Brother Anil : ఆంధ్రపదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భర్త, క్రైస్తవ మత ప్రబోధకుడు బ్రదర్ అనిల్ కుమార్ కడప జిల్లా బద్వేలులో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన.. తప్పు ఎక్కడున్నా తప్పేనని, తప్పును కప్పిపుచ్చాలని చూస్తే ఇవాళ కాకపోతే రేపైనా వాళ్లకి ఆ పాపం తగులుతుందని అన్నారు. ఇప్పటికే ఆ తప్పును కప్పి పుచ్చి, కప్పి పుచ్చి ఒక కుప్పలాగా తయారుచేశారని వ్యాఖ్యానించారు.
దేవుడు పదవి ఇచ్చింది న్యాయం చేయడానికని బ్రదర్ అనిల్ కుమార్ అన్నారు. గత ఎన్నికల్లో దేవుడు 151 సీట్లు ఇచ్చాడని, టీడీపీకి 23 అసెంబ్లీ, 3 ఎంపీ సీట్లే ఇచ్చాడని చెప్పారు. ఎందుకంటే గతంలో జగన్ నుంచి అప్పటి అధికార టీడీపీ 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను తీసుకుందని, అందుకే తర్వాత ఎన్నికల్లో వాళ్లకు దేవుడు అవే సీట్లు ఇచ్చాడని అన్నారు. నేను కష్టపడ్డాను కాబట్టి దేవుడు నాకు అధికారం ఇచ్చాడని అనుకోవద్దని, కూలీలు రోజంతా కష్టపడతారు కానీ కోటీశ్వరులైపోతున్నారా..? అని ప్రశ్నించారు.
‘రాజకీయంలో అయినా, దైనందిన జీవితంలో అయినా అన్యాయం అన్యాయమే. అన్యాయం చేసినవాడికి శిక్ష తప్పదు. ఇక్కడ మేనేజ్ చేసుకున్నాంలే అనుకున్నా దేవుడి వద్ద మేనేజ్ చేసుకోలేరు. దేవుడు మనిషికి అధికారం ఇచ్చినా ఇవాళ మనుషుల్లో పదవీ వ్యామోహం పెరిగిపోయింది, స్వార్థం నెలకొంది. ఏసు ప్రభువు ఒక మార్గం చూపించాడు. ఆ మార్గంలో నడిస్తే మనకు మేలు జరుగుతుంది. మేలు అంటే డబ్బు ఒక్కటే కాదు’ అని బ్రదర్ అనిల్ అన్నారు.
‘చంద్రబాబు అధికారంలోకి వస్తే వర్షాలు పడవని చెబుతారు. అదేంటో గానీ ఆయన వస్తే వర్షాలు పడవు. ఒక్కొక్కరి ప్రభావం అలా ఉంటుంది. ఎవరొచ్చినా, ఎవరు ఏం చేసినా, మనసు మంచిగా ఉంటే ప్రజలంతా బాగుంటారు. ఇప్పుడు నేను ఈ మాట చెప్పింది చంద్రబాబు గారిని టార్గెట్ చేస్తున్నట్టుగా అనుకోవద్దు. ఒక తటస్థ వ్యక్తిగా ఈ మాట చెబుతున్నాను. మంచి మనసుతో వస్తే అందరికీ మంచి జరుగుతుంది. అలాగని చంద్రబాబు మంచి చేయలేదని కాదు’ అని బ్రదర్ అనిల్ వ్యాఖ్యానించారు.