స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 67 ఏండ్లలో జరుగని ముదిరాజ్ల అభివృద్ధి గడిచిన తొమ్మిదిన్నరేండ్ల కాలంలో జరిగిందనేది వాస్తవం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ఆర్థిక చేయూతనిచ్చి ముదిరాజ్లను ఆదుకున్నది. రాష్ట్రం ఏర్పడ్డాక సమగ్ర కుటుంబ సర్వే ద్వారా ముదిరాజ్లను బీసీ కులాల్లో అతిపెద్ద సామాజిక వర్గంగా గుర్తించింది. వారికి అనేక రకాల సంక్షేమ పథకాలను రూపొందించి అభివృద్ధి పథంలో నడిపిస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం.
ఏ కులానికైనా రాజకీయ ప్రాతినిధ్యం మాత్రమే సరిపోదు. కులస్తులందరి అభివృద్ధి, సంక్షేమం ప్రాతిపదిక కావాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం గత తొమ్మిదిన్నరేళ్లుగా ముదిరాజ్లకు ఉచిత చేపపిల్లల పంపిణీ పథకాన్ని తీసుకొచ్చి నీలివిప్లవంలో తెలంగాణ రాష్ర్టాన్ని నంబర్ వన్గా నిలిపింది. రాష్ట్రంలో మిషన్ కాకతీయ ద్వారా చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా కొండపోచమ్మ, మల్లన్నసాగర్ తదితర రిజర్వాయర్లను నింపింది. జలాశయాల్లో మత్స్య సంపద పెరిగి మత్స్యకారుల ఆదాయం గణనీయంగా పెరిగింది.
2013-14లో తెలంగాణ మత్స్య సంపద 2.4 లక్షల టన్నులు కాగా 2022-23 నాటికి 4.37 లక్షల టన్నులకు చేరింది. తెలంగాణ ఏర్పడేనాటికి మత్స్యకారుల ఆదాయం రూ.2,479 కోట్లు మాత్రమే. అది ఇవ్వాళ రూ.7,259 కోట్లకు పెరిగి తొమ్మిదిన్నరేండ్లలో మూడింతలైంది. 2014లో 2 వేల మత్స్య సహకార సంఘాలుంటే నేడు అవి 6 వేలకు చేరాయి. సంఘాల్లో సభ్యత్వం 2.65 లక్షల నుంచి 4 లక్షలకు చేరింది. మెంబర్ షిప్ డ్రైవ్ ద్వారా స్కీంలకు అర్హత సాధించడంతోపాటు అప్పటి వరకు విడివిడిగా ఉన్న ముదిరాజ్లు సంఘటితం కావడానికి దోహదపడింది. ముదిరాజ్లకు రూ.1,000 కోట్ల బడ్జెట్ను ఐఎఫ్డీఎఫ్ పథకం ద్వారా కేటాయించి 75శాతం సబ్సిడీపై వలలతో పాటు టూవీలర్స్, ఫోర్ వీలర్స్, త్రీ వీలర్స్, ట్రాలీ తదితరాలను పంపిణి చేయడం జరిగింది.
జీవో.నెం.268/2021 ద్వారా గ్రామపంచాయతీ ఆధీనంలో ఉన్న చెరువులను మత్స్యశాఖ పరిధిలోకి తీసుకొచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం 2022లో జీవో నంబర్ 4ను తీసుకొచ్చి ముదిరాజ్ అనే పదాన్ని చేర్చి ముదిరాజ్ మత్స్యకారులకు మత్స్య సంపదపై పూర్తి హక్కులను కల్పించింది. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో నీటి వనరులు సమృద్ధిగా పెరిగి 6.5 లక్షల హెక్టార్లుగా ఉన్ననీటి వసతి కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ ద్వారా 7.76 లక్షల హెక్టార్లకు పెరిగింది. పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తయితే ఇంకో 50 వేల హెక్టార్ల నీటి వసతి అందుబాటులోకి వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ కాలం నుంచి ముదిరాజ్లకు ప్రాధాన్యమిస్తూ టికెట్లను కేటాయిస్తున్నది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈటల రాజేందర్కు కేబినేట్లో కీలకమైన ఆర్థికశాఖను ఇచ్చి ముదిరాజ్ల ఆత్మగౌరవాన్ని పెంచారు. డాక్టర్ బండా ప్రకాశ్ను సీఎం కేసీఆర్ 2018లో రాజ్యసభకు పంపించి డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా నియమించి గౌరవించారు. రాష్ట్ర రాజకీయాల్లో వచ్చిన మార్పు వల్ల 2021లో బండా ప్రకాశ్ను ఎమ్మెల్సీని చేసి మండలి డిప్యూటీ చైర్మన్గా నియమించారు. వీటితోపాటు ముదిరాజ్లకు ఆత్మగౌరవ భవనాలు, నామినేటెడ్ పదవులు ఇచ్చి ముదిరాజ్ల సంస్కృతి, సంప్రదాయాలను గుర్తించి జీవం పోశారు.
వివిధ రకాల స్కీంలు, రాజకీయ పదవులు, నామినేటెడ్ పోస్టుల ద్వారా ముదిరాజ్లకు ఆర్థికంగా, రాజకీయంగా ఎంతో తోడ్పాటునందించిన బీఆర్ఎస్ మరోసారి అధికారంలో కి రావాలి. ఎన్నికల్లో సీఎం కేసీఆర్ను, బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలి.
(వ్యాసకర్త : చైర్మన్, విద్యావంతుల వేదిక, తెలంగాణ ముదిరాజ్ మహసభ)
– సీహెచ్ దినేష్ కుమార్ 98490 50305