దేశ ఆర్థికవ్యవస్థలో 46 శాతం వాటా కలిగిన వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నది. సుమారు తొమ్మిదేండ్లుగా అహోరాత్రులు కష్టపడి వ్యవసాయరంగాన్ని దేశంలోనే అగ్రభాగాన నిలిపింది. దేశం ఆర్థికంగా ఉన్నత స్థాయికి ఎదగడంలో నూటికి 64 శాతం మంది ఆధారపడి జీవిస్తున్న వ్యవసాయం, అనుబంధ పరిశ్రమలు కీలక భూమికను పోషిస్తున్నాయి.
వ్యవసాయరంగానికి ప్రధానంగా కావలసింది సాగు నీరు, సారవంతమైన భూమి, ప్రణాళికాబద్ధమైన వ్యవసాయ విధానం. ఈ మూడు తోడుంటేనే వ్యవసాయంలో విజయం సాధించగలుగుతాం. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపు, ప్రణాళికాబద్ధమైన వ్యవసాయ విధానం ప్రస్తుతం మనకు కనబడుతున్నది. తెలంగాణ ఆవిర్భావ అనంతరం దేశానికి ఆదర్శంగా తెలంగాణ నిలిచిందని చెప్పడానికి మన వ్యవసాయ విధానమే ప్రధానమైనది. దేశంలో తెలంగాణ మినహా రైతుబంధు పథకం, 24 గంటల నిరంతర విద్యుత్తును అందిస్తున్న రాష్ర్టాలేవీ లేవు. రాష్ట్రంలో వ్యవసాయం అభివృద్ధి చెందటంతో పాటు అనుబంధంగా ఉన్న పాడి పరిశ్రమ, కోళ్లు, గొర్ల పెంపకం, మత్స్య పరిశ్రమ, ఆహారశుద్ధి పరిశ్రమలు సమృద్ధిగా అభివృద్ధి సాధిస్తున్నాయి.
తెలంగాణ చరిత్రలోనే ప్రస్తుత పంట దిగుబడి కొత్త రికార్డు నమోదు చేసుకున్నది. 2014 నుంచి 2022 వరకు గమనిస్తే వ్యవసాయరంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా బలోపేతం చేసిందనేది స్పష్టమవుతుంది. సాగునీటి ప్రాజెక్టులు అందుబాటులోకి రావడంతో బీడు భూములు కనిపిస్తలేవు. పాలకుడే వ్యవసాయదారుడైతే ఆ రంగంలో ఉన్న లోటుపాట్లు తెలుస్తాయి. స్వయంగా రైతు అయిన మన ముఖ్యమంత్రి వ్యవసాయాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. గత తొమ్మిదేండ్లుగా వానలు సమృద్ధిగా కురవడంతో ప్రాజెక్టులు నిండుకుండల్లా పొంగిపొర్లుతున్నాయి. మరోవైపు భూగర్భ జలాలు కూడా పెరిగాయి.
తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా 2020- 21లో 67.17 లక్షల ఎకరాల్లో సాగు కాగా, 2023 యాసంగిలో 68.53 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. 2014-15 యాసంగిలో 28.18 ఎకరాల్లో పంటల సాగు నమోదైంది. ప్రస్తుతం మరో 40.35 లక్షల ఎకరాల్లో సాగు పెరిగింది. ఎన్నడూ లేనివిధంగా 53.08 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేసినట్టు అధికారులు ధృవీకరించారు. దేశంలో పంజాబ్, ఛత్తీస్గఢ్ తర్వాత తెలంగాణ నుంచే అధిక ధాన్యం సేకరణ జరుగుతుందని కేంద్ర ఆహార ప్రజా పంపిణీశాఖ వెల్లడించింది.
కేంద్రం పంటకు గిట్టుబాటు ధర కల్పించేలా ప్రణాళికలు రూపొందిస్తే దేశంలోనే అత్యధిక వ్యవసాయ ఉత్పత్తులు తెలంగాణ నుంచి వస్తాయి. అయితే దీనికి సుస్థిర పాలన యంత్రాంగం తప్పనిసరి. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి దోహదపడుతున్న అంశాలైన వ్యవసాయరంగం, పారిశ్రామిక విధానం, ఐటీ రంగం, ఉపాధి కల్పన, యువతకు శిక్షణ కార్యక్రమాలు, సామాన్య ప్రజలకు మౌలిక వసతుల కల్పన చర్యల్లో తెలంగాణ ముందంజలో ఉన్నది.
గ్రామీణాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడమే దీనికి కారణం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న యువతీ యువకులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పన కోసం చిన్నతరహా పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నది. మరుగునపడ్డ కుటీర పరిశ్రమలు వడ్రంగి, కమ్మరి, కుమ్మరి, మేదరి, చేనేత రంగాలు ఉపాధి కోల్పోకుండా అనేక ప్రణాళికలను రచిస్తున్నది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కుటీర పరిశ్రమలు పునరుద్ధరించి ఆధునిక యంత్రాల ద్వారా ఉత్పత్తి చేపట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తుండటం ఆహ్వానించదగిన పరిణామం.
(వ్యాసకర్త: పౌర సంబంధాల అధికారి, కాకతీయ యూనివర్సిటీ)
– రక్కిరెడ్డి ఆదిరెడ్డి 98495 77610