Telangana Secretariat | కట్టడాలు చరిత్ర చెక్కిలిపై కాలం చేసే అందమైన సంతకాలు. నాగరికతలు తమ కాలపు ఆలోచనల్ని అవసరాలతో మేళవించి భవనాల్ని పోత పోస్తాయి. సింధు లోయ, రోము, ఈజిప్టు, మెసొపొటేమియా మొదలు మన దేశంలో వివిధ కాలాల్లో నిర్మించిన కట్టడాలు మనకు వారసత్వంగా నిలుస్తున్నాయి. కట్టడాల సంచయమే నగరం అయినప్పుడు, నగరం ఆ కాలానికి చెందిన నాగరికతకు సాక్షిగా నిలుస్తుంది. మన హైదరాబాద్ నగరం కూడా చరిత్రను వర్తమానంలోకి ప్రవహించేలా చేస్తూనే ఉంటుంది. భిన్న సాంస్కృతిక లక్షణాల మేలు కలయిక ఈ నగరానికి ఉన్న లక్షణం. దక్కన్ సంస్కృతికి, తెలంగాణ తత్త్వం ఇచ్చిన నిర్వచనమే మిశ్రమ సంస్కృతి.
ఎక్కువ ఆధారాల్లేని 12వ శతాబ్దపు గొల్లకొండ మట్టికోట, కుతుబ్ షాహీల కాలానికి అభేద్య దుర్గమైన గోల్కొండగా మారి, ఆ తర్వాత హైదరాబాద్ నగరంగా పరచుకుంది. అందుకే పాత నగరం నుండి నగరానికి నాలుగు దిక్కులా కుతుబ్ షాహీ కాలపు భవనాలు ఉన్నాయి.
ఇక వర్తమానంలోకి వద్దాం. హైదరాబాద్ స్కైలైన్లో కొత్తగా చేరిన సచివాలయం, పక్కనే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, ముందు వైపు దీపపు ప్రమిద ఆకారంలో నిర్మాణమవుతున్న ప్రత్యేక తెలంగాణ ఉద్యమ అమరుల స్మృతి చిహ్నం – ఇవన్నీ నగరపు వాస్తుకళా రూపురేఖల్ని మార్చేస్తున్నవి. తెలంగాణ వచ్చిన తర్వాత ఏం సాధించినరు అనే పాత ప్రశ్న అప్పుడప్పుడూ తెలంగాణ వ్యతిరేకుల నుండి వస్తూనే ఉంది. వారికి కొత్త జవాబుగా ఈ కొత్త సంస్కృతీ ప్రతీకలు నిలుస్తాయి.
తెలంగాణ రాజ్య ప్రతీక.. సాంస్కృతిక పతాక
ప్రతీ నిర్మాణానికీ ఒక సందర్భం, సాంస్కృతిక పునాది ఉంటుంది. తెలంగాణ నేల శాతవాహనుల కాలం నుంచి నేటి వరకు ప్రతి చారిత్రక సందర్భంలో తన సంతకాన్ని కళాత్మకంగా చేస్తూనే ఉంది. ఇప్పుడు ఈ నేల మీద గర్వంగా నిలిచిన సచివాలయం ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు దార్శనికతకు, పట్టుదలకు నిలువెత్తు నిదర్శనం. ముఖ్యమంత్రి విజన్ను నేలపై నిలపడంలో ప్రతి రోజూ నిర్మాణ పనులను పర్యవేక్షించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కృషి కనిపిస్తుంది. బీ ఆర్ అంబేద్కర్ పేరు సచివాలయానికి పెట్టడం, రాజ్యాంగానికీ, అణగారిన ప్రజల ఆత్మగౌరవానికీ చేసిన చిరు సత్కారం.
భవనం అంటే కేవలం మట్టీ, రాళ్లు, ఇసుక, సిమెంటులతో ఉన్న నిర్మాణం కాదు. కాలం సమకాలీన సమాజంతో చేసే కరచాలనం. వారసత్వపు కళా శైలుల్ని, ఆధునికతతో మేళవించే సన్నివేశం. దక్కన్, తెలంగాణ అస్తిత్వాల్ని భౌగోళిక విశేషంగా చాటుతున్న సందర్భం. అందుకే తెలంగాణ సచివాలయం ఒక అందమైన అస్తిత్వ కేతనం.
