రాష్ట్రం ప్రగతిబాటలో నడవాలంటే విద్యా సంస్కరణలు కీలకమైనవని తెలంగాణ ప్రభుత్వం విశ్వసించింది. అందులో భాగంగానే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు నూతన పాఠ్య పుస్తకాలను రూపొందించింది. ఆయా పాఠ్య పుస్తకాలల్లో నిర్దేశించిన సామర్థ్యాలు, అభ్యసనా ఫలితాలను విద్యార్థులు సాధించాలి. అప్పుడే గుణాత్మకమైన విద్యను సాధించినట్టుగా భావిస్తారని విద్యాహక్కు చట్టం (RTE-2009) ప్రస్తావించింది.
కరోనా మహమ్మారి విద్యారంగాన్ని ఒక కదుపు కదిపేసింది. ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు తెలంగాణ ప్రభుత్వం శీఘ్రగతిన దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుత విద్యార్థుల విద్యా పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని, తరగతివారీ సామర్థ్యాలు- అభ్యసనా ఫలితాల సాధన కోసం గుణాత్మకమైన అభ్యసనాభివృద్ధి కార్యక్రమాన్ని ‘ఉన్నతి’ అనే పేరుతో అమలుచేయాలనే నిర్ణయం తీసుకున్నది. దీన్ని 6, 7, 8, 9వ తరగతులకు నిర్వహించడానికి ప్రాథమిక స్థాయిలో అమలవుతున్న ‘తొలిమెట్టు’ కార్యక్రమ స్ఫూర్తితో కార్యాచరణ ప్రణాళికను రచించారు. దీనికి అనుబంధంగా పాఠశాల విద్యలో అత్యంత కీలకమైన 10వ తరగతి విద్యార్థుల ఉత్తమ ఫలితాల సాధన కోసం రాష్ట్ర విద్యాశాఖ ‘లక్ష్య’ అన్న పేరుతో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ ప్రణాళికలను అమలుపరుస్తూ విద్యార్థులకు అర్థవంతమైన బోధనతో పాటు అభ్యాసాల సాధనకు మార్గం సుగమం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.
సాధారణంగా భాషాపరంగా చూసినప్పుడు పిల్లలు చదవడం, రాయడం అనే మౌలిక సామర్థ్యాలు కలిగి ఉండటంతో పాటుగా ఆయా తరగతులకు నిర్దేశించిన భాషా సామర్థ్యాలకు చెందిన అభ్యసన ఫలితాలను సాధించాల్సి ఉంటుంది. ఆ విధంగా సాధించినప్పుడే భాషా బోధన లక్ష్యం నెరవేరినట్టుగా భావిస్తారు. ‘ఉన్నతి’ కార్యక్రమ ప్రధాన లక్ష్యం కూడా ఇదే. ఇందుకోసం ఎస్సీఈఆర్టీ, భాషా విభాగం, కో-ఆర్డినేటర్ సువర్ణ వినాయక్ నాయకత్వంలోని విషయ నిపుణుల కమిటీ ‘ఉన్నతి’ తెలుగు ఉపాధ్యాయుల కరదీపికను మొత్తం 12 అధ్యాయాలుగా రూపొందించింది. విద్యార్థుల్లో తరగతివారీగా పాఠ్యాంశాల ఆధారంగా మౌలిక సామర్థ్యాల సాధన, తద్వారా భాషా సామర్థ్యాలు, ప్రధానంగా ధారాళంగా చదువడం, చదివిన దానిని అర్థం చేసుకోవడం, రాయడం ద్వారా వ్యక్తీకరణ, వీటి సాధన వల్ల ఆ తరగతి నిర్దేశించిన అభ్యసన ఫలితాలను సాధించడం కోసం విధి విధానాలను తెలియజేయవచ్చు.
ప్రతి విద్యార్థి నాణ్యమైన విద్య పొందాలనే సత్సంకల్పంతో రాష్ట్ర పాఠశాల విద్యా విభాగం రూపొందించిన ఈ కార్యక్రమాలను సజావుగా అమలుజరుపుతూ, తద్వారా తరగతివారీ అభ్యసన ఫలితాలు సాధించాల్సి ఉన్నది. విద్యార్థుల్లో ‘ఉన్నతి’, ‘లక్ష్య’ కార్యక్రమాల ద్వారా సామర్థ్యాలను సాధింపజేసే మహాయజ్ఞం తప్పకుండా తెలంగాణను రాబోయే రోజులో విద్యా తెలంగాణంగా మారుస్తుందనడంలో సందేహం లేదు.
– డాక్టర్ ఉప్పల పద్మ 99591 26682
(వ్యాసకర్త: స్టేట్ రిసోర్స్ గ్రూప్ సభ్యులు)