హైకోర్టు స్టేల కారణంగా నిలిచిపోయిన టీచర్ల బదిలీలు, పదోన్నతుల కోసం ఉపాధ్యాయులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత విద్యా వ్యవస్థపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాలి. ఓవైపు ఐఏఎస్, ఐపీఎస్ (పోలీసు ఉన్నతాధికారుల) బదిలీలు కొనసాగుతున్నాయి.
మరోవైపు అన్ని ప్రభుత్వ శాఖల్లో త్వరలో అధికారులు, సిబ్బందిని బదిలీ చేయనున్నట్టు సీఎం ప్రకటించడంతో ఉపాధ్యాయులు కూడా బదిలీల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. కొంతమంది ఐదారు ఏండ్లుగా ఒకేచోట పనిచేస్తున్నారు. మరికొంత మంది ఉపాధ్యాయులు పన్నెండు, పదమూడేండ్లుగా ఒకే పాఠశాలలో విధులు నిర్వర్తిస్తూ నిరాశ, నిస్పృహలకు గురవుతున్నారు.
గతంలో ప్రధానోపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు జరిగాయి. స్కూల్ అసిస్టెంట్ బదిలీలు జరిగినా కొత్త పాఠశాలల్లో చేరకుండా వారంతా పాత పాఠశాలల్లోనే విధులు నిర్వర్తిస్తున్నారు. కొత్త పాఠశాలల్లో చేరేందుకు ప్రభుత్వ ఉత్తర్వుల కోసం వెయ్యి కండ్లతో ఆశగా ఎదురు చూస్తున్నారు. స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులు జరగలేదు. స్కూల్ అసిస్టెంట్ బదిలీలు జరిగినా ఇంకా రిలీవ్ కాలేదు. భాషోపాధ్యాయులకు, ఎస్జీటీ తత్సమాన క్యాడర్ ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు లేకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది.
వివిధ కారణాల వల్ల ఇప్పటివరకు బదిలీలు, పదోన్నతులు వాయిదా పడ్డాయి. రాష్ట్రంలోని 10 జిల్లాలను 33 జిల్లాలుగా మార్చడం, జీ.వో 317 పేరిట మారుమూల ప్రాంతాలకు ఉద్యోగ, ఉపాధ్యాయుల సర్దుబాటు, స్థానికులు స్థానికేతరులుగా మారామని, తమకు న్యాయం చేయాలని హైకోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం స్టే విధించడంతో గతంలో బదిలీల ప్రక్రియ నిలిచిపోయింది. ప్రభుత్వ, పంచాయతీరాజ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల కోసం గతేడాది విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్లో ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలకు అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు బదిలీలలో 10 పాయింట్లు కేటాయించింది.
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసం పాఠశాలలకు రానటువంటి ఉపాధ్యాయ సంఘాల నాయకులకు అదనంగా 10 పాయింట్లు కేటాయించడం అన్యాయమని కొంతమంది హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. భార్యాభర్తలు ఒకే జిల్లాలో పని చేస్తున్నవారు ప్రభుత్వ, పంచాయతీరాజ్, ఎయిడెడ్, ఇతర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న వారికి స్పౌజ్ పాయింట్లు ఇవ్వగా దీనిపై హైకోర్టు స్టే ఇచ్చింది. దీంతో బదిలీలు పెద్ద సమస్యగా మారింది. పలు కారణాల వల్ల ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల పిటిషన్ విచారణ ఇప్పటికే ఐదారుసార్లు వాయిదా పడింది. గతేడాది వేసవి సెలవుల కంటే ముందే బదిలీలు, పదోన్నతులు జరుగుతాయని అనుకుంటే హైకోర్టులో వరుస స్టేలతో వాయిదాల పర్వం కొనసాగింది. ఇటీవల రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో బదిలీలు, పదోన్నతుల కోసం ఉపాధ్యాయులు హైకోర్టు, విద్యా శాఖ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.
పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరోసారి వాయిదా పడతాయనే భయం ఉపాధ్యాయులను వెంటాడుతున్నది. ప్రభుత్వ, పంచాయతీ రాజ్ పాఠశాలల్లో పదోన్నతులు జరిగి ఎనిమిదేండ్లు దాటింది. టెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినవారికే పదోన్నతులు దక్కుతాయని నిబంధనలు పెట్టగా.. దీనిపై సీనియర్ ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంలో న్యాయస్థానం జోక్యం చేసుకోవడంతో ప్రభుత్వానికి ముందుకు వెళ్లేందుకు ఇబ్బందిగా మారింది. 2010కి ముందు ఉద్యోగంలో చేరిన వారికి టెట్ అవసరం లేదని నోటిఫికేషన్లో ఇచ్చి ఇప్పుడు పదోన్నతులకు టెట్ తప్పనిసరి అని ప్రకటించడంతో సీనియర్ ఉపాధ్యాయులు అయోమయంలో పడ్డారు. ముందుగా పదోన్నతులు కల్పించి రెండు, మూడేండ్లలోపు టెట్ ఉత్తీర్ణత సాధించాలనే నిబంధనలు పెడితే సీనియర్ ఉపాధ్యాయులకు న్యాయం జరుగుతుంది.
ప్రధాన ఉపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ పోస్టుల పదోన్నతుల కోసం టెట్ తప్పనిసరి చేయడంతో వేలమంది ఉపాధ్యాయులు పరీక్ష కోసం ఎదురు చూస్తున్నారు. సంవత్సరానికి రెండు, మూడు సార్లు టెట్ను నిర్వహించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.
ఉపాధ్యాయుల పదోన్నతుల విషయంలో ఎలాంటి స్టే లేదు. ప్రభుత్వ, పంచాయతీరాజ్ మేనేజ్మెంట్ వారీగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయవచ్చు. టెట్ పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలనే నిబంధన మాత్రమే ఉన్నది. ప్రభుత్వం దాన్ని రెండు, మూడు సంవత్సరాల గడువు ఇచ్చి పదోన్నతులు ఇవ్వడంలో ఎలాంటి ఆటంకాలు, అడ్డంకులు లేవు. హైదరాబాద్ జిల్లాలో మొత్తం ప్రభుత్వ పాఠశాలలే ఉండటం వల్ల ప్రభుత్వ, పంచాయతీరాజ్ కామన్ సీనియారిటీ గొడవ లేదు. ప్రభుత్వ పోస్టులను హైదరాబాద్ జిల్లాలోని ప్రభుత్వ ఉపాధ్యాయుల చేత భర్తీ చేయడంలో ఎలాంటి ఆటంకాలు గానీ, అడ్డుగోడలు గానీ లేవు. ఉపాధ్యాయులకు పదోన్నతులు లేకపోవడం వల్ల మూడు, నాలుగు పీజీలు, పీహెచ్డీలు చేసిన వారు కూడా ఉద్యోగంలో ఏ హోదాలో చేరారో అదే హోదాలో పదవీ విరమణ చేస్తున్నారు. విద్యార్థులకు ప్రయోజనం కలగడానికి ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉన్నది.
ప్రభుత్వ, పంచాయతీరాజ్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు తగ్గ ఉపాధ్యాయులు లేరు. ఉపాధ్యాయులు ఎక్కువ మంది ఉన్నచోట విద్యార్థులు లేరు. ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ ( రేషనలైజేషన్ ) ఎనిమిదేండ్ల కిందట జరిగింది. గత ప్రభుత్వం 2022-23 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన ప్రారంభించింది. పాఠశాలలకు నూతన భవనాలు, క్రీడా మైదానాలు, కంప్యూటర్ ల్యాబ్లు, గ్రంథాలయాలు, సైన్స్ లాబ్లను ఏర్పాటు చేసి ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ, పంచాయతీరాజ్ పాఠశాలలను తీర్చి దిద్దడంతో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. కొన్నిచోట్ల ఎమ్మెల్యేలు, ఎంపీల సిఫారసులతో అడ్మిషన్లు పొందేంతగా పోటీ నెలకొన్నది.