సోయగాన్ని పెంచే గుమ్మటాలుఇక సచివాలయంపై ఉన్న గుమ్మటాల గురించి చెప్పుకోవాలి. వాస్తుకళలో ఒక విశిష్టమైన అంశం గుమ్మటం (ఇంగ్లీషులో డోమ్ అంటారు). బౌద్ధ స్తూపాల పైనుండే అండం, ప్రాచీన రోమన్ కట్టడాల్లో ఉండే డోమ్లు, మధ్య యుగాల్లో భారత ఉపఖండంలో ఎదిగిన ఇండో-పర్షియన్ నిర్మాణాల్లో ఉండే గుంబద్లు, తెలుగులో చెప్పుకునే గుమ్మటాలు – పేరు ఏదైనా స్వల్ప మార్పులతో ఇవన్నీ ఒక్కటే. నిర్మాణాన్ని ఎలివేట్ చేయడమే వీటి ముఖ్య లక్షణం. వరాహమిహిరుడి బృహత్సంహితలో షోడశాండయుక్త అనే ప్రస్తావన ఉంది. దీని అర్థం 16 అండాలు లేక గుమ్మటాలు. అంతేకాదు దాదాపు 84 గుమ్మటాల వరకూ ఏర్పాటు చేసేందుకు వీలుగా వాటి నిర్మాణశైలిని బృహత్సంహితలో వివరించారు.
ఆర్కిటెక్ట్స్ అయిన ఆస్కార్ కన్సెస్సో, పొన్ని కన్సెస్సో మాటల్లో చెప్పాలంటే, ఈ భవనం మీది గుమ్మటాలకు ప్రేరణ గుజరాత్లోని సాలంగపూర్ హనుమాన్ దేవాలయం, నిజామాబాదు నీలకంఠేశ్వర ఆలయ గుమ్మటాలు. ఇవి కేవలం ఆలయ గుమ్మటాల లక్షణాన్ని మాత్రమే కాకుండా, ఇండో-సార్సెనిక్ వాస్తు లక్షణాల్ని కూడా ప్రతిబింబిస్తాయి. ఇండో-సార్సెనిక్ వాస్తు కళను ఇండో-గోతిక్ లేదా మొఘల్-గోతిక్, లేదా 19వ శతాబ్దపు మిశ్రమ హిందూ శైలి అనవచ్చు. అందుకే బ్రిటిష్ పాలిత ప్రాంతాల్లోని కట్టడాల్ని, సంస్థానాల్లోని రాజ ప్రాసాదాల్ని ఈ శైలిలో నిర్మించినారు. అందుకు ఉదాహరణే వనపర్తి రాజ ప్రాసాదం. సెక్రటేరియేట్ భవనం డిజైన్కు ఈ వనపర్తి రాజభవనం ఒక రిఫరెన్స్ పాయింట్ కూడా.
సచివాలయం మీదున్న 34 గుమ్మటాల్లో 2 పెద్దవి. వీటి మీద 15 మీటర్ల పొడవైన జాతీయ చిహ్నం గంభీరంగా నిలిచి ఉంటుంది. కంచుతో పోత పోసిన నాలుగు సింహాలతో జాతీయ చిహ్నం, పక్కనే అంబేద్కర్ విగ్రహం, హుస్సేన్ సాగర్ మధ్యలో బుద్ధుడు ఒక సాంస్కృతిక, సామాజిక, రాజకీయ సందేశానికి ప్రతీకలు.
రాతిలో, కలపలో పరిచిన సౌందర్యంపాల రాయి, ఎర్ర ఇసుక రాయి, గ్రానైట్ – పేరు ఏదైనా ఒక అందమైన డిజైన్లో ఒద్దికగా ఒదిగిపోతేనే భవనంలో ఒక సింక్రోనీ ఉంటుంది. ఆరవ అంతస్తు మొత్తం ముఖ్యమంత్రి కార్యాలయం, సమావేశ మందిరాలు, జనహిత (ప్రజల్ని కలుసుకునే మందిరం), చీఫ్ సెక్రటరీ కార్యాలయం వంటి ముఖ్యమైన ఆఫీసులు ఉంటాయి. పాల రాయి పరిచిన వరండాలు, గదులు ఆరవ అంతస్తు ప్రత్యేకతను చాటుతాయి. మిగిలిన అన్ని అంతస్తుల్లో తెలంగాణలో దొరికే గ్రానైటును ఫ్లోరింగ్కు వాడినారు.
