తెలంగాణ ప్రజలు కండ్లు మూసుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. ఎందుకంటే, రాష్ట్రంలో అవకాశవాద రాజకీయం బట్టలు విప్పి తిరుగుతున్నది. పాము తన కుబుసాన్ని వదిలించుకున్నంత సులువుగా వృద్ధ రాజకీయ నాయకులు కండువాలు మారుస్తూ రాజకీయ విలువలు, నైతికత అనే పదాలకు కొత్త భాష్యం చెప్తున్నారు. అధికారంలో ఉన్నన్ని రోజులు ఉన్నతమైన పదవులు, రాజభోగం అనుభవించి, అధికారం చేజారిన రెండు మూడు నెలల్లోనే నీడనిచ్చిన చెట్టుపై రాళ్లు విసురుతున్నారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన పార్టీ పంచన చేరుతున్నారు. తెలంగాణ రాష్ర్టానికి కేసీఆరే సరైన నాయకుడని, పార్టీలు మారుతున్న ఆ వృద్ధ నాయకులకూ తెలుసు.
Telangana | కేసీఆర్ అంటే తెలంగాణ. తెలంగాణ అంటే కేసీఆర్. నాడు కేసీఆర్ కాకుండా మరొకరు తెలంగాణకు ముఖ్యమంత్రి అయి ఉంటే సీమాంధ్ర ఆధారిత, అధిష్టాన బానిస రాజకీయ ముఠాలు, మీడియా ముసుగు తొడిగిన సీమాంధ్ర సంస్థలు ఈ పదేండ్లలో తెలంగాణను ఆగంచేసేవి. ఈ విషయం ఇప్పుడు రంగులు మారుస్తున్న ఊసరవె ల్లులకూ తెలుసు. కేసీఆర్ ఎప్పుడు బలహీనపడితే అప్పుడు రెక్కలు విప్పుకొని చెలరేగాలని చూస్తున్న వాళ్లకు ఫిరాయిం పుదారులు ఇప్పుడు పావులుగా మారారు. వాళ్లది అరువై ఏండ్ల బానిసత్వం. అందుకే అరువై ఏండ్ల రాజకీయ అనుభవంలో ఒక్కసారిగా కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలువని వాళ్లు పార్టీ మారితే.. ‘కేసీఆర్కు భారీ షాక్’ జబ్బలు చరుచుకోవడం అజ్ఞానమే అవుతుంది.
తెలంగాణలో మార్పు మొదలైందని అంటున్నారు. కానీ, గత పదేండ్ల పాటు మీ పొలిటికల్ రాజధాని హైదరాబాద్. ఇక నుంచి ఢిల్లీ అని గ్రహించలేకపోతున్నారు. అధిష్టానానికి బానిసలుగా బతికితే తప్పా, రాజకీయ భవిష్యత్తు శూన్యమైందనే మార్పును వాళ్లు గ్రహించలేకపోతున్నారు. వాస్తవానికి కాంగ్రెస్, బీజేపీల కుట్రలు, కుతంత్రాల గురించి నా లాంటి నవతరం నాయకుల కంటే ఔట్డేటెడ్ నాయకులకే ఎక్కవ తెలుసు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీది అధిష్టానం ఎజెండా అయితే.. బీజేపీది కార్పొరేట్ ఎజెండా. ఈ విషయం తెలంగాణ ప్రజల కంటే వాళ్లకే ఎక్కువ తెలుసు. కానీ, కేసీఆర్ ఎజెండా మాత్రం తెలంగాణ అని తెలంగాణ గడ్డపై పుట్టిన ప్రతి బిడ్డకు, మీ ఢిల్లీ పెద్దలకు కూడా తెలుసు.
గడిచిన పదేండ్లలో దేశంలోనే తెలంగాణ ఒక నమూనాగా నిలబడిందంటే అది కేసీఆర్తోనే సాధ్యమైంది. ఆరున్నర దశాబ్దాల పాటు దగాపడిన తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు కేసీఆర్ చేసిన పోరాటం, కేసీఆర్ చేసిన త్యాగం, కేసీఆర్ చేసిన సాహసం ఏ ఒక్కరు కూడా ఏనాడు చేయలేదు. కారణం ఒక్కటే.. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే నాయకులు మా బీఆర్ఎస్ పార్టీని వీడుతుంటే కేసీఆర్ చుట్టూ చేరిన చెదలు కొట్టుకుపోయి చెట్టంతా తేజ్గా కనిపిస్తున్నట్టుంది. కేసీఆర్ సారథ్యంలో టీఆర్ఎస్ వచ్చి తెలంగాణ రాష్ట్ర నినాదాన్ని ఎత్తుకునే వరకు కూడా వీళ్లు నోరు మెదపలేదు. కానీ, ‘మేమే ముందూ’ అంటూ నేడు మీడియా ముందు ప్రకటనలు చేస్తుండటం విడ్డూరం.
