Telangana | ఈ భూగోళం మొత్తం మీద తెలంగాణ ఉద్యమం, ఉద్యమ నాయకుల మీద వేసిన నిందలు, జరిగినంత దాడి బహుశా మరెవరిమీదా జరిగి ఉండదు. తెలంగాణ అనే పదాన్ని కూడా జీర్ణించుకోలేని సమైక్యమూకలు పచ్చ పత్రికలై, టీవీలు, సోషల్ మీడియా ఉన్మాదులై ఉద్యమం పొడవునా నిందలు వేసి దాడులు జరుపుతుంటే; ఆ కాలంలో వారి పంచనపడి బతికిన బానిసలు వాటినే జనంలోకి మోసేవారు. ఆ దాడులకు కొనసాగింపే అసెంబ్లీ సమావేశాల్లో కనిపించింది.
ఏనాడూ జై తెలంగాణ అనని ఆ బానిసలే మన కర్మకొద్దీ ఏలికలై దురహంకారంతో, రాజకీయ దుగ్ధతో ఉద్యమ నాయకుల మీద నోరు చేసుకుంటున్నారు. సీమాంధ్ర మూకలు ఆనాడు ఏ నిందలైతే వేశారో.. అవే నిందలు ఇవాళ వీళ్ల నోట్లో చిలకపలుకులై బయటపడుతున్నాయి. వారి ఆరోపణలు చూడండి. కేసీఆర్ దీక్ష రోజున రంగధాంపల్లిలో హరీష్రావుకు అగ్గిపుల్లలు దొరకలేదట. అంతా నాటకమట. దాని కారణంగానే విద్యార్థులు బలిదానాలకు పాల్పడ్డరట. ఇదీ తెలంగాణ ఉద్యమం గురించి సదరు మంత్రుల అవగాహన. విద్యార్థులు, యువకుల బలిదానాల పవిత్రతకు ఆ మంత్రులు ఆపాదించే వక్రభాష్యం. ఆ మహోన్నత త్యాగాలకు వాళ్లిచ్చే గౌరవం.
అసలు సదరు మంత్రులు చెప్పిన ఆ సంఘటన ఎలాంటిది? తెలంగాణ ఉద్యమంలో దానికి ఉన్న ప్రాధాన్యత ఏమిటి? పవిత్రత ఏమిటి? అనే కనీస అవగాహన ఉన్నదా? 2009లో కేంద్రం తెలంగాణ ప్రకటన చేయడానికి దారితీసిన సందర్భం అది. ఆ ప్రకటన రావడానికి కారణమైన కేసీఆర్ దీక్ష సందర్భంగా జరిగిన ఘటన అది. తెలంగాణ సమాజం ఉవ్వెత్తున లేచి జై తెలంగాణ అని ముక్తకంఠంతో నినదించిన పవిత్ర సందర్భమది. అలాంటి సందర్భాన్ని కొంచెపు బుద్ధులతో కురుచ మనస్తత్వాలతో అవమానిస్తారా? బలిదానాలను కించపరుస్తారా? ‘ఉద్యమకారులకు అన్యాయం జరుగుతోంది. మేమొస్తే అది చేస్తాం.. ఇది చేస్తాం’ అంటూ మీరు కార్చిన మొసలి కన్నీటి వెనక ఉన్న అసలు స్వరూపం ఇదా? ఏ సందర్భాన్ని ఎలా చూడాలో కూడా తెలియదా? తెలంగాణ వాదానికి, తెలంగాణ బలిదానాలకు మీరిచ్చే విలువ ఇదా? ఇప్పుడు మీరెక్కిన పీఠాలు, అనుభవిస్తున్న రాజభోగాలూ అన్నీ ఆ బలిదానాల ఫలితమన్న విషయం కూడా సోయి లేకుండా మరిచిపోతారా?
ఇంతకూ హరీశ్రావుపై నీలాపనిందలు వేసిన ఆ సందర్భం ఏమిటి? ఆ సంఘటన ఏమిటి? తెలంగాణ రాష్ట్ర సాధనకోసం ‘తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చుడో’ అనే నినాదంతో కేసీఆర్ ఆమరణ దీక్ష చేపడుతున్నట్టు ప్రకటించారు. ఇందుకోసం ఆయన ఎంచుకున్న వేదిక సిద్దిపేట సమీపంలోని రంగధాంపల్లి దీక్షా శిబిరం.
