ప్రాంతం ఒక్క తెలంగాణ మాత్రమేనా అనేది చర్చాంశమైంది. ఇందిరాగాంధీ పార్లమెంటరీ జీవితం రాజ్యసభతో మొదలైతే ప్రస్తుతం కాంగ్రెస్ అగ్రనేత సోనియా రాజకీయ జీవిత చరమాంకంలో రాజ్యసభకు వెళ్తుండటం విశేషం.
ఒకప్పుడు దేశంలోని అన్ని రాష్ర్టాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉండేది. ఇప్పుడు దేశంలో కేవలం మూడు రాష్ర్టాల్లోనే అధికారంలో ఉంది. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ మాత్రమే కాంగ్రెస్ పాలనలో ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ కేవలం నాలుగు పార్లమెంట్ సీట్లు ఉన్న చిన్న రాష్ట్రం. అందులో మూడు సీట్లు బీజేపీవి, ఒకటి కాంగ్రెస్ది. ఇక కాంగ్రెస్కు ఆర్థికంగా అండదండగా నిలిచే స్థాయిలో ఉన్నవి రెండే రెండు రాష్ర్టాలు. ఒకటి కర్ణాటక, రెండవది తెలంగాణ. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఆరునెలలు దాటి పోయాయి కాబట్టి అక్కడ కొత్త కాపురం మురిపెం తీరిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినప్పటికీ కర్ణాటక పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు నెలలే అవుతోంది కాబట్టి దేశం మొత్తంలో తెలంగాణ కాంగ్రెస్కు సురక్షితమైన రాష్ట్రంగా కనిపించడం సహజమే.
గత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదాకు అవసరమైనన్ని సీట్లు కూడా రాలేదు. ఈ సారి కాంగ్రెస్కు 40 సీట్లు కూడా వచ్చే అవకాశం కనిపించడం లేదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ జోస్యం చెప్పారు. బీహార్ సీఎం నితీష్కుమార్ ఎన్నికలకు రెండు నెలల ముందు ఇండియా కూటమి నుంచి బీజేపీ కూటమిలోకి దూకేశారు. కుర్చీ కాపాడుకోవడం, తిరిగి అధికారంలోకి రావడం ముఖ్యం. అందుకు కూటములు మార్చడం, పార్టీలు మార్చడం నాయకులకు పెద్ద కష్టమేమీ కాదు. గత రెండేండ్ల నుంచి ఎన్డీయే కూటమిలో చేరడానికి టీడీపీ అధినేత చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. అమిత్ షా వస్తే రాళ్లదాడితో సత్కరించిన టీడీపీ ఇప్పుడు నరేంద్ర మోదీ అనుగ్రహం కోసం తపిస్తున్నది. మోదీ కుటుంబం మీద సైతం విమర్శలు చేసిన బాబు ఇప్పుడు ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి వేయని ఎత్తంటూ లేదు. గత ఎన్నికల్లో రాహుల్ గాంధీతో కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరిగిన బాబు ఇప్పుడు మోదీ అనుగహిస్తే ఎన్డీయేలో దూకడానికి సిద్ధంగా ఉన్నారు.
బీజేపీ పాలన అంత అద్భుతంగా ఉందా? కాంగ్రెస్ అధినాయకురాలికి ఓ సురక్షితమైన సీటు కూడా లేనంత అద్భుతంగా బీజేపీ పాలన ఉందా? అంటే అలా ఏమీ లేదు. ఉత్తరాదిలో అధినాయకురాలికి ఒక్క సురక్షితమైన సీటు కూడా చూపించలేని దుస్థితిలో కాంగ్రెస్ ఉంది తప్ప, బీజేపీ పాలన అంత ఘనంగా ఏమీ లేదు.
విదేశాల నుంచి నల్లడబ్బు తీసుకువచ్చి ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానని, ఇంతకాలం పన్నులు కట్టిన ఉద్యోగులకు వీటి నుంచి కొంత ఇస్తామని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీ అమలైపోయి, ప్రజలు సానుకూలంగా ఉన్నారని కాదు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి పదేండ్ల పాలనలో 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చారని కాదు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చి రెట్టింపు చేశారని కాదు. రామరాజ్యం స్థాపించారని కాదు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రధాన హామీలు ఏవీ నెరవేర్చలేదు. అయితే ఎన్నికల్లో బీజేపీకి ఇవేవీ అడ్డంకి కావు. కాంగ్రెస్ నాయకులే బీజేపీకి శ్రీరామరక్ష. హిందూత్వ, పాకిస్థాన్, మైనారిటీలు, అయోధ్య రామాలయం, జై శ్రీరామ్.. ఇవి చాలు బీజేపీని గెలిపించడానికి. జీడీపీ ఎంత పెరిగింది? నిరుద్యోగం ఎంత పెరిగింది? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ఎంత అభివృద్ధి సాధించారు? అనే అంశాలను ఓటర్లు పట్టించుకోరు. రాజకీయ పక్షాలకూ అవసరం లేదు.
