బీఆర్ఎస్ అమలుచేసిన సంక్షేమ పథకాల కంటే ఒక మెట్టుపైనే ఉండాలన్న ఉబలాటంతో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ పథకాల తాయిలాలతో ఓటర్లను ఆకర్షించింది. అయినప్పటికీ సుమారు 2 శాతం ఓట్ల మెజారిటీతోనే గద్దెనెక్కింది. వెంటనే మహాలక్ష్మీ పథకంలో భాగమైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన ఫైల్పై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తొలి సంతకం చేశారు. మిగతా గ్యారెంటీల అమలు కోసం వందరోజుల సమయాన్ని కోరారు. కానీ ఈ పథకాల అమలు తీరుతెన్నులు నిరాశాజనకంగానే ఉండబోతాయనే సంకేతాలు వెలువడుతున్నాయి.
తొలుత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించింది. ఇంకేముంది ఆర్టీసీ బస్సులన్నీ మహిళలతో కిక్కిరిసిపోయాయి. పురుషులు విధిలేక తమ సీట్లను మహిళలకు ఇచ్చి గౌరవంగా బస్సులు దిగిపోయారు. ఆటోలన్నీ బిక్కపోయాయి. ఇప్పుడు లబ్ధిదారులు కానీవారికి మాత్రం మెరమెరగా ఉన్నది. కానీ ఏం చేస్తారు పాపం! ఖాళీ బస్సులు వచ్చేదాకా ఎదురుచూడటం తప్ప! ఒకప్పుడు ‘మహిళలకు ప్రత్యే కం’ అని బోర్డు ఉండేది. కానీ, ఇప్పుడు ‘పురుషులకు ప్రత్యేకం’ కావాలంటూ అర్జీలు పెట్టుకొనే పరిస్థితి వచ్చింది.
వాస్తవానికి మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణ పథకం వల్ల ఒరిగిందేమీ లేదు. పైగా ఈ పథకం పట్టణాల్లోని ఆటో డ్రైవర్ల పొట్టకొట్టింది. లక్షల రూపాయల వేతనాలు ఆర్జించే వేలాది ఉద్యోగినులు సైతం ఉచితమే కదా అని దర్జాగా బస్సు ల్లో ప్రయాణిస్తుండటం గమనార్హం. ఈ ఉచిత పథకం వల్ల ఆర్టీసీకి రూ.3000 కోట్ల పైచిలుకు నష్టమవుతుండగా ఈ మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించనున్నది. జీరో టికెట్ ఆధారంగా ప్రభుత్వానికి నివేదిక అందజేసి అందుకు సంబంధించిన నగదును తిరిగి ఆర్టీసీ పొందనున్నది. అంటే కుడిచేత్తో సంపాదించింది ఎడమ చేత్తో ఖర్చుచేయడమన్న మాట. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ‘సంపదను సృష్టిస్తాం’ అని అన్నారు. ప్రభుత్వ నిధులను ప్రభుత్వ సంస్థకు ఇవ్వడమే సంపద సృష్టించడమా? అన్నది అసలు ప్రశ్న.
వాస్తవానికి ఎన్నికల ప్రచార సమయంలో మహిళలెవరూ ఉచిత బస్సు ప్రయాణం కావాలని డిమాండ్ చేయలేదు. పేద మహిళలు తమ కుటుంబానికి ఏదైనా ఉపాధి కల్పించాలని, కూడు, గూడు, గుడ్డ తదితర మౌలిక వసతులు సమకూర్చాలని ఓట్ల కోసం వెళ్లిన ప్రతి పార్టీని, నాయకుల ముందు ప్రాధేయపడ్డారు. కానీ, కాంగ్రెస్ పార్టీ ఈ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోలేదు. మొత్తంగా ఉచిత బస్సు ప్రయాణ పథకం కాకులను కొట్టి, గద్దలకు పెట్టిన చందంగా ఉన్నదనడంలో సంశయం లేదు. ఇప్పుడు పల్లెటూర్లకు వెళ్తే మనకొకటే దృశ్యం కనిపిస్తున్నది. పనులను వదులుకొని మరీ మహిళలు సమీప పట్టణాలకు ‘ఫిరీ’ బస్సులో పయనమవుతున్నారు. తద్వారా ఉచిత బస్సు ప్రయాణం ప్రభావం ఉత్పాదకతపై కూడా పడుతుందని చెప్పవచ్చు. అంతిమంగా ఖర్చు తడిసి మోపెడై ఈ పథకం కొన్నేండ్లకు తెల్ల ఏనుగవుతుంది.
