సబ్బండ వర్ణాలు కొట్లాడి తెచ్చుకున్న స్వరాష్ట్ర కల సాకారమైంది. అత్యల్ప కాలంలోనే తెలంగాణ అపూర్వమైన ప్రగతిని సాధిస్తూ పదేండ్ల ప్రాయంలోకి అడుగుపెట్టింది. ప్రజా ఆకాంక్షలకనుగుణంగా ప్రగతి కాంతులు వెదజల్లుతూ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నది. ఎన్నో సవాళ్లను, సమస్యలను అధిగమిస్తూ, ఒక్కో రంగాన్ని తీర్చిదిద్దుకుంటూ తెలంగాణ రాష్ట్రం యావత్తు దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఇది మనందరికీ గర్వకారణం.
ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని ఉచ్చరించవద్దనే నిర్బంధం నుంచి నేడు దేశమంతా తెలంగాణ గురించి మాట్లాడుకునే స్థాయికి తెలంగాణ ఎదిగింది. దశాబ్దాల కిందటే రాష్ట్రాలుగా స్థిరపడ్డ దేశంలోని అనేక రాష్ట్రాలతో తెలంగాణ ఇప్పుడు పోటీపడుతున్నది. దశాబ్దాలుగా ఇంకా తీరని సమస్యలతో సతమతమవుతున్న దేశ ప్రజానీకానికి తెలంగాణ రాష్ట్ర నాయకత్వం ఆశాకిరణమై నిలుస్తున్నది.
తెలంగాణ ఏర్పడగానే మొదటగా అట్టడుగు వర్గాలకు, అసహాయులకు అన్నార్తులకు కనీస జీవనభద్రత కల్పించాలని, ఇది సామాజిక బాధ్యత అని ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించారు. ఈ సదాశయంతోనే తెలంగాణ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేసింది. దేశంలో మరే రాష్ట్రంలోనూ అమలుచేయని విధంగా ప్రభుత్వం ఏటా రూ.60 వేల కోట్లకు పైగా నిధులతో రైతుబంధు, రైతుబీమా లాంటి ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నది. వ్యవసాయానికి సరిపడా సాగునీరు, 24 గంటల ఉచిత, నాణ్యమైన కరెంటు సరఫరా చేస్తున్నది. కేంద్రం చేతులెత్తేసినా వెరవకుండా 7 వేలకుపైగా కేంద్రాలు పెట్టి పండిన ధాన్యం మొత్తం కొనుగోలు చేయడం, తాజాగా యాసంగి జొన్న పంటకు కూడా మద్దతు ధర చెల్లించి రాష్ట్ర ప్రభుత్వమే సేకరించాలని సీఎం కేసీఆర్ ఆదేశించడం తెలిసిందే. ఇలాంటి నిర్ణయాలు మానవీయ పాలకులకు మాత్రమే సాధ్యమనే విషయాన్ని నిరూపిస్తున్నాయి.
ఈ రోజు తెలంగాణ గొప్పగా అభివృద్ధి సాధించింది. దేశంలోని అన్ని రాష్ట్రాలూ ఇదేవిధంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉన్నది. దేశానికి ఆర్థిక దన్నుగా నిలిచిన మొదటి నాలుగైదు రాష్ర్టాల్లో తెలంగాణ రాష్ట్రం కూడా ఒకటి కావడం మనందరికీ గర్వకారణం. సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రం ఎట్లయితే దేశానికి మార్గదర్శకంగా నిలుస్తున్నదో.. రేపటి రోజున ఇలాంటి సంక్షేమ ఫలాలన్నీ దేశ ప్రజలందరికీ అందాల్సిన అవసరం ఉన్నదనే ఆలోచన దేశంలోని అన్నివర్గాల ప్రజల్లో మొదలైంది.