ఈశాన్య రాష్ర్టాలు , కేంద్ర పాలిత ప్రాంతాలు ఇలా దేశంలో ఎక్కడివారైనా ఈ దేశానికి ప్రధాని కావచ్చు. ఇది చెప్పుకోవడానికి బాగుంటుంది. కానీ ఇప్పటివరకు ఈ దేశానికి నాయకత్వం వహించిన వారిలో ఎక్కువమంది ఉత్తరాది నుంచే వచ్చారు. పీవీ నరసింహారావు (తెలంగాణ), దేవెగౌడ (కర్ణాటక) దక్షిణాది నుంచి వచ్చారనేది వేరే విషయం. మన్మోహన్సింగ్ రాజ్యసభ నుంచి ప్రధాని అయినా ఉత్తరాది నుంచి అప్పుడు కాంగ్రెస్కు లభించిన బలం వల్లనే అది సాధ్యమైంది. ఉత్తరాది నుంచి క్రమంగా కాంగ్రెస్ కనుమరుగైంది. కాంగ్రెస్కు నాయకత్వం వహిస్తున్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సైతం ఉత్తరాది నుంచి పోటీకి భయపడుతున్నారు. సోనియాగాంధీ రాజ్యసభను నమ్ముకుంటే రాహుల్గాంధీ దక్షిణాదిని నమ్ముకున్నారు. ఓడినా గెలిచినా కాంగ్రెస్ నాయకత్వం ఉత్తరాదిని పట్టుకొని అలానే ఉంటే ఇప్పుడు దేశంలో తమకు సురక్షితమైన సీటు ఉన్న రాష్ట్రం ఏది అని చూసే పరిస్థితి వచ్చేది కాదు.
బీజేపీ పాలన వల్ల బీజేపీ దేశంలో పట్టు సాధించడం లేదు. కాంగ్రెస్ తప్పు మీద తప్పు చేస్తూ బీజేపీ బలపడేట్టు చేస్తున్నది . కేవలం రెండు సీట్లున్న బీజేపీ అయోధ్య రథయాత్ర ద్వారా ఈ స్థాయికి చేరింది. హిందువులు 80 శాతం ఉన్న దేశం ఇది. బాబ్రీ మసీదు కూల్చివేత, రథయాత్ర, రామాలయ నిర్మాణం.. ఇవన్నీ రాజకీయమే. రాజకీయ పార్టీలు ప్రతిదానితో రాజకీయం చేస్తాయి. లేకపోతే ఆలయంలో కూర్చొని ధ్యానం చేసి మౌనంగా వెళ్ళిపోతారా? అలా మౌనదీక్ష చేస్తే వారి పార్టీకి ఏం ప్రయోజనం? కూల్చివేతలే కాదు, ఆలయ నిర్మాణం కూడా రాజకీయ ప్రయోజనం ఉండే విధంగానే నిర్వహిస్తారు. అయోధ్య ఆలయ ప్రారంభ కార్యక్రమాన్ని బహిష్కరించడం ద్వారా కాంగ్రెస్ ఆశిస్తున్న ప్రయోజనం ఏమిటో?
ఆలయ ప్రారంభోత్సవం రాజకీయమే, కాంగ్రెస్ దాన్ని బహిష్కరించడమూ రాజకీయమే. ఎన్నికల ముందు ఆలయాన్ని ప్రారంభించడం ద్వారా ఎలాంటి రాజకీయ ప్రయోజనం ఉంటుందో బీజేపీకే కాదు, దేశం మొత్తానికి స్పష్టత ఉంది. మరి బహిష్కరించడం ద్వారా ఏం ప్రయోజనమో కనీసం కాంగ్రెస్కైనా స్పష్టత ఉందా?
అయోధ్య ఆలయ అంశంలో కాంగ్రెస్ ప్రధానులు రాజీవ్ గాంధీ , పీవీ నరసింహారావు పాత్ర కూడా ఉంది. అయితే ఇప్పటి కాంగ్రెస్ నాయకత్వం మాతం ఆ క్రెడిట్ మొత్తం పళ్లెంలో పెట్టి బీజేపీకి ప్రధానంగా మోదీకి అప్పగించింది.