మరోవైపు తెలుగు, హిందీ, ఉర్దూ మిగతా దేశీయ భాషలను బోధించే ఉపాధ్యాయులకు గత 26, 27 ఏండ్ల నుంచి పదోన్నతులు లేవు. ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తూ వారంతా ప్రాథమిక పాఠశాల స్థాయి వేతనాలు తీసుకుంటూ శ్రమదోపిడికి, వెట్టిచాకిరికి గురవుతున్నారు. అప్పటి సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, పంచాయతీరాజ్ పాఠశాలల్లో పనిచేస్తున్న 10,596 భాషోపాధ్యాయులకు ఉన్నతీకరణ చేస్తూ జీవో జారీ చేశారు. ఉన్నతీకరణలో తమకు అవకాశం ఇవ్వాలని ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న ఎస్జీటీ ఉపాధ్యాయులు హైకోర్టుకు వెళ్ళి స్టే తీసుకొచ్చారు. పదోన్నతులు తీసుకొని ఉన్నతీకరణలో జోక్యం చేసుకోవద్దని ఎంత చెప్పినా వినకపోవడంతో ఎస్జీటీ ఉపాధ్యాయులకు న్యాయం చేయడానికి 10 వేల పోస్టులను ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం పోస్టులను పదోన్నతుల కింద ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ విషయం హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసి స్టేను వెకెట్ చేసి ఉన్నతీకరణ చేయాలని చాలామంది ఎదురు చూస్తున్నారు. ఉన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లు మాత్రమే బోధించాలనే నిబంధన అమలులో ఉన్నది. భాషా పండిత వ్యవస్థను రద్దు చేసి ఉన్నత పాఠశాలలో బోధిస్తున్న భాషా పండితుల పోస్టులను స్కూల్ అసిస్టెంట్ హోదాకు పెంచాలని అన్ని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి.
ఉపాధ్యాయ సంఘాలతో సమావేశంలో ‘మాది పెద్ద సంఘం అంటే మాది పెద్ద సంఘం’ అంటూ భేషజాలకు పోకుండా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఆఫీసు సబార్డినేట్గా ఎంపికైన ఉద్యోగులు అసిస్టెంట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ వరకు ఐదారు పదోన్నతులు పొంది పదవీ విరమణ చేస్తున్నారు. ఉపాధ్యాయులు మాత్రం ఏ హోదాలో ఉద్యోగంలో చేరుతున్నారో అదే హోదాలో పదవీ విరమణ చేయాల్సి రావడం విచారకరం. ప్రతి ప్రభుత్వ శాఖలో చేరిన ఉద్యోగులు తమ సర్వీసు కాలంలో మూడు, నాలుగు పదోన్నతులు పొందాలని, పనికి తగిన వేతనం ఇవ్వాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. రాష్ట్ర విద్యాశాఖలో మాత్రం చిత్రమైన పరిస్థితి ఏర్పడింది. ఉపాధ్యాయ సంఘాల నాయకులు కొంతమంది తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం మొత్తం ఉపాధ్యాయుల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని బహిరంగంగా విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో ఉపాధ్యాయుల సమస్యలను గాలికొదిలేసిన కొంతమంది నాయకులు కొత్త ప్రభుత్వంతో చేరి పెత్తనం చెలాయించడానికి, తమదే పెద్దన్న పాత్ర ఉండాలని పావులు కదుపుతున్నారు. అటువంటి వారి పట్ల ఉపాధ్యాయులు జాగ్రత్తగా వ్యవహరించాలి.
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించి శాశ్వత పరిష్కారం చూపాలి. ఏటా కనీసం ఒక్కసారైనా పదోన్నతులు, బదిలీలు జరిగేలా మార్గదర్శకాలు రూపొందించాలి. జీవో 317 సమస్యను పరిష్కరించాలి. నగదు రహిత ఆరోగ్య కార్డులను పంపిణీ చేయాలి.
ప్రైవేట్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో కూడా కార్డులు పనిచేసేలా చూడాలి. నగదు రహిత ఆరోగ్య కార్డుల కోసం తమ జీతం నుంచి ఒక శాతం వేతనం ఇవ్వడానికి ఉద్యోగ, ఉపాధ్యాయులు సిద్ధంగా ఉన్నారు. నూతన ప్రభుత్వంలో త్వరలోనే ఉపాధ్యాయుల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాను.
వ్యాసకర్త: రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్
-డాక్టర్ ఎస్.విజయభాస్కర్
92908 26988