Pawan Kalyan : ముఖ్యమంత్రి జగన్పై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. ఇవాళ పిఠాపురం మండలంలో పవన్ రోడ్ షో నిర్వహించారు. చెందుర్తి జంక్షన్ నుంచి ప్రారంభమైన ఈ రోడ్ షోకు విశేష స్పందన లభించింది. జనసేన, టీడీపీ, బీజేపీ శ్రేణులతో రోడ్ షో పోటెత్తిపోయింది. ఈ రోడ్ షోలో పవన్తోపాటు పిఠాపురం టీడీపీ ఇన్చార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ కూడా పాల్గొన్నారు.
ఇవాళ్టి రోడ్ షోలో పవన్ మాట్లాడుతూ.. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు టీడీపీ శ్రేణుల వేదన ఏంటో తనకు అర్థమైందని అన్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు వారి బాధను నేరుగా తనతో పంచుకోకపోయినా వారి మనసులో బాధను అర్థం చేసుకుని, నేరుగా రాజమండ్రి జైలుకు వెళ్లి చంద్రబాబుకు మద్దతు తెలిపానని చెప్పారు. అందరూ భయపడుతున్న రోజుల్లో తాను వెళ్లి చంద్రబాబును కలిశానని గుర్తుచేశారు.
పవన్ ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లో.. ‘నాలుగు దశాబ్దాల పాటు పార్టీని నడిపిన వ్యక్తి. వర్మ గారి లాంటి బలమైన నాయకులు ఉన్న పార్టీ. నాలుగు దశాబ్దాలుగా బలమైన కార్యకర్తలు, తెలుగు మహిళలు ఉన్న పార్టీ. రాష్ట్రానికి సేవలు చేసిన పార్టీ టీడీపీయే. ప్రతి పార్టీ పాలనలో తప్పొప్పులు, విభేదాలు ఉంటాయి. అవన్నీ ప్రజాస్వామ్యబద్ధంగా పరిష్కరించుకోవాలి. కానీ చంద్రబాబు లాంటి నాయకుడిని తీసుకెళ్లి 53 రోజులు జైల్లో కూర్చోబెట్టారు’ అని ఆవేదన వ్యక్తంచేశారు.
‘జైల్లో పెట్టినోడు ఎవడు..? ఐదు సంవత్సరాలుగా బెయిల్ మీదున్న వ్యక్తి..! ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఐదేళ్లుగా బెయిల్ మీదున్నాడు. అతడిపై 30 కేసులున్నాయి. మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి ఏరులై పారిస్తున్నాడు. రూ.60 ఉండే క్వార్టర్ ఇప్పుడు రూ.200 పలుకుతోంది. రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తూ జనం ఆరోగ్యాన్ని పాడుచేస్తున్నాడు. అధికారంలోకి రాగానే ఈ విధానాన్ని మార్చేస్తాం. వచ్చేది కూటమి ప్రభుత్వమే’ అని పవన్ వ్యాఖ్యానించారు.
‘అడగనిదే అమ్మయినా పెట్టదంటారు. అందుకే టీడీపీ కార్యకర్తలను, జనసేన మద్దతుదారులను, బీజేపీ శ్రేణులను అడుగుతున్నా. నేను పిఠాపురం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. నాకు మీ విలువైన ఓటును గాజు గ్లాసు గుర్తుపై వేసి భారీ మెజారిటీతో గెలిపించండి. పిఠాపురంలో వర్మ గారి సహకారం మరువలేనిది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా ఇద్దరం కలిసి పరిష్కరిస్తాం. క్షత్రియ కోటాలో వర్మ గారికి ఎమ్మెల్సీ ఇస్తామని చంద్రబాబు చెప్పారు. ఆ దిశగా నేను కూడా కృషి చేస్తా’ అని పవన్ కళ్యాణ్ చెప్పారు.