దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయింది. ఇటీవలే స్వాతంత్య్ర వజ్రోత్సవాలు కూడా నిర్వహించుకున్నాం. మన దేశానికి అతిపెద్ద ప్రజాస్వామికదేశంగా పేరున్నది. కానీ ప్రస్తుతం మన దేశంలో అందుకు భిన్నంగా పాలన సాగుతున్నది. ప్రజాస్వామ్య స్ఫూర్తి పూర్తిగా పలుచబడింది. నాడు ఆంగ్లేయుల పాలనలో అనుభవించిన దారుణ పరిస్థితులే ఇప్పుడూ కనిపిస్తున్నాయి.
దే శానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశాన్ని అత్యధిక కాలం పాలించింది కాంగ్రెస్, బీజేపీలే. కానీ నేటికీ దేశంలో పెద్ద సంఖ్యలో ప్రజలు దారిద్య్రరేఖకు దిగువనే ఉన్నారు. దళితులు, గిరిజనులు, బహుజనులు తమ హక్కుల కోసం పోరాటాలు చేస్తూనే ఉన్నారు. సమగ్ర, సమ్మిళిత అభివృద్ధి ఎందుకు సాధ్యం కాలేదన్నది ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రధాన ప్రశ్న. దేశాన్ని దశాబ్దాల పాటు పాలించిన వాళ్లు దేశ పరిస్థితులను మాత్రం మార్చలేకపోయారు. అభివృద్ధిని పూర్తిగా విస్మరించారు.
ప్రస్తుతం ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ప్రజలను మరోసారి మోసం చేసేందుకు జట్టుకట్టి మరీ జనం ముందుకు వస్తున్నారు. అయితే.. ఈ కూటముల ఎజెండా మాత్రం క్లియర్ కట్గా ఉన్నది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని గద్దె దించాలనేది కాంగ్రెస్ కూటమి ఎజెండా. కాంగ్రెస్ కూటమిని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడం బీజేపీ కూటమి ఎజెండా. అంతకుమించి ఈ కూటములకు వేరే ఆలోచనలు లేవనేది సుస్పష్టం.
దేశాన్ని ఏండ్ల తరబడి పాలిస్తున్న వాళ్లంతా సవ్యంగా చేసి ఉంటే.. వ్యవసాయ ప్రాధాన్య దేశమైన భారత్లో ఏకంగా దేశ రాజధానిలో రైతులు ఏడాదికి పైగా రోడ్డుపై ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? 700 మందికి పైగా రైతులు ఎందుకు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది? అంతర్జాతీయ వేదికలపై భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించి దేశ గౌరవాన్ని విశ్వవ్యాప్తం చేసిన క్రీడాకారులు అదే దేశ రాజధాని నడిబొడ్డున ధర్నాకు ఎం దుకు దిగారు? ఇదే గడ్డపై వారిని గొరగొర ఈడ్చుకుంటూ వెళ్లినా పట్టించుకోని పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆడబిడ్డలను అందునా మన దేశ గౌరవాన్ని నిలబెట్టిన బిడ్డలను దేశాన్ని పాలిస్తున్న బీజేపీ ఎంపీ లైంగికంగా వేధించాడని ఆరోపణలు వస్తే ఇప్పటివరకు చర్యలెందుకు తీసుకోలేదు? అన్నీ జవాబు లేని ప్రశ్నలే. అంతర్జాతీయంగా దేశ పరువుకు భంగం కలిగినా ఫర్వాలేదు కానీ తమ ఎంపీ జోలికొస్తే మాత్రం ఊరుకోమన్నట్టుగా దేశాన్ని పాలిస్తున్న పార్టీ వ్యవహరిస్తున్నది.