జనాన్ని పెద్ద ఎత్తున తరలించడానికి ఆయన ఎంచుకున్న వ్యూహం ప్రకారం అంతకు ముందురోజు ఆయన కరీంనగర్ తెలంగాణ భవన్లో విశ్రాంతి తీసుకొని అక్కడినుంచి బయలుదేరి దీక్షా వేదికకు చేరుకోవాలి. ప్రభుత్వం ఈ దీక్షను వీలైనంత తొందరగా భగ్నం చేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తుందని తెలుసు. ఇది ఆమరణ దీక్ష కాబట్టి సర్వశక్తులూ ఒడ్డి ఎట్టి పరిస్థితిలోనూ దీక్ష భగ్నం కాకుండా చూసుకోవాలి. అందుకే దుర్భేద్యంగా దీక్షా శిబిరం ఉండాలని దానికి తగ్గట్టు వ్యూహం ఎంచుకున్నారు. ఒకసారి కేసీఆర్ దీక్షాశిబిరంలో కూర్చుంటే ఇక ఎన్ని పోలీసులు బలగాలు వచ్చినా ఆయన సమీపానికి కూడా చేరుకోకుండా అనేక వలయాలుగా వలంటీర్లు, కార్యకర్తలను మోహరించే ఇన్చార్జ్ బాధ్యత హరీష్రావుకు అప్పగించారు. ఇది పూర్వరంగం.
కేసీఆర్ ఒకసారి రంగధాంపల్లి శిబిరానికి చేరుకుంటే దీక్ష భగ్నం చేయడం అసాధ్యమని ప్రభుత్వం భావించింది. కరీంనగర్నుంచి ఆయన పెద్ద కాన్వాయ్తో బయలుదేరగానే ఒక వ్యూహం ప్రకారం ఒక్కో వాహనాన్ని పక్కకు తప్పించి కేసీఆర్ను అదుపులోకి తీసుకొని ఖమ్మం తరలించింది. ఈ వార్త వినగానే అదే శిబిరంలో హరీశ్రావు బృందం ఆగ్రహించి ఆమరణ దీక్షలు ప్రారంభించింది. దీంతో ఈ దీక్షాశిబిరాన్ని విచ్ఛిన్నం చేయడానికి మఫ్టీ పోలీసులు కార్యకర్తల్లో కలిసి పోయి రక్షణ వలయాలు దాటుకొని ముందుకు వచ్చారు. అలా వేదికను చేరుకుంటున్న క్రమంలో కిరోసిన్ బాటిళ్లతో చుట్టూ కూర్చున్న కార్యకర్తలు పోలీసులను ముందుకు రావద్దని హెచ్చరించారు. ఈ సమయంలోనే హరీశ్రావు పక్కనున్న కార్యకర్త చేతిలోంచి కిరోసిన్ బాటిల్ తీసుకొని పోలీసులు ముందుకు వస్తే ఆత్మహత్యకు పాల్పడతానని హెచ్చరించారు. అయితే అప్పటికే పోలీసులు వేదికను నలువైపులనుంచి చుట్టుముట్టి తీవ్రమైన తోపులాటల మధ్య హరీశ్రావును అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. ఇదీ జరిగింది.
ఈ సంఘటనను ఆధారంగా చేసుకొని అగ్గిపెట్టె దొరకలేదా? అని ఒకడు? దీని స్ఫూర్తితోనే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని మరొకడు నీచప్రచారాలకు దిగారు. రాజకీయ దుగ్ధతో ఇతర పక్షాల నాయకులు కూడా దాన్నే ఇంకా.. ఇంకా మోస్తున్నారు.
కానీ హరీశ్రావు అక్కడికి ఎందుకు వచ్చారు? దీక్షాశిబిరం నిర్వహణకోసం వచ్చారు. కేసీఆర్ కాన్వాయ్తో వచ్చి దీక్షావేదికపై కూర్చుంటారు… ఆయనకు రక్షణ కల్పించి దీక్షకు ఆటంకం కలగకుండా చూడాలనే తప్ప మరో ఆలోచన అప్పటికి ఆయనలో లేదు. అందుకే ఆయన ఇంటినుంచి కిరోసిన్ బాటిల్ తెచ్చుకోలేదు. కాబట్టి అగ్గిపెట్టెకూడా తెచ్చుకోలేదు. అసలు అలాంటి సందర్భం ఎదురవుతుందనీ ఆయన ఊహలోనే లేదు. అంతా అనుకున్నదానికి భిన్నంగా జరిగిన నేపథ్యంలో పోలీసులు దీక్షా శిబిరాన్ని ఆక్రమించుకోవడాన్ని నివారించేందుకు కార్యకర్త చేతిలోంచి కిరోసిన్ బాటిల్ తీసుకుని ఒంటిపై చల్లుకున్నారు. అదొక ప్రొటెస్ట్. దీనికి అగ్గిపెట్టె తెచ్చుకోలేదా? అగ్గిపుల్లలు దొరకలేదా? వంటి వెకిలి ఆరోపణలు.