ఇక రెండవది మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు రూ.500లకే ఎల్పీజీ సిలిండర్ ఇస్తామని ప్రకటించడం. తెలంగాణలో మొత్తం 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉండగా హెచ్పీసీఎల్ నుంచి నుంచి 43.40 లక్షలు, ఐవోసీఎల్ నుంచి 47.97 లక్షలు, బీపీసీఎల్ నుంచి 29.04 లక్షల వినియోగదారులున్నారు. వీరిలో 44 శాతం మంది అంటే 52.80 లక్షల మంది ప్రతి నెలా సిలిండర్ బుక్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ.955 కాగా, సాధారణ కనెక్షన్లకు ఒక్కో బుకింగ్కు కేంద్రం రూ.40 రాయితీ అందిస్తున్నది. ఉజ్వల కనెక్షన్లకు రూ.340 రాయితీ వస్తున్నది. తెలంగాణలో మొత్తం 11.58 లక్షల ఉజ్వల కనెక్షన్లు ఉండగా, కేంద్రం విజ్ఞప్తి మేరకు ‘గివ్ ఇట్ అప్’లో భాగంగా రాష్ట్రంలో 4.2 లక్షల మంది రాయితీ వదులుకున్నారు. ఈ పథకం కింద ఏటా ప్రతి లబ్ధిదారునికి 6 గ్యాస్ సిలిండర్లు ఇస్తే ప్రభుత్వంపై దాదాపు రూ.2,225 కోట్ల భారం పడుతుందని అధికారుల అంచనా. అదే 12 సిలిండర్లు ఇస్తే ఆ భారం రెట్టింపవుతుంది.
ప్రతి పేద మహిళకు నెలకు రూ.2500 భృతి ఇచ్చే పథకానికి ఇంకా మార్గదర్శకాలు జారీ కాలేదు. 1.5 కోట్ల మంది మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశాలున్నాయి. దీంతో ప్రభుత్వంపై ప్రతి నెల దాదాపు రూ.3,750 కోట్ల భారం పడనున్నది. ఇప్పటికే రూ.5.8 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి ఇది అదనపు భారమే. ఒక్క మహాలక్ష్మి పథకానికే రూ.10,000 కోట్ల నిధులు అవసరమవుతాయి.
బీఆర్ఎస్ రైతుబంధు పథకాన్ని ప్రారంభించిన నాటినుంచి ఠంచన్గా రైతులకు పెట్టుబడి సాయం అందించింది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు పేరును ‘రైతుభరోసా’గా మార్చి ఎకరానికి రూ.10,000 సాయాన్ని రూ.15,000లకు పెంచింది. అయితే నిధుల లేమి కారణంగా ప్రస్తుత సీజన్లో పాత పద్ధతినే కొనసాగించింది. రైతు భరోసా విధి విధానాలు రూపుదిద్దుకోకపోవడమేనని ఏలినవారి ఉవాచ! కానీ, ఇంతవరకు ఒక ఎకరం భూమి ఉన్న రైతులకు మాత్రమే నిధులు విడుదల చేసింది. ఇదేమిటని ప్రశ్నిస్తే ‘గత ప్రభుత్వం అప్పులు చేసింది. ప్రజలకు మేలు చేద్దామనుకుంటే ఖజానాలో ఒక్క పైసా లేదు’ అని అసెంబ్లీలో ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. ఇలా ప్రకటించడం దేనికి సంకేతం? ఆరు గ్యారెంటీల్లో రెండు పథకాల్లోని కొంత భాగానికే కండ్లు తేలేయడాన్ని బట్టి చూస్తే మిగతా నాలుగు పథకాలను వంద రోజుల్లో అమలుచేయలేరనే అర్థమవుతున్నది. వరంగల్ రైతు డిక్లరేషన్లో భాగంగా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 39 లక్షల మంది రైతులు.. బ్యాంకులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో రుణగ్రహీతలుగా ఉన్నట్టు నివేదికల ద్వారా తెలుస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా రూ.40 వేల కోట్ల వరకు బ్యాంకుల్లో రైతు రుణాలున్నట్టు అధికారులు తేల్చారు. రూ.2 లక్షల వరకు పరిధి విధిస్తే రూ.32 వేల కోట్ల వరకు నిధులు అవసరమవుతాయి.
