ఏ హక్కు కోసమైతే పోరాడి, ఎందరి త్యాగాలతో తెలంగాణను సాధించుకున్నామో, ఇప్పుడా హక్కును హరిస్తానంటే ఎట్ల చూస్తూ ఊరుకోగలం! ఎలా మౌనం వహిస్తాం! అందుకే మా బొగ్గు మాగ్గావాలె అంటున్నాం. సింగరేణికి 130 ఏండ్లు దాటాయి. మరో వందేండ్లకు పైగా ఉన్న భవిష్యత్తుకు ప్రమాదం వచ్చి పడింది. మళ్ళీ ఇప్పుడు సంస్థ అస్తిత్వం కోసం, ప్రభుత్వ రంగంలో నిలదొక్కు కోవడం కోసం యూనియన్లకు, రాజకీయ పార్టీలకు అతీతంగా పోరు బాట పట్టాల్సిన పరిస్థితి వచ్చింది.
ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడి కార్మికుల, అధికారుల సమష్టి కృషితో నిలదొక్కుకున్న ప్రభుత్వరంగ సంస్థ సింగరేణి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉత్పత్తి సాధనలో, టర్నోవర్లో, లాభాలు గడించడంలో, సొంతంగా 1200 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్ట్ నుంచి విద్యుత్ ఉత్పత్తిలో సింగరేణి దేశంలోనే నెంబర్ వన్గా నిలిచింది. కేంద్రం విధానాల వల్ల ప్రైవేటీకరణ ప్రమాదం ముంచుకొచ్చింది. ప్రైవేటుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న త్యాగధనుల నల్లనేల సింగరేణి.. ఇప్పుడు మా బొగ్గు బ్లాకులు మాకు కావాలని, భవిష్యత్తు తరాల కోసం ఆరాట పడుతున్నది. మా బొగ్గు మీద మాకు మాత్రమే హక్కు ఉన్నది.. తేరా జులుం క్యారే అంటూ కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ముందు వరుసలో నిలబడ్డారు. తెలంగాణ కోసం 42 రోజులు సమ్మె చేశారు. నోయిడా దాక సమ్మె ప్రభావం చూపారు. కేసీఆర్ అరెస్ట్కు స్పందించి విధులు బహిష్కరించారు. శ్రీకాంతా చారి ఆత్మహత్యకు స్పందించి తల్లడిల్లిపోయిన నేల ఇది. ఇప్పుడు తన భవిష్యత్తు కోసం పోరాడుతున్నది.
దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వరంగ సంస్థగా సింగరేణి ఆవిర్భవించింది. దేశానికి స్వాతంత్య్రం రాకముందు నుంచే సింగరేణి ప్రభుత్వ రంగం లో ఉన్నది. 1889లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభించిన సింగరేణికి 132 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్నది. రాష్ట్రం 51 శాతం.. కేంద్రం 49 శాతం వాటాతో సంస్థ పబ్లిక్ సెక్టార్గా ఉన్నది. 1990 దశకంలో రెండుసార్లు బీఐఎఫ్ఆర్లోకి వెళ్లి దాదాపు ఖాయిలా జాబితాలో పడి బయటకు వచ్చిన మొట్టమొదటి ప్రభుత్వ రంగసంస్థ సింగరేణి ఒక్కటే! 1998 నుంచి లాభాల్లోకి వచ్చింది. 2001-02 నుంచి కార్మికులకు తన లాభాల నుంచి వాటా బోనసును చెల్లిస్తూ వస్తున్నది. కార్మికులకు ఇన్కం ట్యాక్స్ మాఫీ చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అంటే అతిశయోక్తి కాదు. అయినా కేంద్రం స్పందన లేదు. కనీసం స్లాబ్ కూడా పెరగలేదు.
