“ఆరంభింపరు నీచ మానవులు విఘ్నా యాస సంత్రస్తులై యారంభించి పరిత్యజించుదురు విఘ్నా యత్తులై మధ్యముల్ ధీరుల్ విఘనిహన్య మానులగుచు ధృత్యున్న తోత్సాహులై ప్రారబ్ధార్థము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్ గావునన్”
(అడ్డంకులను తలచుకుని ఏ పని చేపట్టని వారు అధములు. ఏదో చెయ్యాలన్న తపనతో మొదలు పెట్టినప్పటికీ ఆటంకాలు ఎదురవగానే వదిలేసేవారు మధ్యములు. ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు ఎన్ని అడ్డంకులు ఎదురైనా తుదికంటా లక్ష్యం కోసం శ్రమించడమే కార్యసాధకుడి నైజం)
2012 నవంబర్ 7, 8 తేదీల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ సమావేశాలు కరీంనగర్లోని ప్రతిమ మల్టీప్లెక్స్లో జరిగాయి. రెండురోజుల మేధోమథనం అనంతరం చివరిరోజు సాయంత్రం కేసీఆర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశాన్ని పై పద్యంతోనే మొదలు పెట్టి దాని అర్థాన్ని విలేకరులకు విడమరిచి చెప్పారు. పదమూడేండ్ల కిందట కార్యసాధకుడి నైజం ఎలా ఉంటుందో చెప్పిన కేసీఆర్ నేటికీ అదే బాటలో సాగుతున్నారు. అందుకు అనేక ఉదాహరణలు చెప్పవచ్చు. అంధకారంలో ఉన్న తెలంగాణలో వెలుగులు నింపుతామన్నారు. 24 గంటల కరెంటును అన్నదాతలకు ఇచ్చి తీరుతామన్నారు. పవర్ హాలీడే లేకుండా చేస్తామన్నారు. దీంతో రైతాంగానికి 24 గంటల కరెంటు ఇస్తే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటామని జానారెడ్డి లాంటి కాంగ్రెస్ సీనియర్ నాయకులు సవాలు విసిరారు. కానీ అడ్డంకులను ఎదుర్కొని, నేడు వెలుగుల తెలంగాణను సృష్టించారు. దేశంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రంగా నిలిపారు.
తాగునీటి గోసను శాశ్వతంగా దూరంచేసి ఆడబిడ్డలకు అండగా నిలుస్తామంటూ కేసీఆర్ సాహసోపేతమైన ప్రకటన చేసినప్పుడు చాలామంది సవాళ్లు విసిరారు. కానీ కేసీఆర్ రూ.40వేల కోట్లతో మిషన్భగీరథ పథకం చేపట్టి విజయవంతం చేశారు. నేడు ఆ పథకాన్ని దేశానికే అదర్శంగా నిలిపారు. దాదాపు 14 రాష్ర్టాల ప్రతినిధులు మిషన్ భగీరథ పథకాన్ని పరిశీలించి వెళ్లడం విశేషం. ‘నా ప్రాణంపోయినా సరే, రాబోయే ఐదేళ్లలో కోటి ఎకరాలకు నీరు అందించి తీరుతా. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నిరూపిస్తా’- అంటూ 2016 మార్చి 31న శాసనసభలో ప్రాజెక్టు రీ డిజైనింగ్ పవర్పాయింట్ ప్రజంటేషన్ చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పారు. నాడు ప్రతిపక్షాలు ఇది అయ్యేదికాదు పొయ్యేదికాదంటూ విమర్శలు గుప్పించాయి. కానీ, కాళేశ్వరం జలాలు ఎదురెక్కుతూ మెట్ట ప్రాంతాలను సస్యశామలం చేయడం చూస్తున్నాం. ఉమ్మడి రాష్ర్టాన్ని 58 ఏండ్ల పాటు పాలించిన కాంగ్రెస్, టీడీపీ ఈ తరహా ఆలోచన చేసి ఉంటే తెలంగాణలో దుర్భిక్షం ఉండకపోయేది.