ఆరో అంతస్తులోని గదుల గురించి చెప్పక పోతే భవన సౌందర్యంలో ఒక ముఖ్యమైన అంశాన్ని విస్మరించినట్టు అవుతుంది. ముఖ్యమంత్రి ఛాంబర్, విశిష్ట అతిథులతో సమావేశమయ్యే మందిరం, డైనింగ్ హాల్స్ వంటి నిర్మాణాల్లో ఉన్న తెలుపు, క్రీమ్ మధ్యలో సన్నటి బంగారు రంగు పట్టీలతో ఉన్న కలర్ స్కీం, ఫ్రాన్స్లోని వెర్సెల్లెస్ రాజ భవనంలోని గదుల్ని తలపిస్తున్నాయి.
రాజస్థాన్ నుంచి తెప్పించిన ధోల్పూర్ రెడ్ సాండ్ స్టోన్ (ఎర్ర ఇసుక రాయి) భవనానికి వైవిధ్యాన్ని అందించింది. భవనంలోని లోయర్ గ్రౌండ్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్లను కవర్ చేస్తూ మందమైన ఈ రెడ్ సాండ్ స్టోన్ వాడకంతో ఉత్తర భారత నిర్మాణ శైలిలో ఉన్న అంశాన్ని కూడా చేర్చినట్టు అయింది. కేవలం కిందే కాదు, భవనం పైభాగంలోనూ ధోల్పూర్ రెడ్ సాండ్ స్టోన్ను ఒక పట్టీలాగా పరచడంతో అందం మరింత పెరిగింది. ముఖ్యమంత్రి సూచన మేరకు డిజైన్లో పైభాగంలో కూడా ఎర్ర ఇసుక రాయి పట్టీని చేర్చినారు. పేపర్ మీద భవనం డిజైనింగ్ మొదలు, నిర్మాణ సమయంలో అతి సూక్ష్మ అంశాల వరకు కేసీఆర్ గారి దార్శనికత, మార్గదర్శకత్వం అంతర్లీనంగా తమని నడిపించిందని అంటున్నారు ఆర్కిటెక్టులు.
భవనానికి ముందు లాన్లో రెండు వైపులా రెడ్ సాండ్ స్టోన్తో కట్టిన ఫౌంటైన్లు, డిజైన్లో ఒక అందమైన చేర్పు. పార్లమెంటు భవనంలో ఉన్న సైజులో, అదే ఆకృతిలో ఉన్నాయి ఈ ఫౌంటైన్లు. ఆకుపచ్చని పచ్చిక బయలు, ఎరుపు రాతి ఫౌంటైన్, దాని నుండి ఎగజిమ్ముతున్న నీరు – ప్రకృతిలోని రంగుల్ని పేర్చి చూపినట్టు ఉంది. ఆదిలాబాద్ కలప తలుపులపై లోహపు డిజైన్లను పొదిగిన తర్కషి కళ తెలంగాణలో పుట్టి పెరిగిన బిద్రీకళను తలపిస్తుంది. భవనం దర్వాజాను బాహుబలి ద్వారం అంటున్నా రు. కోటలోని దర్వాజాలను తలపిస్తూ, తర్కషితో చెక్కిన అందమైన కళాకృతి ఈ ద్వారం.
క్రీస్తుపూర్వం ఒకటో శతాబ్దంలోనే రోమన్ ఆర్కిటెక్ట్ విట్రూవియస్ వాస్తుకళ గురించి తన గ్రంథం ‘డీ ఆర్కిటెక్చురా’ లో, ప్రతీ నిర్మాణానికి దృఢత్వం, ఉపయోగం, అందం అనే మూడు లక్షణాలు ఉండాలని రాశాడు. ఈ మూడు లక్షణాల్ని మిళితం చేసుకుంది సెక్రటేరియట్ భవనం. ఈ భవన నిర్మాణంలో అనుభవజ్ఞులైన షాపూర్జీ పల్లోంజీ కంపెనీ ఆధునిక సాంకేతికత వాడటం, అంతర్జాతీయ ప్రమాణాల్ని పాటించడం దృఢత్వాన్ని గ్యారంటీ చేస్తున్నది. కనీసం 150 ఏళ్ళు చెక్కు చెదరకుండా ఉండేలా ప్లాన్ చేసినారు. లక్షల చదరపు అడుగుల గాల్వనైజ్డ్ రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ సహాయంతో డోమ్లు, పిల్లర్లను అదీ అతి తక్కువ సమయంలో నిర్మించడం సివిల్ ఇంజనీరింగ్ అద్భుతమే. అంతెందుకు సచివాలయ ముఖద్వారాన్ని ఎలివేట్ చేయడం కోసం ఎన్నో ప్రయోగాల్ని చేయాల్సి వచ్చింది.