తెలంగాణ రాకముందు రూ.12 వేల కోట్ల టర్నోవర్ ఉండగా 118 శాతం వృద్ధ్దితో రూ.26 వేల కోట్ల టర్నోవర్ను సింగరేణి పెంచుకున్నది. 2019లోనే 325 శాతం వృద్ధితో రూ.1100 కోట్ల లాభాలను సంస్థ గడించింది. ఇంతటి వృద్ధి రేటును దేశంలోని ఏ ఇతర బొగ్గుసంస్థ కాని, ప్రభుత్వరంగ సంస్థ కాని సాధించిన దాఖలా లేదు. సింగరేణి చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డులతో సంస్థ దూసుకు వెళ్తున్నది. సింగరేణి మరో అడుగు ముందుకేసి ఇతర రాష్ర్టాల్లోనూ బొగ్గుగనులను తీసుకొని తవ్వకాలకు ఏర్పాట్లు చేసుకుంటున్నది. ఒడిశాలోని ‘నైనీ’ బొగ్గు బ్లాక్ను గతంలోనే తీసుకున్నది. ఈ గని నుంచి ఏటా 10 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నది. ‘నైనీ’ బొగ్గు బ్లాకు నుంచి ఇదే ఏడాదిలో ఉత్పత్తి ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.
సింగరేణి సొంతంగా మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద ఏర్పాటు చేసిన 1200ల మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంటు నుంచి రాష్ర్టానికి విద్యుత్తును అందిస్తూ 30 శాతం రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీరుస్తున్నది. దీనివల్ల సంస్థకు ప్రతి సంవత్సరం రూ.400 కోట్ల లాభాలు వస్తున్నాయి. సోలార్ విద్యుత్ రంగంలోనూ అడుగు పెట్టి 300 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఏర్పాట్లు చేస్తున్నది. ఇందులో ఇప్పటికే సగానికి పైగా సౌర విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. మరో 800 థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి రంగం సిద్ధం అయ్యింది. గడచిన ఆరేండ్లలో డిపెండెంటుతోపాటు ఇతరులకు మొత్తంగా 8 వేల మందికి ఉద్యోగాలను కల్పించింది. సింగరేణికి మరో 150 ఏండ్ల భవిష్యత్తు ఉన్నది.
అంతటి చరిత్ర ఉన్న సింగరేణి భవిష్యత్తును కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ పేరుతో కూల్చివేయాలని చూస్తున్నది. సింగరేణికి కొత్త బొగ్గుబ్లాకులు కేటాయించి ప్రోత్సహించాల్సిన కేంద్రం వేలంలో పాల్గొనాల్సిందేనని షరతు విధిస్తున్నది. బొగ్గు బ్లాకుల కోసం గతేడాది కార్మికులు సమ్మె కూడా చేశారు. పార్లమెంట్లో తెలంగాణ ఎంపీలు ప్రభుత్వాన్ని నిలదీశారు. అయినా కేంద్రం స్పందించడం లేదు. వాస్తవానికి సింగరేణి తెలంగాణకు గుండెకాయ లాంటిది. వేలాది మందికి భవిష్యత్తులో ఉపాధి కల్పించే తల్లిలాంటిది. అలాంటి ప్రభుత్వ రంగ సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నది.
మన బొగ్గు బ్లాక్లను మనం దక్కించుకోకుంటే సంస్థ భవిష్యత్తు ఇరకాటంలో పడుతుంది. గతేడాది రామగుండానికి ప్రధాని మోదీ వచ్చిన సందర్బంగా కార్మికుల నిరసనలు, అసంతృప్తిని దృష్టిలో పెట్టుకుని సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తి లేదన్నారు. కానీ బొగ్గు బ్లాకులను కేటాయించడాన్ని మాత్రం విస్మరించారు. తిరిగి ఇప్పుడు మళ్లీ ప్రధాని తెలంగాణకు వస్తున్నారు. ఈ క్రమంలో అన్ని కార్మిక సం ఘాలు నిరసనకు పిలుపునిచ్చాయి. కొత్త బొగ్గు బ్లాకుల వేలాన్ని నిలిపివేసి, వాటిని సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాయి.
– ఎండీ. మునీర్
99518 65223
(వ్యాసకర్త : సీనియర్ జర్నలిస్ట్, విశ్లేషకులు)