BRS | ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు అనుసరించిన విధానాలు తెలంగాణ వ్యవసాయాన్ని పూర్తిగా ధ్వంసం చేశాయి. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేసింది. సీఎం కేసీఆర్ సమర్థ పాలన వల్ల తొమ్మిదేండ్ల కాలంలోనే తెలంగాణ అనేక రంగాల్లో అద్భుత ఫలితాలు సాధించి దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అర్బన్ టాక్ను పటాపంచలు చేసి ముచ్చటగా మూడోసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించే దిశగా దూసుకెళ్తున్నది.
వ్యవసాయంలో చెరువుల ప్రాధాన్యం గుర్తించిన బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువుల్లో పూడిక తీసి వాటిని సాగుకు యోగ్యంగా మార్చింది. ఫలితంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడే నాటికి సాగు విస్తీర్ణం 1.34 కోట్ల ఎకరాలు ఉండగా అది నేడు 2.3 కోట్ల ఎకరాలకు పెరిగింది. దీనికి తోడు ఉద్యానవనాలు 11.50 లక్షల ఎకరాల్లో సాగవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ, సాగునీటి రంగ సమస్యలను తీర్చడం వల్ల వ్యవసాయోత్పత్తి పెరిగింది. 2014-15లో తెలంగాణలో ధాన్యం దిగుబడి 68 లక్షల టన్నులు ఉండగా, 2022-23 నాటికి అది 2.49 కోట్ల టన్నులకు పెరిగింది. 2014లో పత్తి సాగు 41.83 లక్షల ఎకరాలుండగా 2022 నాటికి 63.51 లక్షల ఎకరాలకు విస్తరించింది. అందుకే వ్యవసాయాన్ని పండుగ చేసిన కేసీఆర్ వెంట ఉంటామని రైతులు ఘంటాపథంగా చెప్తున్నారు. నెర్రెలు బారిన ఈ నేల దశాబ్దం లోపే 2 కోట్ల ఎకరాల పచ్చని మాగాణమైంది! ఇంతే కాక ఎన్నో అభివృద్ధి సూచికల్లో తెలంగాణ అగ్ర భాగాన నిలిచింది.
గత తొమ్మిదేండ్లలో తెలంగాణ గణనీయమైన ప్రగతిని సాధిస్తే కొందరు పనిగట్టుకొని చేసే ‘అర్బన్ టాక్’ అవాస్తవిక స్వభావం ఇప్పటికీ మారలేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ‘అర్బన్ టాక్’ పేరిట ఇక బీఆర్ఎస్ ఓటమి ఖాయమని తీర్మానించారు కొందరు. కాంగ్రెస్ వర్గాలు పోలింగ్ కన్నా ముందే సంబురాలు చేసుకుంటూ పదవుల పంపకాలు కూడా మొదలుపెట్టారు. తీరా ఫలితాలు వెలువడినపుడు బీఆర్ఎస్ సీట్లు 63 (2014) నుంచి 88కి పెరిగాయి. అర్బన్ టాక్ అనేది ఎంత నిరాధారమైనదో, కాంగ్రెస్ శ్రేణులు వాస్తవాలకు ఎలా దూరమై పగటి కలల్లో జీవిస్తున్నారో ఆ ఎన్నికల్లో తెలిసొచ్చింది. ఈ అర్బన్ టాక్ ప్రభావం 2018తో పోలిస్తే నేడు మరింత తగ్గింది. ఈ పరిధి బయట తెలంగాణ పరిస్థితి గురించి చెప్పనక్కర్లేదు.
రాష్ర్టానికి సమర్థ నాయకత్వం వహించగల నాయకుడెవరని పరిశీలిస్తే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో పోల్చగల నాయకులెవరూ ఇతర పార్టీల్లో కనిపించడం లేదు. నాయకత్వ బలం, ప్రసంగ ధాటి, విశ్వసనీయత, విషయ పరిజ్ఞానం, మెప్పించగల లక్షణం, పథకాలలో నవ్యత, పరిపాలనా సామర్థ్యం, తలపెట్టినవి సాధించటం, అమలుపరచటం, ధీశాలితనం – ఇట్లా ఏ విషయంలో చూసినా ఆయనకు సాటిరాగల నాయకులెవ్వరూ ప్రజలకు ఇతర పార్టీల్లో ఇప్పటికీ కనిపించడం లేదు.
మరోవైపు తన నాయకత్వ పటిమను, పరిపాలనా సామర్థ్యాన్ని నిరూపించుకుంటూ, నిరంతరం ఇంకేదో చెయ్యాలని తపించే డైనమిక్ మంత్రిగా కేటీఆర్ దూసుకెళుతున్నారు. ఆయన మరిన్ని ఉన్నత పదవులను అధిరోహిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ దేశంలోని యువతరం, సానుకూల రాజకీయాలను ప్రేమించే మేధావులు, పెట్టుబడిదారులు,
విద్యావంతులు ఆయన నుంచి ఇంకెంతో ఆశిస్తున్నారు.
హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీగా రూపాంతరం చెందుతూ లైఫ్ సైన్సెస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, ఏవియేషన్, మొబిలిటీ రంగాల్లో తనదైన ముద్ర వేస్తూ దూసుకుపోతున్నదంటే అందుకు కేటీఆర్ దార్శనిక నాయకత్వమే కారణం. ఐటీ రంగ ఎగుమతుల్లో తెలంగాణ దేశానికి కొత్త దిక్సూచిగా నిలిచింది. కొత్త రాష్ట్రంలో ఎదురైన సవాళ్లను బీఆర్ఎస్ ప్రభుత్వం ధైర్యంగా అధిగమించింది. దేశమే ఆశ్చర్యపడేలా గ్లోబల్ స్థాయిలో తీర్చిదిద్దిన టీ-హబ్ , వీ-హబ్, టీ-వర్క్స్ లాంటి ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ సెంటర్లు ఇప్పుడు సరికొత్త సంచలనం. దేశం, గ్లోబల్ స్థాయిలో సాధించిన విజయాలతో, తాను చేపడుతున్న కార్యక్రమాలతో కేటీఆర్ ఒక సెలబ్రిటీగా ఎదిగారనడంలో అతిశయోక్తి లేదు. ఇన్ని సానుకూలాంశాల మధ్య ప్రతిపక్షాలకు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ మాత్రం అధికారం దక్కే అవకాశమే లేదు. ఇప్పటికే తెలంగాణ సమాజం ప్రగతి సాధకులకే ఓటేయాలని తీర్మానించుకుంది. ఈ నేపథ్యంలో మళ్లీ రాబోయేది కేసీఆర్ సర్కారే అన్నది సుస్పష్టం!
– శ్రీధర్ గందె (వ్యాసకర్త: అధ్యక్షులు, బీఆర్ఎస్ స్విట్జర్లాండ్)