‘శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు. భబ్రాజమానం భజగోవిందం’ ఈ మాటలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తరచూ వాడుతుండేవారు. దానర్థం ‘అన్నీ ఉత్తమాటలే, ఉత్తముచ్చట్లేనని’. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన, దాని తీరుతెన్నులు నిశితంగా పరిశీలిస్తుంటే ప్రస్తుతం ఈ పదాలు వాడకుండా ఉండలేకపోతున్నామంటే అతిశయోక్తి కాదు. బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేండ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలను మించి ఉండాలన్న ఉత్సాహంతో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ పథకాల తాయిలాలతో ఓటర్లను ఆకర్షించాలని ఎత్తుగడ వేసింది. ఆ మేరకు సఫలీకృతమైంది.
వందల హామీలిచ్చినప్పటికీ, 1.81 శాతం ఓట్ల మెజారిటీతో మాత్రమే అధికారాన్ని సొంతం చేసుకున్నది. అదేం పెద్ద విజయం కాదన్నది రాజకీయం తెలిసినవాళ్లు చెబుతున్న మాట. ఇక చాలామంది సోకాల్డ్ రాజకీయ విశ్లేషకులు కూడా ‘మొన్నవచ్చింది కాంగ్రెస్ హవా’ అంటూ వ్యాఖ్యానించడం ఆశ్చర్యకరం. హవా వస్తే రాష్ట్రమంతా రావాలి కానీ, పట్టణ ప్రాంతంలో అసలు ఏమాత్రం ప్రభావం చూపకపోవడం ఏంటి? గ్రామీణ ప్రాంతాల్లోనే కాంగ్రెస్ గెలవడం, అది కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలోనే అన్నది గుర్తెరగాలి.
Congress | పాలసీ పాలసీ సంబంధిత అంశాలపై ఒక్కసారి చర్చిద్దాం. చాలామంది కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు మాత్రమే ఇచ్చిందని అంటున్నారు. కానీ, ఆ పార్టీ విడుదల చేసిన మ్యానిఫెస్టోలో సుమారు 400కి పైగా హామీలు ఉన్నాయి. వాటిని ఎలా అమలు చేస్తుందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఆ 42 పేజీల మ్యానిఫెస్టో పత్రంలో 37 భాగాలున్నాయి. అవిగాక, సుపరిపాలన, 6 గ్యారంటీల కార్డు, 5 డిక్లరేషన్లు, అనుబంధ మ్యానిఫెస్టో పేరుతో జాబ్ క్యాలెండర్లున్నాయి. వీటిలో గ్యారంటీల కార్డు గురించి వారు అన్నింటికన్నా ఎక్కువగా ప్రచారం చేశారు. దాని అమలుకు 100 రోజుల గడువును వారే కోరారు. అదిగాక, జాబ్ క్యాలెండర్లో ఆయా ఉద్యోగాల భర్తీకి సంబంధించి నిర్దిష్టమైన తేదీలు ఇచ్చినందున అవికూడా గడువుల వంటివే. అంతేకాదు, అధికారానికి వచ్చిన తర్వాత తొలి మంత్రివర్గ సమావేశంలోనే 6 గ్యారెంటీలకు చట్టబద్ధత, మెగా డీఎస్సీ ప్రకటన, 9వ తేదీన రూ.2 లక్షల రుణమాఫీ వంటి ఇతర నిర్దిష్టమైన హామీలున్నాయి. గడువు అయితే 100 రోజులు ఉన్నప్పటికీ, యాసంగి పంటల సాగు మొదలైనందున అందుకోసం రైతు భరోసా కింద రైతులకు ఎకరానికి ఈ విడతగా రూ.7,500, కౌలుదార్లకు రూ.7,500 చొప్పున పెట్టుబడి సాయం వెంటనే ఇవ్వాల్సి ఉన్నది.
ఆరు గ్యారెంటీలను పరిశీలిస్తే.. అందులో మొదటిది మహాలక్ష్మి. ఈ హామీలో భాగంగా మహిళలకు ప్రతి నెల రూ.2500 ఆర్థిక సాయం, బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ.500కు గ్యాస్ సిలిండర్లను ఇస్తామని ప్రకటించారు. రెండోది రైతు భరోసా. దీని కింద రైతులకు ఎకరానికి ఏడాదికి రూ.15,000, కౌలు రైతులకు ఎకరానికి ఏడాదికి రూ.15,000, భూమిలేని వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12,000 ఆర్థిక సాయంతో పాటు వరి పంటకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పారు. మూడోదైన గృహజ్యోతి కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు ఇస్తామని ప్రకటించారు.
నాలుగోది ఇందిరమ్మ ఇండ్లు. ఇల్లులేని వారికి ఇంటి స్థలం, రూ.5 లక్షలు, ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం దీని కింద ఇస్తామన్నారు. ఐదోది యువ వికాసం. అందులో భాగంగా విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, అదిగాక, ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూళ్లు అందుబాటులోకి తెస్తామన్నారు. ఆఖరి గ్యారెంటీ చేయూత. దీనిలో భాగంగా నెలవారీ పింఛన్లు రూ.4,000, రాజీవ్ ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచడం. వీటన్నింటి అమలుకు గడువు 100 రోజులు. అంతేగాక ఈ గ్యారెంటీ కార్డుకు చట్టబద్ధత కల్పించటం.
ఈ హామీల్లో ఏది అమలు కాకపోయినా ఆ పార్టీ నేతలు, ప్రభుత్వ పెద్దలు ప్రజానీకానికి సమాధానం ఇవ్వాల్సిందే. వీటి అమలుకు ప్రభుత్వానికి కొంత సమయం ఇద్దామని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎంతో హుందాగా చెప్పారు. కానీ, కొత్త ప్రభుత్వం తీరు వేరుగా ఉన్నది. చేయాల్సిన పనులేంటో చెప్పకుండా పాత ప్రభుత్వం మీద ఉద్దేశపూరితంగా దాడి చేయడం సహేతుకం అనిపించుకోదు.
