తెలంగాణ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో అంతర్భాగమై ఉన్నప్పుడు వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు తమ విద్యుత్ అవసరాలను తీర్చుకోవడానికి ఇన్వర్టర్లు, జనరేటర్లపై ఆధారపడేవారు. ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఆరు గంటలు మాత్రమే కరెంటు సరఫరా చేసేది. అది కూడా దశలవారీగా, కొన్నిసార్లు రాత్రిపూట మాత్రమే విద్యుత్ను అందించేది. ఈ కారణంగా ఆ సమయంలో తమ పొలాలకు నీరు పెట్టేందుకు వెళ్లి విద్యుదాఘాతానికి గురై, పాముకాటుకు గురై ఎంతోమంది రైతులు తమ ప్రాణాలను కోల్పోయారు.
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కొన్ని నెలల్లోనే తెలంగాణ రైతుల పరిస్థితి మారిపోయింది. తెలంగాణ ప్రభుత్వం తొలుత 7 గంటల ఉచిత కరెంటును అందజేసింది. ఆ సరఫరాను 2016లో 9 గంటలకు పొడిగించింది. 2017; కొన్ని డిస్ట్రిబ్యూషన్ బోర్డుల్లో 24 గంటల విద్యుత్ సరఫరా పైలట్ ప్రాజెక్టులను ప్రవేశపెట్టింది. 2018 నాటికి తెలంగాణ ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేసే సామర్థ్యాన్ని సృష్టించింది. పెద్ద ఎత్తున విద్యుదుత్పత్తి సౌకర్యాలను నిర్మించడం వల్లనే ఇది సాధ్యమైంది.
మహారాష్ట్ర: ‘బలిరాజు’ను రైతుల రాజుగా నమ్ముతాం. అందుకే రైతును ‘బలిరాజా’ అని పిలుస్తాం. మహారాష్ట్రలో అనేక జీవనదులు పారుతున్నాయి. ఈ వనరులను సద్వినియోగం చేసుకుంటే రాష్ట్ర రైతాంగం పంట దిగుబడి పెద్ద ఎత్తున సాధించవచ్చు. కాబట్టి మహారాష్ట్రలో తెలంగాణ మోడల్ను అమలుచేస్తేనే ఈ రాష్ర్టానికి సాధికారత చేకూరుతుంది. తెలంగాణ ప్రభుత్వం అక్కడి రైతాంగానికి 24 గంటల విద్యుత్ సౌకర్యాన్ని అందిస్తుంటే, మహారాష్ట్రలో కరెంటు కోసం రైతులు ఇప్పటికీ
ఉద్యమించే పరిస్థితులు ఉండటం విచారకరం. తెలంగాణలో అమలవుతున్న పథకాలు మహారాష్ట్రలో కూడా అమలైతే మహారాష్ట్ర రైతులు ఆనందంలో మునిగి తేలుతారు. కానీ, మహారాష్ట్రను పాలించిన గత ప్రభుత్వాలకు, ప్రస్తుత ప్రభుత్వానికి అది సాధ్యం కాలేదు కాబట్టే బలి రాష్ర్టాన్ని తీసుకురావడానికి భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమయ్యారు.
చరిత్రలో బలిరాజు దురాక్రమణదారులతో పోరాడి మరణించాడు. నేటి బలిరాజు (రైతు) పోరాడేబదులు చావడానికే ఇష్టపడుతున్నాడు. యుద్ధం ప్రారంభం కాకముందే ఓటమిని ఒప్పుకొంటున్నాడు. వేడి, వాన, చలి, ఈదురుగాలులు వంటి విపత్తుల గురించి ఆలోచించకుండా, అలసిపోకుండా రాత్రింబవళ్లు పనిచేసేవాడే రైతు. ఆ రైతే అకాల వర్షాలు, కరువు, ధరల పతనం, వడ్డీ, బ్యాంకు రుణాల వంటి మొదలైన సమస్యలతో బాధపడుతున్నాడు. వ్యవసాయం చేయడమంటేనే రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడటం. సహజ సమస్యలే కాకుండా, ప్రభుత్వాలు సృష్టించిన సమస్యలూ ఉన్నాయి. అలాంటి సమస్యే ఈ విద్యుత్ సమస్య. మహారాష్ట్ర ప్రభుత్వం ఇక్కడి రైతులకు 8 గంటల కరెంటును మాత్రమే అందిస్తున్నది. దీంతో రైతులకు అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో మోటార్లు కాలిపోవడం, పైప్లైన్ పగిలిపోవడం లాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఒక్కోసారి రాత్రివేళ కరెంటుతో రైతులు విద్యుత్ షాక్కు గురై ప్రాణాలు కోల్పోతున్నారు.
ఏ రాష్ట్రంలోనైనా ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కొంటున్న రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు అక్కడి ప్రభుత్వం సబ్సిడీ పథకాలు, రైతు సంక్షేమ పథకాలు అమలుచేస్తేనే ఆ రాష్ట్రంలో వ్యవసాయం వృద్ధి చెందుతుంది. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న ‘రైతుబంధు’ పథకంలో భాగంగా ఎకరానికి ఏటా రూ.10 వేలు సీజన్ ప్రారంభానికి ముందే రైతు ఖాతాలో జమచేస్తున్నది. మహారాష్ట్రను పాలించిన గత ప్రభుత్వాలు ఇక్కడి రైతులకు తెలంగాణ వలె నిరంతర విద్యుత్ను పక్కనపెడితే కనీసం ఎనిమిది గంటల కరెంటును కూడా సాఫీగా ఇవ్వలేకపోతున్నారు. కానీ, దేశంలోనే రైతులకు 24 గంటల కరెంట్ నిరంతరాయంగా ఇస్తున్న రాష్ట్రం ఉన్నది. అదే తెలంగాణ రాష్ట్రం అది కూడా ఉచితంగా! అందుకే మహారాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడుతున్నారు. రాష్ట్రంలోని ఏ మూలన బీఆర్ఎస్ సభ జరిగినా రైతులు తండోపతండాలుగా తరలుతున్నారు. ‘అబ్ కీ బార్-కిసాన్ సర్కార్’ అని గట్టిగా నినదిస్తున్నారు.
(వ్యాసకర్త: మహారాష్ట్రలోని నాందేడ్ వాసి)
-డాక్టర్ లక్ష్మీకాంత్ కల్ముర్గే
88880 87513