ఇదంతా నిన్నమొన్నటి విషయమైతే, రెండున్నర నెలలుగా మణిపూర్ రావణకాష్టంలా రగులుతున్నది. పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు అరచేత పట్టుకుని వేలాది మంది అడవుల్లో తలదాచుకుంటున్నారు. అక్కడ నిత్యం తుపాకుల మోతలే వినిపిస్తున్నాయి. ఇప్పుడు అది మరింత చేయిదాటిపోయింది. ఓ వర్గం మహిళలను మరో వర్గం పురుషులు నగ్నంగా ఊరేగించారు. వారితో అమానుషంగా వ్యవహరించారు. మణిపూర్లో, కేంద్రంలో అధికారంలో ఉన్నది కూడా బీజేపీ ప్రభుత్వమే. కానీ చర్యలు మాత్రం శూన్యం. ఆర్మీని కూడా రంగంలోకి దింపామని.. స్వయంగా హోంశాఖ మంత్రి వెళ్లి మణిపూర్లో సమీక్ష నిర్వహించారని చెప్పుకొన్నారు. కానీ 70 రోజులవుతున్నా రావణకాష్టం ఆగలేదు. మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై మోదీ సర్కారు నోరు మెదపలేదు. చివరికి మహిళలతో అమానవీయంగా వ్యవహరించిన వీడియోలు సోషల్ మీడియాలోకి వచ్చాయి. ఆ తర్వాత గానీ ప్రధాన మీడియా దాన్ని చూపించలేదు. సుప్రీంకోర్టు మందలిస్తే గానీ, కేంద్ర ప్రభుత్వం, దేశ ప్రధాని దీనిపై స్పందించలేదు. అది కూడా పార్లమెంట్ సమావేశాలున్నాయి కాబట్టి.. తప్పనిసరి పరిస్థితుల్లో మణిపూర్పై ప్రధానమంత్రి నోరు మెదిపారు. ఆయన మాటలతో పరిస్థితిలో మార్పు వస్తుందనుకోవడం హాస్యాస్పదమే అవుతుంది.
మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ కూడా దీన్ని తమ రాజకీయాలకు వాడుకున్నది. ఆ పార్టీ నేత రాహుల్గాంధీ మణిపూర్ వెళ్లి రెండు రోజులు హడావుడి చేశారు. ఆ తర్వాత మరిచిపోయారు. కానీ అక్క డ పరిస్థితులు మాత్రం అంతకంతకూ దిగజారిపోతూనే ఉన్నాయి. అటు దేశాన్ని పాలిస్తున్న పార్టీ గానీ.. ప్రధాన ప్రతిపక్షంగా చెప్పుకొంటున్న పార్టీ గానీ చేసింది శూన్యం. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం లో ఇన్ని దారుణాలు కండ్లముందే జరుగుతున్నా ఎందుకు ఆపలేకపోతున్నారు? రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపారని ఆ పార్టీ నేతలు జబ్బలు చరుచుకునే వ్యక్తి ఒక రాష్ట్రంలో రగులుతున్న అగ్ని ని ఎందుకు ఆర్పలేకపోతున్నారు.
‘సబ్ కా సాత్.. సబ్ కా వికాస్’ అని చెప్పుకొనే వాళ్లు.. ఓ వర్గానికి కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలు వస్తున్నా ఎందుకు స్పందించడం లేదు? అంటే ప్రజల కంటే పార్టీ, రాజకీయాలే ముఖ్యమా? ప్రజా రక్షణ పట్టదా? 70 రోజులకు పైగా ఒక రాష్ట్రం మొత్తం ప్రాణా లు అరచేతిలోపెట్టుకుని బతుకుతున్నదంటే ఇది దేశాన్ని పాలిస్తున్న వారి వైఫల్యం కాదా? అసలు తాను పాలిస్తున్న దేశంలో ఓ రాష్ట్రం అగ్నికి ఆహుతి అవుతున్నదన్న ఆందోళన కూడా ఆయనలో కనిపించదు. చివరికి ఆంతరంగిక భద్రతలోనూ భారత్ విఫలమైందన్న విమర్శలున్నాయి. అయినా అదే దేశ ప్రధాని హోదాలో ఉండి ఒక రాష్ర్టాన్నే కాపాడలేని వ్యక్తి మరోసారి ప్రధాని అయితే జరిగే ఉపద్రవాలను ప్రతి ఒక్కరం ఊహించగలం. కాపాడాల్సిన వాళ్లే మంటలను రగల్చడం విధానంగా మలచుకున్నప్పుడు దేశాన్ని కాపాడేందుకు ఓ ప్రజానాయకుడు కావాలి. అధికా రం కాదు. ప్రజా సంక్షేమం ముఖ్యం. కుల, మత, వర్గ భేదాలు కాదు మనమంతా మనుషులం, మనమంతా భరతమాత బిడ్డలమని భావించే ఒక శక్తి కావాలి.
(వ్యాసకర్త: రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ చైర్మన్)