ఓ కాంగ్రెస్ నాయకుడు ఇంకో అడుగు ముందుకేసి పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతుందని వ్యాఖ్యానించారు. అసలు ఆయనకు బీఆర్ఎస్ పుట్టుక, ఎదుగుదల మీద కనీసం అవగాహన లేదనిపిస్తున్నది. కొంత రాజకీయ సంఖ్యా శాస్త్రపరంగా బీఆర్ఎస్ విజయాలను ఆయనకు తెలపాలనుకుంటున్నాను. ఎందుకంటే, నిజం చెప్పకపోతే అబద్ధం అరక్షణంలోనే ప్రపంచమంతా చుట్టి వస్తుందని ఒక నానుడి ఉన్నది. అందుకే ఈ ప్రస్తావన తేవాల్సి వచ్చింది.
ఇటీవల రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కి 37.35 శాతం, కాంగ్రెస్కు 39.40 శాతం ఓట్లు వచ్చిన విషయం సర్వత్రా తెలిసిందే. రెండు పార్టీల మధ్య కేవలం 2 శాతం ఓట్ల తేడా ఉన్నది. 2018లో జరిగిన ఎన్నికల్లో లభించిన ఓట్ల శాతం చూస్తే అప్పటి టీఆర్ఎస్కు 46.9 శాతం ఓట్లు వస్తే, కాంగ్రెస్కు 28.4 శాతం ఓట్లు వచ్చాయి.
రెండు పార్టీల మధ్య అప్పుడు 18 శాతం ఓట్ల తేడా ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తొలినాళ్లలో జరిగిన ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కేవలం 25.2 శాతం ఓట్లు రాగా టీఆర్ఎస్కు 34.3 శాతం లభించాయి. అంటే రెండు పార్టీల మధ్య తేడా 9 శాతానికిపైగా ఉన్నది. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో చూసుకున్నా గడిచిన రెండు సార్వత్రిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కంటే 10 శాతం ఎక్కువ ఓట్లను బీఆర్ఎస్ దక్కించుకున్నది. ఇదిలా ఉండగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 120 మున్సిపాలిటీల్లో 105 బీఆర్ఎస్ చేతిలోనే ఉన్నాయి. కాంగ్రెస్ కేవలం 5 మున్సిపాలిటీలను సొంతం చేసుకోగా.. బీజేపీ 4 మున్సిపాలిటీలలో ప్రభావం చూపగలిగింది.
ఏఐఎంఐఎం భైంసాలో పాగా వేసింది. తొమ్మిది కార్పొరేషన్లకుగానూ ఆరు బీఆర్ఎస్ చేతిలోనే ఉన్నాయి. 2019లో జరిగిన జిల్లా పరిషత్తు ఎన్నికల్లో బీఆర్ఎస్ తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. మొత్తం 32 జిల్లాల్లోనూ విజయ ఢంకా మోగించి ఔరా అనిపించింది. అన్ని జిల్లాల జడ్పీ పీఠాలను గంపగుత్తగా కైవసం చేసుకున్నది. వీటిలో 20 జడ్పీ పీఠాలను మహిళలు దక్కించుకోవడం విశేషం. అన్ని జిల్లాల్లో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను అప్పటి అధికార పార్టీ టీఆర్ఎస్ సొంతం చేసుకున్నది. ఎంపీపీ ఎన్నికల్లో 80 శాతానికి పైగా పీఠాలను కైవసం చేసుకున్న బీఆర్ఎస్.. జడ్పీ ఎన్నికల్లో వంద శాతం స్థానాలను దక్కించుకున్నది. జడ్పీ చైర్మన్లలో 17 స్థానాలు వెనకబడిన సామాజిక వర్గాలకే దక్కాయి.
2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 95 స్థానాల్లో పరాజయం పాలైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. అదే ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 15 స్థానాలను కోల్పోయిన విషయం తెలిసిందే. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 100 స్థానాల్లో ఆ పార్టీ ఓటమి చవిచూసింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 14 స్థానాల్లో పరాజయం పాలైన విషయం తెలిసిందే.
2014 నుంచి 2023 వరకు ఏడు ఉప ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ ఒక్కదాంట్లో కూడా గెలవలేదు. పైగా మూడు ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య కేవలం 2 శాతం ఓట్ల తేడా ఉన్నది. ఈ మాత్రం వచ్చినందుకే కాంగ్రెస్ పార్టీ మిడిసిపడటం సహేతుకం కాదు. ఎమ్మెల్యేల పరంగా, స్థానిక సంస్థల పరంగా చూసుకున్నా.. ఎంతో బలంగా ఉన్న బీఆర్ఎస్ సార్వత్రిక ఎన్నికల తర్వాత కనుమరుగవుతుందని చెప్పడం హాస్యాస్పదంగా అనిపిస్తున్నది. చివరగా చెప్పేదేమిటంటే కాంగ్రెస్ పార్టీలో అధికార అహంకారం స్పష్టంగా కనిపిస్తున్నది. తెలంగాణ వాదం కోసం పుట్టిన బీఆర్ఎస్(టీఆర్ఎస్)ను తుద ముట్టించడం చంద్రబాబు, వైఎస్ఆర్ల వల్ల కాలేదు. ఈ నేతలు కొస్తున్న కోతలతో బీఆర్ఎస్ ఖతం అవుతుందని చెప్పడం పచ్చి అబద్ధం కాదా?
వ్యాసకర్త : బీఆర్ఎస్ ఎంపీ డాక్టర్ జి.రంజిత్రెడ్డి