ఈ దశాబ్ద కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాల కోసం సుమారు రూ.6 లక్షల కోట్లకుపైగా నిధులను కేటాయించింది. దేశ సంక్షేమరంగ చరిత్రలోనే తెలంగాణను అగ్రభాగాన నిలిపింది. బడ్జెట్లో సింహభాగం ప్రజా సంక్షేమానికి కేటాయించిన పేదల ప్రభుత్వంగా ప్రజల విశ్వాసం పొందింది. రాష్ట్రంలో ఇప్పుడు సంక్షేమ ఫలాలు పొందని ఇల్లు లేదు. ఈ రోజు తెలంగాణ పథకాలన్నీ తమకూ కావాలని పలు రాష్ర్టాల నుంచి డిమాండ్లు వస్తున్నాయంటే పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. ఇంత తక్కువ కాలంలోనే ఇంత అభివృద్ధి ఎట్లా సాధ్యమైంది? అంటే.. ‘సంపదను సృష్టించాలి, దాన్ని పేదలకు పంచాలి’ అనే సూత్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరించడంతోనే సాధ్యమవుతున్నది. దేశవ్యాప్తంగా ఏయే రంగాల్లో బీఆర్ఎస్ ఏం చేయనున్నదో తెలియజేస్తూ, పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రణాళికలూ రూపొందుతున్నాయి. రాబోయే రోజుల్లో తెలంగాణ మాడల్ అభివృద్ధి, దేశమంతటా చర్చనీయాంశం కానున్నది.
నేడు తెలంగాణ రాష్ట్రం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ఎన్నో రాష్ట్రాల ఉన్నతాధికారుల బృందాలు ఇక్కడికి వచ్చి అధ్యయనం చేస్తున్నాయి. ఇక్కడ చేపట్టిన తెలంగాణ రైతుబంధు, మిషన్ భగీరథ, ప్రాజెక్టుల నిర్మాణం, తదితర సంక్షేమ పథకాలను అధ్యయనం చేసి, ఆయా రాష్ర్టాల్లో వివిధ పేర్లతో అమలు చేస్తున్నాయి. అయితే, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పలు రాష్ర్టాల మేధావులతో చర్చిస్తున్నారు. ఆయా రాష్ర్టాల్లో తక్షణ సమస్యలేమిటి? వాటిని పరిష్కరించే కార్యాచరణపై స్పష్టమైన నిర్ణయానికి వచ్చారు. తెలంగాణ అభివృద్ధిని దేశవ్యాప్తం చేయడానికి ప్రత్యేక ప్రణాళికలతో ముందుకువెళుతున్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి అభివృద్ధి జరగాలంటే చిత్తశుద్ధిలేని పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలతో జరగదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి చిత్తశుద్ధి, సంకల్పసిద్ధి ఉన్న నాయకుడితోనే సాధ్యమవుతుంది. తెలంగాణలో కేసీఆర్ సారథ్యంలో అన్నిరంగాల్లో జరిగిన అభివృద్ధి కళ్లెదుటే కనిపిస్తున్నది. అందుకే సీఎం కేసీఆర్ నేతృత్వంలోనే దేశవ్యాప్తంగా తెలంగాణ మాడల్ అభివృద్ధి సాధ్యమవుతుంది.
ఇకపోతే, ఇక్కడొక విషయం గురించి మనం చెప్పుకోవాలె. గతంలో ప్రభుత్వ పథకాలు మంజూరవుతున్నాయంటే చాలు.. కాంగ్రెస్, టీడీపీ నాయకులకు, పైరవీకారులకు పండగే. ప్రభుత్వం మంజూరు చేసిన పథకాల్లో 40 శాతమే ప్రజలకు చేరితే మిగతాది మధ్య దళారీలు, పైరవీకారులు, అధికారులు, కాంగ్రె స్, టీడీపీ నాయకులు మింగేసేవారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం పథకాలను రూపొందించడమే కాదు, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్యలో ఎవరూ లేకుం డా, డైరెక్ట్ బెనిఫీషియరీ ట్రాన్స్ఫర్ (డీబీటీ) పద్ధతిలో సంక్షేమ ఫలాలను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయడమనేది సీఎం కేసీఆర్ గొప్ప ఆలోచన. ఈ డీబీటీ పద్ధతికి యావత్తు దేశ ప్రజలు మద్ద తు పలుకుతున్నారు. అందుకే ఈరోజు మేధావులు, రైతులు, కార్మికులు, మహిళ లు, యువకులంతా ఇదే అంటున్నారు. కాంగ్రెసోల్ల రాజ్యమంటే.. అది నాయకులకు, పైరవీకారులకు భోజ్యం. కానీ, బీఆర్ఎస్ రాజ్యమంటే.. అది రైతు రాజ్యం, అది ప్రజల రాజ్యం.
(వ్యాసకర్త: బీఆర్ఎస్ సీనియర్ నాయకులు)