అఖిల భారత విప్లవ సాంస్కృతిక రథసారథి గొంతు మూగబోయింది. ఇక నుంచి ఈ నేల మీద ఆ గొంతు పాడదు. ఆ గొంతును అందరూ ప్రేమతో, అభిమానంతో ప్రజాయుద్ధ నౌకగా పిలుచుకునేవారు. ఇప్పుడు ఆ ప్రజాయుద్ధ నౌక ఈ నేలను విడిచిపోయారు.
నాకు గద్దర్ పేరు చిన్నతనం నుంచి పరిచయం. నాది సిరిసిల్ల సమీపంలోని కోనరావుపేట. మాది అటవీ ప్రాంతం. ఆనాడు మా ప్రాంతాలు కల్లోలితాలు. మా చుట్టు పక్కల గ్రామాల్లో ఏ మూలన ఎన్కౌంటర్ జరిగినా ఊర్లన్నీ ఉలిక్కిపడేవి. ఆ ఎన్కౌంటర్లలో కొన్నిసార్లు నక్సలైట్లు చనిపోయేవారు. ఆ చనిపోయిన అమరుల శవాలను స్వాధీనం చేసుకోవడానికి గద్దర్తో పాటు అనేకమంది వచ్చేవారు. అలా నాకు గద్దర్ పేరు పరిచయమైంది. గద్దర్ పాటల క్యాసెట్లు మా ప్రాంతాల్లో ప్రతి ఇంట్లో ఉండేవి. ఆయన పాటలు వినడంతో ఆ పేరు నా మస్తిష్కంలో స్థిరపడిపోయింది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం మలిదశ ఉద్య మం ప్రారంభమైనప్పుడు నేను తెలంగాణ ఉద్యమ కేంద్రమైన ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేస్తున్నాను. అప్పుడు నేను ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘంలో పనిచేశాను. తర్వాత ఈ సంఘానికి ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్షునిగా కూడా పనిచేశాను. తెలంగాణ మలి దశ ఉద్యమంలో విద్యార్ధి జేఏసీకి చైర్మన్గా కూడా పనిచేశాను. ఈ విద్యార్థి సంఘాల మీటింగులకు అనేకసార్లు గద్దరన్నను పిలిచేవాళ్లం. అలా నేను ఆయనకు అభిమానినయ్యాను. అనుచరున్ని అయ్యాను. ఆయన మాకు సంఘ నిర్మాణం మీద, పనితీరు మీద సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చేవారు. ఆయన చెప్పే పద్ధతి సైద్ధాంతికంగా, హేతుబద్ధంగా ఉండేది. ఆయన మాట, పాట మాలో ఒక నవీన శక్తిని నింపేది. ఆయన మాటకు పదునెక్కువ. ఆయన పాటకు చైతన్యమెక్కువ. సంఘంలో పనిచేసేవారు రెండు విషయాలు గుర్తించుకోవాలనేవారు. అవి ఒకటి నిర్మాణం, రెండు ప్రోగ్రాం. ఈ రెండు సంఘానికి ఊపిరి లాంటివి. కవచం లాంటివి. సంఘాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేది ప్రోగ్రామని, సంఘానికి రక్షణ అయ్యేది నిర్మాణం అని చెప్పేవారు. అలాగే సంఘానికి ఒక ఎజెండా, పర్స్పెక్టివ్ ఉండాలనేవారు. అలాగే సంఘానికి, కార్యకర్తకు ఒక భావజాలం ఉండాలనే వారు. అది మార్క్సిజం, అంబేద్కరిజమై ఉండాలనేవారు. అవి ఈ దేశ అణగారిన, పీడిత ప్రజల విమోచనకు విముక్తి అని చెప్పేవారు. అంబేద్కర్ ఈ దేశ సామాజిక నిర్మాణాన్ని అర్థం చేసుకున్నంతగా ఎవరూ అర్థం చేసుకోలేదనేవారు. అది మనకు జ్ఞాన సిద్ధాంతం కావాలన్నారు. సమస్త మానవాళి విముక్తికి మార్క్సిజం ఆయుధమన్నారు.
