ఎల్లారెడ్డిపేట/ వేములవాడరూరల్/ కోనరావుపేట, జూన్ 8: కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం రైతన్నకు శాపంగా మారుతున్నది. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చి రెండు నెలలైనా కొనకపోవడంతో ఆరుగాలం కష్టం నీళ్లపాలవుతున్నది. రెండు రోజుల నుంచి పడుతున్న వర్షాలతో నష్టం వాటిల్లుతున్నది. ఆదివారం సాయంత్రం తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలుచోట్ల పడిన వానకు.. ఎల్లారెడ్డిపేట మండలం గుండారం, తిమ్మాపూర్, జైసేవాలాల్ తండా, వేములవాడరూరల్ మండలం లింగంపల్లి, వట్టెంల, నూకలమర్రి, కోనరావుపేట మండలం నిజామాబాద్ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు తడిశాయి. తూకం వేసిన బస్తాలు కూడా తడిసిపోయాయి. ఇది చూసిన రైతులు కంటతడి పెట్టారు. ధాన్యాన్ని కాపాడుకునేందుకు తంటాలు పడ్డారు. కేంద్రాలకు వడ్లు తెచ్చి రెండు నెలలు గడిచినా సరిగ్గా కొనకపోవడంతోనే తమకీ దుస్థితి వచ్చిందని వాపోతున్నారు. వానకాలం వచ్చినా ధాన్యం కొనుగోళ్లు పూర్తి కాకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. రైతులను ఇంతలా గోస పెట్టవద్దని వేడుకున్నారు. కలెక్టర్ చొరవ చూపి కొనుగోళ్లు వేగవంతం చేయాలని కోరారు.

వడ్లన్నీ తడిసినయి..
నాకు తిమ్మాపూర్ల రెండెకరాల పొలమున్నది. 120 సంచుల వడ్లు ఎల్లితే నెలన్నర కింద కల్లంలనే పోసిన. కొంటం, కొంటమంటుర్రు. ఇప్పటికీ కాంటా పెట్టినోళ్లే లేరు. నిన్న వానగొట్టింది. నీల్లచ్చి కుప్పల చేరి ఒకపక్క మొత్తం తడిసిపాయె. వడ్లన్నీ కాల్వగట్టుకు ఎత్తుతున్నం. ఇప్పుడు మళ్లీ మాశ్చర్ అచ్చేదాక ఆరబెట్టాలి. అంటే మల్ల నాలుగైదు రోజులైతది. ఇంకో పక్క చూస్తే మల్ల మొగులైతంది. ఏం చేసుడో అర్థమైతలేదు. వానకాలం పంటేద్దామంటే ఈ వడ్లే కొనకపాయె. పొద్దుందాక కావలిగాసుడే ఉన్నది. లేట్ చేయకుండా ధాన్యం కొనాలి.
– బీమరి బాలయ్య, రైతు, తిమ్మాపూర్ (ఎల్లారెడ్డిపేట)
నెలన్నరయినా కొంటలేరు
మాది గుండారం. తిమ్మాపూర్ శివారుల మా పొలముంది. ఏప్రిల్ 28న వరి కోసి తిమ్మాపూర్ కేంద్రంలో వంద కింటాల్ల దాకా వడ్లు పోసిన. ఐదు రోజులకే మ్యాచర్గూడా వచ్చింది. ఇగగొంటం, అగగొంటం, ఇంకా సీరియల్ రాలేదనుకుంటా జరుపుతున్నరు. పొల్లుందని చెప్పిర్రు. జాలిపట్టుమంటే పట్టినం. నిన్నన్నుంచి వాన రావట్టె. వడ్లు తడిసినయ్. మల్ల కింది నుంచి ఎత్తుతున్నం. నెలన్నర నుంచి ఇంటికీ, కేంద్రానికే తిరుగుడైతుంది. ఏం మనసుపడ్తలేదు. జెల్ది కొనుడైపోతే ఏమన్నా పనిజేసుకుంటం. ఎన్ని రోజులు ఇక్కడ ఉండాలె.
– గుంటి పర్వతాలు, రైతు, గుండారం (ఎల్లారెడ్డిపేట)