ఇక ఉపయోగం విషయానికి వస్తే 10.52 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో కూడిన విశాల భవనం తెలంగాణ రాష్ట్ర పాలనా కేంద్రంగా ఉండబోతున్నది. హుస్సేన్ సాగర్ తీరంలో, కిక్కిరిసిన భవనాల మధ్య కాకుండా ముందు పరచుకున్న విశాలమైన పచ్చిక భవనం అందాన్ని మరింత ఇనుమడింప చేస్తున్నది. రాబోయే కాలంలో నగరంలోని ఒక అందమైన ల్యాండ్ మార్క్గా ఇది నిలవబోతున్నది. అందుకేనేమో నిజ జీవితంలో అందం నశించినా, కళల్లో మాత్రం బతికే ఉంటుంది (Beauty perishes in life, but is immortal in art) అని ఇటాలియన్ బహుముఖ ప్రజ్ఞాశాలి లియోనార్డో డా విన్సీ అన్నాడు.
గ్రీన్ బిల్డింగ్
ఆధునిక భవనం ప్రకృతిలో భాగమైయినప్పుడే దానికి సార్థకత, ఉపయోగిత్వం ఉంటుంది. అందుకే ఈ భవనాన్ని ఒక ’గ్రీన్ బిల్డింగ్’గా రూపొందించారు. అన్ని అంతస్తుల్లో తలుపులు, కిటికీలు ఒకే వరుసలో ఉండే లా డిజైన్ చేసినందున గాలి ప్రవాహం నిరాటంకంగా సాగుతుంది.సెక్రటేరియట్ పైకప్పు మీద పడ్డ ప్రతీ వాన చుక్కా భూగర్భంలో ఉన్న నీటి సంపులోకి చేరి మొత్తం పరిసరాల్లో ల్యాండ్ స్కేపింగ్కు, పచ్చదనం పెంచేందుకు ఉపయోగపడేలా ఏర్పాట్లు చేశారు. అందుకే ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (IGBC) ఈ భవనానికి గోల్డెన్ సర్టిఫికెట్ ఇచ్చింది.
ప్రధాన భవనానికి అనుబంధంగా ముఖ్య ప్రాంగణం వెలుపల నిర్మించిన మందిరం, మసీదు, చర్చి సచివాలయ ప్రాంగణానికి సర్వమత స్వరూపానిస్తున్నాయి. పోలీస్ కంట్రోల్ కమాండ్, బ్యాంకు, కాంటీన్ వంటి ఇతర భవనాలు సైతం సచివాలయ డిజైన్లో అందంగా ఒదిగిపోయినాయి.
విస్మయం గొలిపే నిర్మాణ స్థాయి
కొన్ని రాళ్లు, నాలుగు ఇటుకలు, కొంచెం సున్నం, సిమెంటు కలిపితే అద్భుత కట్టడం కాదు. ఏ నిర్మాణానికైనా ఒక ఆత్మ ఉండాలి. ఆ తత్వాన్ని ప్రతిబింబించే పథకం ఉండాలి. దానికి సరైన కొలతలు తోడవ్వాలి. అప్పుడే ఒక అద్భుత సౌధం నిలబడుతుంది. ఇదే విషయాన్ని 5 లేక 7 వ శతాబ్దంలో క్రోడీకరించిన ప్రాచీన భారత నిర్మాణ శాస్త్ర గ్రంథం ‘మానసార’ వివరిస్తుంది. నిర్మాణంలో పాటించాల్సిన కొలతలు, నిష్పత్తులు, డిజైన్ల గురించి చెపుతుంది. ఈ వ్యాసం రాస్తున్న క్రమంలో మాట్లాడిన కొందరు ఆర్కిటెక్టులు మెచ్చుకున్న అంశం ఈ నిర్మాణం స్కేల్ (స్థాయి) గురించి. 265 అడుగుల ఎత్తైన నిర్మాణం సుమారు పదిన్నర లక్షల అడుగుల్లో పరుచుకుని ఉన్నప్పుడు, భవనం ఈస్థటిక్ సెన్స్ చెడకుండా వివిధ అంతస్తులుగా, గదులుగా నిర్మించడం ఒక కష్టసాధ్యమైన పని. షాపుర్జీ పల్లోంజి నిర్మాణ సంస్థ తరఫున నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న ఒక అధికారి ‘ఈ సెక్రటేరియట్ నిర్మాణంలో పడ్డ కష్టాలు, మాకు ఆర్కిటెక్చర్లో కొత్త పాఠాల్ని నేర్పాయి’ అన్నారు.