ఇక ఈ సంఘటన కారణంగానే విద్యార్థులు ఆత్మహత్యల పాలైనట్టు వక్రీకరణలు. దేశ చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో ఎక్కడా, ఏనాడూ కిరోసిన్ చల్లుకొని ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు జరుగలేదా? కేంద్రంలో వీపీసింగ్ ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేసినపుడు దేశంలో అనేక రాష్ర్టాల్లో డజన్ల కొద్దీ విద్యార్థులు నిలువునా కాల్చుకొని చనిపోలేదా? ఇపుడంటే లేవుగానీ 70,80 దశకాల్లో గృహహింస భరించలేక ఎంతోమంది మహిళలు కిరోసిన్ చల్లుకొని చనిపోయిన సంఘటనలు జరుగుతూనే ఉండేవి.
ఆనాటి పరిస్థితి ఏమిటి? కేసీఆర్ ఆమరణ దీక్ష ప్రకటన యువతలో తీవ్ర ఉద్వేగాన్ని సృష్టించింది. ఎన్నో ఏండ్లుగా ప్రజల్లో రగులుతున్న తెలంగాణవాదం పెనువిస్ఫోటనమైంది. ఈసారి సాధించే తీరాలి అనే కసి, పట్టుదల ప్రజల్లో బలంగా నాటుకుంది. అంతేకాదు.. ఈ దీక్షతో తెలంగాణ వచ్చితీరుతుందనే గట్టినమ్మకం సర్వత్రా వ్యాపించింది. ఈ క్రమంలో కేసీఆర్ అరెస్టు వార్తతో కుంగిపోయి శ్రీకాంతాచారి ఆత్మాహుతికి పాల్పడ్డాడు. తన బలిదానం తెలంగాణ ఉద్యమాన్ని ప్రజ్వరిల్ల చేయాలనేది ఆయన ఆకాంక్ష. అంతే తప్ప ఏదో సంఘటన స్పూర్తి కాదు.. అనుకరణ అసలే కాదు. అది నిష్కల్మషమైన బలిదానం. మహోన్నతమైన ఆత్మత్యాగం.
ప్రభుత్వ బలగాలతో తెలంగాణవాదాన్ని తొక్కేయాలనుకున్న మూకలకు ఈ బలిదానాలు మింగుడు పడలేదు. వీటిని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాలేదు. ఈ క్రమంలో వీటిని పలుచన చేయడానికి ఎంచుకున్న నీచ ప్రచారం ఈ అగ్గిపెట్టె వ్యాఖ్యానం. ఈ వాస్తవాన్ని విస్మరించి ఉద్యమాన్ని దెబ్బకొట్టేందుకు పచ్చమూక తయారుచేసిన నిందలను నిండు తెలంగాణ సభలో ప్రవచించడం ఏం సభ్యత? ఏం సంస్కారం? పైగా విద్యార్థుల బలిదానాలు చూసి సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది..అన్నదీ వీళ్లే. మరోవైపు ఆ బలిదానాలను వక్రించేదీ వీళ్లే.
ఇవాళ తెలంగాణ ఎలాంటి శక్తుల చేతుల్లోకి వెళ్లిందో.. ఎలాంటి లాబీల బానిసల చేతుల్లో మగ్గబోతుందో వాళ్ల వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు, రంకెలు, హుంకరిపులు తేటతెల్లం చేస్తున్నాయి. గతంలో ఒక మిత్రుడు ఇదే పత్రికలో రాసిన ఒక వ్యాసంలో చెప్పాడు.. ‘తెలంగాణను వ్యతిరేకించే శక్తులే నీకు తెలియకుండానే ఉద్యమంలో చేరి నీకంటే ఎక్కువగా జై తెలంగాణ అని అరుస్తాయి. ఆవేశపడుతాయి. వాళ్లను దూరం పెట్టకపోతే తెలంగాణను.. తెలంగాణవాదాన్ని భూస్థాపితం చేస్తాయి..’ అని. సరిగ్గా అదే ఇపుడు కండ్లముందు కనిపిస్తున్నది. తెలంగాణ అస్తిత్వ చిహ్నాల మార్పు.. ఉద్యమ నాయకుల మీద నీలాపనిందలు.. కీలక స్థానాల్లో సీమాంధ్రుల పెత్తనాల రూపంలో!
తెలంగాణ తల్లికి మనం దైవత్వం ఆపాదించి పూజించి ఆరాధిస్తే.. ఈ ప్రభుత్వం ఆమె కిరీటంతో సహా నగలన్నీ కాజేసి బోసి తల, బోసి మెడతో నడిబజార్లో నిరుపేద రూపంలో నిలబెడుతున్నది. ఇది రేపటి తెలంగాణ భవిష్యత్తుకు సింబాలిక్గా కనిపించడం లేదూ?!
సవాల్ రెడ్డి