అధికశాతం జనాభా ఆధారపడిన వ్యవసాయ రంగాన్ని కాపాడానికి రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం ఇస్తున్నారు. ఈ పథకాన్ని ఐక్యరాజ్య సమితి కూడా ప్రశంసించింది. 2018 ఆగస్టు నుంచి రైతు బీమా పథకాన్ని తెచ్చి, ప్రీమియంను కూడా పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తున్నది. రాష్ట్రంలో దాదాపు 57 లక్ష ల మంది రైతులుంటే అందులో18 నుంచి 60 ఏండ్లలోపు రైతులకు ఈ బీమా వర్తిస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఒకటి రెండు ఎకరాలున్న సన్న చిన్న కారు రైతులే 32 లక్షలమంది ఉన్నా రు. కేసీఆర్ తీసుకున్న రైతు సామూహిక జీవిత బీమా నిర్ణయం లక్షలాది కుటుంబాలకు భరోసానిస్తున్నది.
గత ప్రభుత్వాలు సర్కారు దవాఖానలను పాతరేసి ప్రైవేట్కు పెద్దపీట వేశాయి. ప్రైవేట్ హాస్పిటళ్లలో సాధారణ ప్రసవాలు అయ్యే పరిస్థితి ఉన్నా ధన దాహంతో ఆపరేషన్లు చేసి వేలకు వేలు గుంజి ఆడబిడ్డలను అనారోగ్యం పాలుజేసిన ఉదంతాలు ఉన్నాయి. ఈ దుస్థితి నుంచి బయట పడేసేందుకు ఆడపిల్ల పుడితే రూ. 13వేలు, మగబిడ్డ పుడితే రూ.12వేలు ఇస్తున్నారు. కేసీఆర్ కిట్ అందిస్తున్నారు. గర్భిణులను దవాఖానకు తీసుకొని రావడానికి, ప్రసవం తర్వాత బిడ్డతో సహా ఇంటికి చేర్చడానికి ‘అమ్మ’ ఒడి పేరిట వాహనాలను ప్రవేశపెట్టారు.
దళితబంధు పథకం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నది. దళిత కుటుంబాల్లో వెలుగులు నింపాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ 2021 ఆగస్టు 16న హుజూరాబాద్ మండలం శాలపల్లి-ఇందిరానగర్ వేదికగా దళిత బంధు పథకాన్ని ఆవిష్కరించారు. ఒక్క హుజూరాబాద్ నియోజకవర్గంలోనే రూ.1, 784.79 కోట్లతో 18,021 కుటుంబాలకు లబ్ధి కల్పి ంచారు. దళితబిడ్డలకు అడుగడుగునా అండగా నిలిచేందుకు ప్రభుత్వం తాజాగా ఒక యాప్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ బృహత్తర పథకాన్ని పకడ్బందిగా అమలు చేయాలనేది కేసీఆర్ లక్ష్యం. ఈ క్రమంలోనే దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ లబ్ధిదారుల ఎంపిక జరుగుతున్నది. కొన్ని చోట్ల యూనిట్ల గ్రౌడింగ్ అవుతున్నది.
గత పాలకుల వివక్ష, విద్రోహాలతో విధ్వంసమైన తెలంగాణ కేసీఆర్ పాలనలో సంక్షేమ రాజ్యంగా మారింది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ 41 ఏండ్లు, టీడీపీ 17 ఏండ్లు పాలించాయి. కానీ ఏనాడు ఒక వి నూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టలేకపోయా యి. కేసీఆర్ దార్శనికుడు, కార్యసాధకుడు. తెలంగాణ రాష్ర్టాన్ని కాంక్షించారు, ఉద్యమించి సాధించారు. పరిపాలకుడిగా తెలంగాణను దేశానికి రోల్మాడల్గా మార్చారు. ఇప్పుడు అదే దృఢ సంకల్పంతో దేశాన్ని చక్కదిద్దాలని సంకల్పించారు, సాధించి తీరుతారు.
-కడపత్రి ప్రకాశ్రావు
8096677022