ప్రపంచంలోనే పేరున్నఎన్నో కట్టడాలకు సరితూగే విధంగా ఉంది కొత్త సచివాలయం. 17వ శతాబ్దం నాటి ఫ్రాన్సులోని వెర్సెల్లెస్ ప్యాలస్, 18వ శతాబ్దంలో కట్టిన లండన్ బకింగ్ హామ్ ప్యాలెస్, వాషింగ్టన్ లోని కాపిటల్ బిల్డింగ్, 20వ శతాబ్దంలో కట్టిన జపాన్, సింగపూర్, సౌత్ కొరియా పార్లమెంట్ భవనాలకు దీటుగా నేటి సచివాలయం నిలుస్తుంది. దేశంలోని ఎన్నో చారిత్రక కట్టడాలు తెలంగాణ సచివాలయం కంటే తక్కువ ఎత్తైనవి. ఢిల్లీలోని కుతుబ్ మినార్, ఆగ్రా లోని తాజ్మహల్ కంటే 26 అడుగులు (8 మీటర్లు) ఎత్తు ఉంది ఈ కొత్త భవనం. ఇక హైదరాబాద్ లోని ఎత్తైన కట్టడం చార్మినార్ ఎత్తు 183 అడుగులు (56 మీటర్లు) ఉంటే సచివాలయం దాని కంటే 82 అడుగులు (25 మీటర్లు) ఎత్తు ఉంది. ప్రస్తుతం దేశంలో ఉన్న చట్ట సభలు లేక సచివాలయ భవనాలన్నిటి కంటే ఎత్తైన కట్టడం ఇది. 1950లలోనే కట్టిన కర్ణాటక విధాన సౌధ 175 అడుగుల ఎత్తుంటే, తెలంగాణ సచివాలయం 265 అడుగుల ఎత్తు ఉంది. ఛత్తీస్గఢ్ రాజధాని న యా రాయపూర్ సెక్రటేరియట్, గుజరాత్ సెక్రటేరియట్ కంటే ఎత్తైనది తెలంగాణ సచివాలయం. అంతెందుకు, కొత్తగా కడుతున్న పార్లమెంట్ భవనం ఎత్తు 130 అడుగులు మాత్రమే.
వాస్తవానికి ఈ అద్భుత కట్టడానికి పునాది
భూమి మీద కాదు ఆలోచనల్లోనే పడింది. డిజైన్ చేస్తున్నప్పుడు ఆర్కిటెక్ట్స్ ఊహిస్తున్న స్థాయిని మించిన ఒక కట్టడం కావాలని కోరుకుని, ఆ దిశలో డిజైన్ రూపొందించేలా చేసింది ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆలోచన. కట్టబోతున్న సచివాలయం, జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలను అందుకోవాలని దిశానిర్దేశం చేసినారు. దాని ఫలితమే భిన్న వాస్తు రీతుల సమాహారంగా నిలిచిన కొత్త సచివాలయం.
మిశ్రమ సంస్కృతి తెలంగాణ తత్త్వం
హైదరాబాద్ నగరమే ప్రేమ తత్వం, మిశ్రమ సంస్కృతి పునాదిగా ఏర్పడ్డది. అందుకే ఈ నగరంలో ఏ సాంస్కృతిక విశేషమైనా భిన్నత్వంలో ఉన్న వైవిధ్యాన్ని పట్టి నిలిపింది. అది సాహిత్యం కావచ్చు, చిత్రలేఖనం కావచ్చు, వాస్తు, శిల్ప రీతులు కావచ్చు, చివరికి తినే తిండి కూడా భౌగోళిక సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుంది. అందుకే ఇప్పుడు రూపు దిద్దుకున్న సెక్రటేరియట్ భవనం, హైదరాబాద్ ఆత్మను ప్రతిబింబిస్తూ దక్కన్-ఇండో పర్షియన్, ఇండో-సార్సెనిక్ వాస్తు రీతుల మేలు కలయికగా రూపొందింది. కాకతీయ వాస్తు రీతి స్పష్టంగా లేకపోయినప్పటికీ, మొత్తం కట్టడంలో అన్ని చోట్లా నిలిపిన డబుల్ పిల్లర్స్కు ప్రేరణ కాకతీయ తోరణంలోని రెండు స్తంభాలు అంటున్నారు ఆర్కిటెక్ట్స్ అయిన ఆస్కార్ అండ్ పొన్ని.
అంకెలు చెప్పే అంశాలు
సచివాలయ ప్రాంగణ విస్తీర్ణం 28 ఎకరాలు
-డాక్టర్ ఎం ఏ శ్రీనివాసన్
81069 35000