నాకు ఉస్మానియా యూనివర్సిటీలో పరిశోధక విద్యార్థిగా అడ్మిషన్ వచ్చింది. నేను గద్దరన్నను చాలా కాలం నుంచి, చాలా దగ్గరగా సన్నిహితంగా చూస్తూ వచ్చాను. కాబట్టి నేను నా పరిశోధక అంశం గద్దర్ జీవితం, సాహిత్యం తీసుకున్నాను. అప్పటినుంచి నేను గద్దర్ను, గద్దర్ జీవితాన్ని అధ్యయనం చేయడం మొదలుపెట్టాను. ఆయన కష్టపడి పనిచేసే తీరు, ఎంత కష్టమైనా సహించి నిలబడగల సామ ర్థ్యం ఆయనను మహోన్నతమైన వ్యక్తిగా చేశా యి. ఆయన మాటల్లో, ఆయన జీవనశైలిలో ఎప్పు డూ వృద్ధాప్యం కనిపించలేదు. ఆయన జీవితం చాలా విశాలమైనది. ఆయన ఆలోచన చాలా లోతైనది. విస్తృతమైనది. ఆయన నడిచిన బాట సమస్త భారతం. ఆయన జీవితం చిన్న కళాకారునిగా మొదలై యావత్తు దేశమైంది. ఉమ్మడి మెదక్ జిల్లా, తూప్రాన్లో సిరిమల్లె చెట్టు కింద లచ్చువమ్మ అంటూ మొదలైన ఆయన ప్రస్థానం దేశ ప్రజల గొంతుకైంది. ఆ గొంతుక ప్రజల భావ శబ్దమైంది. ఆ భావం విప్లవమైంది.
ఆయన ప్రజల్లో భావ విప్లవం తీసుకురావడానికి సాంస్కృతిక ఉద్యమమైనారు. ఆయన ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి పాటను, బుర్రకథను, ఒగ్గు కథను ఆయుధాలుగా ఎంచుకున్నారు. ‘తరగని గని’ వంటి కొన్ని పుస్తకాలు రచించారు. ఇంకా అచ్చు కాని వి కూడా చాలా ఉన్నాయి. ఆయన పాటలు, కవితలు, సా హిత్యం ప్రజల జీవితాలను పెనవేసుకొని ఉంటాయి. అవి జానపద ఒరవడి నుంచి పుట్టాయి. జానపద బాణీలను విప్లవీకరించాడు. ఆయన సాహిత్యం పేదల కష్టాల నుంచి పుట్టింది. ఆయన సాహిత్యానికి ప్రజల భాషనే సాధనం. ఆయన సాహిత్యంలో స్త్రీలు, పీడితులు, దళితులు, మైనారిటీలు, కార్మికులు ఇలా అన్ని వర్గాల వారున్నారు. ఆయన మాతో ఎప్పుడూ అనేవాడు ‘నేను రాజకీయాల్లోకి వచ్చానంటే దానర్థం… అది యూ టర్న్, అబౌట్ టర్నో, చేతులెత్తేయటమో కాదు. అలా అయితే, ఏదో ఒక బూర్జువా రాజకీయ పార్టీలో చేరేవాడిని. కానీ నేను అలా చేయలేదు. కారల్ మార్క్స్ జ్ఞాన సిద్ధాంతంతో పాటు ఫూలే, అంబేద్కర్ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకపోవాలనేదే నా ఉద్దేశం’ అనేవారు.
2001లో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం టీఆర్ఎస్ పార్టీ పెట్టారు. ఐదుగురితో మొదలైన ఆ పార్టీ అనతి కాలంలోనే ప్రజాదరణ పొంది తెలంగాణ సాధించే శక్తిగా ఎదిగింది.
తెలంగాణ సాధించాలంటే రాజకీయ శక్తితో పాటు సాంస్కృతిక శక్తి కూడా అవసరం అన్నారు గద్దర్. తెలంగాణ ధూంధాం ద్వారా రాష్ట్రమంతా ప్రదర్శనలు ఇచ్చారు. అలాగే రాజకీయ వేదికగా ప్రజాఫ్రంట్ ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం మణుగూరు నుంచి మందమర్రి వరకు పాదయాత్ర చేశారు.
విద్యార్థి నాయకునిగా నేనూ పాల్గొన్నాను. ఓటు ద్వారా చైతన్యాన్ని తీసుకురావాలనేది ఆయన వాదన. కుల వ్యవస్థతో కూడిన భారతదేశంలో మధ్యే మార్గంగా ఒక సామాజిక విప్లవం రావలసిన అవసరం ఉందనేవారు.
అంతటి గొప్ప కవి, ప్రజాగాయకుడు తుదిశ్వాస విడవటం తెలంగాణకు తీరనిలోటు. ఆ యన మరణంతో తెలంగాణ ఒక ఉద్యమ కవిని, గాయకుడిని కోల్పోయింది. తెలంగాణనే కాకుండా యావత్తు దేశాన్ని తన పాటలతో చైతన్యం నింపిన గొం తు మూగబోయింది. ముఖ్యం గా ఒక సామాజిక చైతన్య దివిటీని కోల్పోయింది.
-మాందాల భాస్కర్
97050 53483