అయోధ్య అంశంలోనే కాంగ్రెస్ పార్టీ పీవీ నరసింహారావును దూరం పెట్టింది. 1991లో ఆర్థిక సంస్కరణల ద్వారా దేశాన్ని అప్పుల ఊబి నుంచి బైటపడేసి ఆధునిక భారత్కు పునాదులు వేసిన పీవీకి ఆ తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ కూడా ఇవ్వలేదు . ఏ ప్రధాని మరణించినా ఢిల్లీలో వారికి స్మారక కేంద్రం నిర్మించారు. ఒక్క పీవీ భౌతిక కాయాన్ని మాత్రం హడావుడిగా హైదరాబాద్ పంపించారు. హైదరాబాద్లో అంతకన్నా ఎక్కువ హడావుడి పడిపోయి అంత్యక్రియలు నిర్వహించారు. మైనారిటీల కోసం కాంగ్రెస్ పీవీని దూరం పెడితే బీజేపీ సర్కారు ఆయనకు భారతరత్న ఇచ్చింది. పీవీని దూరం పెట్టడం రాజకీయమే, భారతరత్న ఇవ్వడమూ రాజకీయమే.
అయితే ఏ రాజకీయ నిర్ణయం వల్ల ఎలాంటి ఫలితం ఉంటుందో సరిగ్గా అంచనా వేయడంలో కాంగ్రెస్ విఫలమైంది. మైనారిటీల కోసం పీవీని కాంగ్రెస్ దూరం పెడితే మైనారిటీలు గుండుగుత్తగా కాంగ్రెస్ వైపేమీ రాలేదు . కానీ ఈ అంశాన్ని ప్రచారం చేయడం ద్వారా మెజారిటీ హిందువుల మద్దతు కోసం బీజేపీ ప్రయత్నిస్తున్నది. రెండుసార్లు అధికారం సాధించి, మూడవసారి అధికారంలోకి రాబోతున్నారు అనే నమ్మకం కలిగించడం ద్వారా బీజేపీ ఈ విషయంలో విజయం సాధించినట్టే. పూర్తి మెజారిటీతో విజయం సాధించిన ప్రభుత్వాలనే మోదీ పరివారం కూల్చేయగలుగుతున్నారు. ఇక మోదీకి కంటిలో నలుసుగా మారింది ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం మాత్రమే. ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ ఆరుసార్లు నోటీసులు ఇచ్చింది. ఎన్నికల లోపే అక్కడ ఏమైనా జరగవచ్చు.
పార్లమెంట్ ఎన్నికల తరువాత ఉత్తరాదిలో హిమాచల్ను మినహాయిస్తే కాంగ్రెస్కు ఏమీ లేదు. దక్షిణాదిలో ఉన్నది తెలంగాణ, కర్ణాటక మాత్రమే. కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదం ఇచ్చిన బీజేపీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ రెండు రాష్ర్టాల్లో చేసే రాజకీయం ఎలా ఉంటుందో చూడాలి. తెలంగాణలో స్థానిక సంస్థల స్థాయిలో కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య అనుబంధం బాగుంది. బీజేపీ నుంచి వచ్చిన గవర్నర్ బీఆర్ఎస్ ప్రభుత్వంతో ఎడ మొగం పెడ మొగంగా ఉన్నారు. శాసనమండలి నామినేటెడ్ స్థానాలకు బీఆర్ఎస్ సూచించిన పేర్లను గవర్నర్ తిరస్కరించారు. వారు సామాజిక సేవకులు కాదు రాజకీయ నాయకులనేది గవర్నర్ అభ్యంతరం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఏకంగా ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షునిగా ఉన్న వ్యక్తి పేరును గవర్నర్ ఆమోదించారు. ఇప్పటికైతే రాష్ట్రస్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ సంబంధాలు బాగానే ఉన్నాయి. ఒకరకంగా మోదీ కాంగ్రెస్ను తెలంగాణకే పరిమితం చేశారు అనిపిస్తున్నది. కాంగ్రెస్ ఒక రాష్ట్రస్థాయి పార్టీగా మిగిలిపోతే మోదీకీ మంచిదే. పార్లమెంట్ ఎన్నికల తరువాత కర్ణాటక, తెలంగాణ రాజకీయాలు ఎలా ఉంటాయో చూడాలి.
బుద్దా మురళి