ప్రతి విద్యార్థినికి స్కూటీ ఇస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేశారు. ఇవన్నీ అవసరమా? ఆచరణ సాధ్యమా? ఈ నిధుల కోసం ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి అప్పులు చేయకుండా సంపదను ఎలా సృష్టిస్తుందో ముఖ్యమంత్రి ఇంతవరకు చెప్పలేదు. ఎన్టీఆర్ హయాం కంటే ముందు భూమి శిస్తు, నీటితీరువా తదితర పన్నులుండేవి. 1983 నుంచి ప్రజాకర్షక పథకాలు వెల్లువలా ఉప్పొంగడం వల్ల ఉచితాల సంఖ్య పెరిగిపోయింది. నేడు భూమి శిస్తు లేదు. నీటి తీరువా పన్ను లేదు. వీటికి అదనంగా ఇప్పుడు 200 యూనిట్ల వరకు ఉచి త విద్యుత్తు ఇచ్చే పథకం కూడా చేరింది. దీంతో సామాన్యుడిలో పలు ప్రశ్నలు, సందేహాలు తలెత్తుతున్నాయి.
ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రతి నెల మొదటి తేదీన జీతా లు, పింఛన్లు చెల్లిస్తారా? బాకీ పడిన నాలుగు విడతల డీఏ తక్షణమే చెల్లిస్తారా? పదవీ విరమణ వయస్సును 61 ఏండ్ల నుంచి 58 ఏండ్లకు తగ్గిస్తారా? రాహుల్గాంధీ ప్రకటించిన రెండు లక్షల ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ ఎప్పుడు విడుదల చేస్తారు? అధికారంలోకి వచ్చిన ఏడాదిలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. యూ పీఎస్సీ తరహాలోనే టీఎస్పీఎస్సీలో మార్పుచేర్పులు చేస్తామని వాగ్దానం చేశారు. యువ వికాసం కింద విద్యార్థులకు రూ.5 లక్షల సహాయం చేస్తామన్నారు.
నిరుద్యోగులకు అండగా ఉంటామని హామీ ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వ మార్పులో నిరుద్యోగులు కీలకంగా వ్యవహరించారు. సీఎం రేవంత్రెడ్డి వరుస సమీక్ష లు నిర్వహిస్తున్నా.. టీఎస్పీఎస్సీ విషయంలో త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలని నిరుద్యోగులు కోరుతున్నారు. గ్రూప్-2 పరీక్షకు పట్టుమని పదిరోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో షెడ్యూల్డ్ ప్రకారమే జరుగుతుందా? లేదా తొలుత ప్రకటించిన జాబ్ క్యాలెండర్ను కాంగ్రెస్ సర్కారు అనుసరిస్తుందా? అనేదానిపై స్పష్టత లేదు. ఒకవేళ జాబ్ క్యాలెండర్ మేరకు సర్కారు ముందుకెళ్తే ఫిబ్రవరి దాకా ఆగాల్సిందే! ఆ లోగా లోక్సభ ఎన్నికల షెడ్యూల్డ్ వస్తే మళ్లీ కథ మొదటికే వస్తుందన్న నిరుద్యోగుల ఆందోళనను పాలకులు అర్థం చేసుకోవాలి.
వంద రోజులు ఆగాలని కాంగ్రెస్ సర్కారు అంటున్నా.. వందరోజులు కాదు కదా, వెయ్యి రోజులైనా ప్రస్తుత పరిస్థితుల్లో ఆ హామీల అమలు సాధ్యం కాదు. సాధ్యం కానీ పరిస్థితుల్లో తమ చేతగాని తనానికి ‘చేతు’లెత్తి, దీనికి గత ప్రభుత్వ అప్పులే కారణమని చెప్తే ప్రజలు ఊరుకొంటారా? (ఆ.. ఊరుకోక ఏం జేస్తారు. ఐదేండ్ల దాకా ఏం చేయలేరనేది పాలకుల భావన.)
బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు ఎక్కువ శాతం మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, రహదారుల విస్తరణ, ఫ్లై ఓవర్లు, విద్యుత్తు కొనుగోలు కోసమే కానీ, ఉచితాల కోసం కాదు. ఉమ్మడి ఏపీలో ఆఖరి ప్రభు త్వం కాంగ్రెస్దే. వారు గద్దె దిగుతూ కొత్త రాష్ర్టానికి 2500 మెగావాట్ల లోటును అప్పజెప్పిపోయారు. మిగతా రంగాల్లోనూ ఇదే పరిస్థితి. కానీ గత పదేండ్లలో శాసనసభా సమావేశాల్లో కేసీఆర్ ఎన్నడూ గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టలేదు. తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆయన ప్రజెంటేషన్ను నిశ్శబ్దంగా వీక్షించారే కానీ, ఎవ్వరూ అభ్యంతరాలు, సందేహాలు లేవనెత్తలేదు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే హడావుడిగా సమర్పించిన శ్వేతపత్రం మాత్రం గణాంకాల గారడీ పత్రమే! ఎందుకంటే తెలంగాణ వార్షిక బడ్జెట్లో ఆరు వేల కోట్ల లోటుందని తెలిసి సైతం ఎన్నికల ముందు, కాంగ్రెస్ తమ ఆర్థికవ్యూహాన్ని ప్రకటించలేదు.
పీవీ నరసింహారావు ప్రధాని అయ్యే సమయానికి మన దేశం బిచ్చమెత్తుకొనే దశలో ఉన్నది. పలు ఆర్థికసంస్కరణ లు చేపట్టి ఐదేండ్లలోనే భారత్ను అగ్రరాజ్యాల సరసన నిలి పారు. అంతేకానీ గత ప్రభుత్వ పాలనా వైఫల్యాలను ఎండగట్టలేదు. అది ఆయన సంస్కారం. పీవీ స్ఫూర్తిని కలలో కూడా తీసుకోలేని కాంగ్రెస్ అస్తవ్యస్త ఆర్థిక విధానాలతో మన తెలంగాణ రాష్ర్టాన్ని పెనం మీది నుంచి పొయ్యిలో పడేసే సంకేతాలు కనిపిస్తున్నాయి. మార్పును ఆశించి తీర్పునిచ్చిన ప్రజలకు తాము చేసిన తొందరపాటు తప్పిదమేదో వంద రోజుల తర్వాత తెలుస్తుంది. ఉదాహరణకు ఎన్నికల ప్రచారంలో మహాలక్ష్మి పథకం గురించి ప్రతి మహిళ సంబురపడింది. తీరా చూస్తే తెల్లకార్డు ఉన్నవారికే ఆరు గ్యారంటీలంటూ కలెక్టర్ల మీటింగ్లో ముఖ్యమంత్రి తేటతెల్లం చేశారు.
తెలంగాణలో దాదాపు 88 లక్షల తెల్ల రేషన్కార్డులు ఉన్నట్టు సమాచారం. తెల్లకార్డులు లేని వారు కండ్లు తేలేస్తున్నారు. ఆరు గ్యారెంటీల పథకాల ఫలాల కోసం ఇప్పుడు అందరు తెల్లకార్డుల కోసం కార్యాలయాల ముందు క్యూ కడుతున్నారు. ప్రచారంలో అందరికీ లాభం అని ధ్వనించేలా మాట్లాడి, ప్రస్తుతం కొందరికే అని ప్రకటించి మాట మార్చారు కాంగ్రెస్ నాయకులు.
ఇదెలా ఉన్నదంటే మొదలు అందరినీ విందుకు ఆహ్వానించి, తర్వాత కొందరికి వడ్డించి, చివరికి మిగిలిన వారందరికీ మంచినీళ్లు ఇచ్చి పంపించే విధానం అని ప్రస్ఫుటమవుతున్నది. ఇలాంటి యూటర్న్లు, మెలికలు, మలుపులు రాబోయేరోజుల్లో ఎన్నో ఉంటాయని చెప్పడానికి మహాలక్ష్మి ఒక మచ్చుతునక. చెడి చింతించిన కార్యహాని కదా! అడుగు వేసేముందు ఆలోచించాలంటారు. కానీ, అడుగువేసిన తర్వాతే కాంగ్రెస్ ఆలోచిస్తుందని ప్రస్తుత పదిహేను రోజుల ఆ పార్టీ పాలన తీరుతెన్నులు తెలియజేస్తున్నది.
(వ్యాసకర్త: సాహిత్య, రాజకీయ విశ్లేషకుడు)
-డాక్టర్ వి.వి.రామారావు
98492 37663