న్యూఢిల్లీ: ప్రతిపక్ష పార్టీల ‘ఇండియా’ కూటమి సమావేశం జూన్ 8న ఢిల్లీలో జరుగనున్నది. అయితే తమిళనాడు ఎన్నికల విషయంలో కాంగ్రెస్తో విభేదాల నేపథ్యంలో ఎంకే స్టాలిన్ నేతృతంలోని డీఎంకే గైర్హాజరు కానున్నది. (DMK to skip INDIA bloc meet) సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకేకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంతోపాటు ప్రభుత్వంలో చేరడాన్ని డీఎంకే విమర్శించింది. రాజకీయ ప్రయోజనాల కోసం దశాబ్దాల నాటి భాగస్వామ్యాన్ని కాంగ్రెస్ విడిచిపెట్టిందని డీఎంకే నేతలు మండిపడ్డారు. ఆ పార్టీపై ‘ద్రోహం’ ‘వెన్నుపోటు’ ఆరోపణలు చేశారు.
కాగా, పార్లమెంట్లో డీఎంకే ఎంపీలకు ప్రత్యేక సీటింగ్ ఏర్పాట్లు చేయాలని కోరుతూ డీఎంకే ఎంపీ కనిమొళి ఇటీవల లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ‘ఇండియా’ కూటమిలోని చీలికకు ఈ చర్య తొలి సంకేతంగా భావిస్తున్నారు.
మరోవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉమ్మడి వ్యూహాంపై చర్చించేందుకు, కీలక రాజకీయ పోరాటాలకు ముందు ప్రతిపక్ష సమన్వయాన్ని బలోపేతం చేసుకునేందుకు జూన్ 8న ఢిల్లీలో ‘ఇండియా’ కూటమి సమావేశాన్ని నిర్వహించనున్నారు. 15 ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.
అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ‘ఇండియా’ కూటమిలోని రెండు ప్రధాన భాగస్వామ్య పార్టీలైన పశ్చిమ బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్, తమిళనాడులోని డీఎంకేకు ఎదురుదెబ్బలు తగిలాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశం జరుగడం విశేషం. అలాగే చీలిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ కీలకమైన ఈ ప్రతిపక్ష సమావేశానికి హాజరవుతున్నట్లు తెలుస్తున్నది.