కేసీఆర్ యావత్తు తెలంగాణ సమాజాన్ని ఏకం చేసిన నాయకుడు. పద్నాలుగేండ్ల సుదీర్ఘ పోరాట ఫలితంగా సాధించిన ప్రత్యేక తెలంగాణలో అద్భుతమైన ప్రగతిని కండ్లముం దుంచారు. ఈ అభివృద్ధిని గత పాలకులు గత అరువై ఏండ్లలో కూడా చేయలేకపోయారు. కేసీఆర్ కేవలం పదేండ్లలోనే చేసి చూపించారు. ఫలితంగా తెలంగాణ అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కుతున్నది. నాడు తెలంగాణ చీకటి అవుతుందన్న సీమాంధ్ర నాయకుల శాపనార్థాలను సవాలుగా స్వీకరించి నేడు తెలంగాణలో 24/7 వెలుగులు నింపిన కేసీఆర్ ఒక చరిత్ర. నాడు నెర్రెలు పడిన తెలంగాణ నేలపై అసాధ్యమనుకున్న సాగునీటి ప్రాజెక్టులను స్వరాష్ట్రంలో నిర్మించి తెలంగాణ మాగాణాన్ని పచ్చలహారంగా మార్చిన సంకల్పం కేసీఆర్ది.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ కోసం జరిగిన ఏ ఉద్యమంలోనూ కలసిరాలేదు. ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయలేదు. మీరు కూడా ఏ సందర్భంలోనూ ముందుకు రాలేదు. పైగా ఉద్యమకారులపై నిరంకుశత్వం ప్రదర్శించి పైశాచిక ఆనందం పొందిన చరిత్ర వాళ్లది. వాళ్లు ఢిల్లీ పెద్దల ముందు గట్టిగా మాట్లాడితే.. ఢిల్లీ నుంచి హైదరాబాద్కు చేరుకునేలోపే వాళ్ల పదవులు ఊడుతాయనే విషయం వారికి బాగా తెలుసు. అందుకే, తెలంగాణపై వాళ్లు పెదవి దాటని ప్రేమను చూపిస్తారు.
కేసీఆరే లేకపోతే తెలంగాణను ఆగం పట్టించుడు తెలంగాణ వ్యతిరేకులకు తేలిక అని ఇప్పటికే సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తేలిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను నమ్మితే తెలంగాణ వ్యవసాయం చిల్లాకల్లమైంది. ఢిల్లీ పెద్దల చేతిలోని కీలుబొమ్మలతో తెలంగాణకు ప్రమాదమేనని గడిచిన మూడు నెలల్లో తేలిపోయింది. మీకు తెలంగాణ ప్రయోజనాలకంటే అధిష్టానం ప్రయోజనాలే ముఖ్యమయ్యాయని ప్రజలు గుర్తించారు.
నీళ్లు, విద్యుత్తు సరఫరా సక్రమంగా లేని కారణంగా ఎండిన తెలంగాణ రైతు గుండెలకు భరోసా కల్పించిన కేసీఆర్ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ.. ప్రజలపక్షమేనని తేటతెల్లమైంది. ఎప్పటికైనా మనోడు మనోడే, మందోడు మం దోడే అవుతాడన్నట్టుగా.. మతవాదాన్ని ముందేసుకున్న బీజేపీతో, అసత్యాలను ముందేసుకున్న కాంగ్రెస్తో తెలంగాణకు ఒనగూరే ప్రయోజనం ఏమి లేదు. సమస్యల నుంచి జనం దృష్టి మళ్లించడం కోసం కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలు చేయని ప్రయత్నం లేదు.
ప్రధాని మోదీ వాస్తవ, సంక్షోభ పరిస్థితులను విస్మరిస్తూ కేవలం భావోద్వేగాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. ఆయనకు ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి సంబంధించిన అంశాలతో పనిలేదు. కేవలం భావోద్వేగాలతో దేశాన్ని ఒక మత్తులో ముంచేసి ముందుకు నడిపించాలనుకుంటున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ చేసిన భ్రష్ఠ రాజకీయాలన్నీ ఇప్పుడు బీజేపీ చేస్తున్నది. ఈ రెండు పార్టీల వల్ల తెలంగాణ గడ్డు పరిస్థితుల్లో కూరుకుపోవడం ఖాయం. తెలంగాణ వ్యతిరేకులు, రాష్ట్ర విభజనను జీర్ణించుకోలేని శక్తులు ఇప్పుడు తెలంగాణపై దండయాత్ర మొదలుపెట్టాయి. కేసీఆర్ను దించినమని సంబురపడుతున్నాయి. కేసీఆర్ ఒంటరి అయ్యాడని జబ్బలు చరుచుకుంటున్నాయి. కానీ.. ఈ రెండు పార్టీల మెడలు వంచి ప్రపంచంలోనే తెలంగాణ అనే ఒక ప్రత్యేకమైన జియోగ్రాఫికల్ ఏరియాను సృష్టించిన యోధుడు కేసీఆర్.
తెలంగాణ తెచ్చిన కేసీఆర్ వెంట యావత్తు రాష్ట్రం ఉన్నది. కేసీఆర్ ఎన్నడూ ఒంటరి కాదు. ఆయన పేరు చెప్తేనే బీజేపీ, కాంగ్రెస్ వెన్నులో వణుకు పుడుతుంది. తెలంగాణ జీవిక కేసీఆర్. తెలంగాణ అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే తెలంగాణ. ఎవరెన్ని కుట్రలు చేసినా.. తెలంగాణ ప్రజలు వాటిని బద్ధలు కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. తెలంగాణలో ఏదో జరిగిపోతోందన్న ఒక భ్రమను, అబద్ధాన్ని ప్రచారంలో పెట్టి ఎన్నికలలో లబ్ధి పొందాలనుకుంటున్న కుటిల రాజకీయాలను ఎదుర్కొనేందుకు తెలంగాణ పౌరసమాజం క్రమంగా ఏకమవుతున్నది. ఎవరో ఆడించే కీలుబొమ్మలు, తోలుబొమ్మల చేతికి తెలంగాణ భవిష్యత్తును పెట్టి రాష్ట్ర ప్రజలు ఆగమయ్యారు. కానీ, పార్లమెంట్ ఎన్నికలలో ఆ పరిస్థితి పునరావృతం కాదు. తెలంగాణకు కేసీఆరే శ్రీరామరక్ష అని ప్రజలకు ఇప్పటికే అర్థమైంది.
(వ్యాసకర్త: మేయర్, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్)
– జక్క వెంకట్రెడ్డి