మన దేశంలో గవర్నర్లు వివాదాస్పదంగా వ్యవహరించడం కొత్తేమీ కాదు. ఏదో ఒక రాష్ట్రంలో గవర్నర్లు తరచూ వివాదాల్లో చిక్కుకోవటం మనం చూస్తూనే ఉన్నాం. కానీ, మొన్న తమిళనాడు గవర్నర్ తనంతట తానుగా ఒక మంత్రిని పదవి నుంచి తొలగించటం చాలా విస్మయాన్ని కలిగించే అంశం. ఇంతకుము నుపు ఇలాంటి సంఘటన ఏపీలో రామ్లాల్ గవర్నరుగా ఉన్న సమయంలో జరిగింది. దేశం విస్తుపోయింది రామ్లాల్ వ్యవహారశైలితో. పర్యవసానంగా సదరు రామ్లాల్ అత్యంత దయనీయ పరిస్థితిలో ఇంటిబాట పట్టవలసి వచ్చింది. మరణం తర్వాత గూడా అపకీర్తి వెంటాడుతుందనటానికి ఇదొక నిదర్శనం. ఇది ప్రజలకు అంతగా గుర్తుండకపోవచ్చు కానీ, కాదనలేని చారిత్రక సత్యం.
ఎక్కడైతే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీని విభేదించే పార్టీ అధికారంలో ఉంటుందో, అట్టి రాష్ర్టాల్లోని ప్రభుత్వాలతోనే గవర్నర్లు విభేదిస్తారు, వివాదాలు సృష్టిస్తారు. యూపీ, మధ్యప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ర్టాల్లో గవర్నర్కు ముఖ్యమంత్రికి ఎటువంటి విభేదాల్లేవు. అంతా సవ్యంగా సాగుతుంది ఈ రాష్ర్టాల్లో.
తమిళనాడు గవర్నర్ చర్య ఆలోచనాపరులైన పౌరులకు తీవ్ర ఆందోళన కలిగించే విషయం కూడా. గవర్నర్ తన ఇష్టారాజ్యంగా ప్రజల చేత ఎన్నుకోబడిన మంత్రులను పదవి నుంచి తొలగిస్తే, ఇక రాజ్యాంగ ప్రక్రియ అనే పదానికి అర్థం ఏమిటి? రాజ్యాంగాన్ని రక్షించటం ఎవరి బాధ్యత? ఈ వేళ మంత్రిని తొలగిస్తే, రేపు ముఖ్యమంత్రిని తొలగించరని ఏముంది? అసలు మంత్రులను గానీ, ముఖ్యమంత్రిని గానీ స్వీయ విచక్షణతో తొలగించే అధికారం గవర్నర్కు ఉందా? అలా అయితే ఇక అసెంబ్లీ ఎందుకు?
క్రియాశీల రాజకీయాల్లో వ్యవహరించిన వ్యక్తులను రాజ్భవన్లో కూర్చోబెడితే వారు హఠాత్తుగా మునులైపోతారా? చాలాకాలంగా గవర్నర్ల నియామకం రాజ్యాంగస్ఫూర్తికి భిన్నంగా జరుగుతూ ఉన్నది. రాజకీయాలకతీతంగా ఉండే మేధావులు, విద్యావంతులు మాజీ సైనికాధికారులు, మాజీ సివిల్ సర్వెంట్లు గవర్నర్లైతే రాజభవన్కు రావలసిన గౌరవం వస్తుంది. కానీ, వాస్తవంగా జరుగుతున్నదేమిటి? ఉదాహరణకు ఒక రాష్ట్రంలో రాజకీయపార్టీకి నేతగా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి మరో రాష్ట్రంలో గవర్నర్గా నియమించితే అటువంటి వ్యక్తులు ఏ విధంగా రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తారు? ఇది సాధ్యమేనా? ఇప్పుడున్న గవర్నర్లు చాలామంది క్రియాశీల రాజకీయ నేపథ్యం ఉన్నవారే. అంతేకాదు, కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయపార్టీకి చెందినవారే. అలాంటివారు హటాత్తుగా రాజకీయాలకు అతీతంగా ఎదగడం చాలా కష్టం. ఎందుకంటే గవర్నర్ పదవికి ఏ మాత్రం రాజ్యాంగ భద్రత లేదు. నియమించటానికి నియమం లేదు, తొలగించటానికి విధానం లేదు. కేంద్ర ప్రభుత్వ పెద్దలు కావాలనుకుంటే దారిన పోయే దానయ్యను గవర్నర్ను చేయవచ్చు, ఒక్క పెన్నుపోటుతో ఎంత పేరున్న గవర్నరునైనా ఇంటికి పంపించవచ్చు. అందువల్ల గవర్నర్లకు అభద్రతాభావం ఎక్కువ. అందుకే వారు కేంద్రంలో పెద్దల మన్ననలు పొందేవిధంగా వ్యవహరిస్తుంటారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒకే పార్టీ అధికారంలో ఉంటే, అట్టి రాష్ర్టాల్లో గవర్నర్కు మంత్రివర్గానికి మధ్య ఎటువంటి సమస్య లేదు. బీజేపీని వ్యతిరేకించే పార్టీలు అధికారంలో ఉన్న కేరళ, తమిళనాడు, తెలంగాణ, బెంగాల్, రాజస్థాన్ వంటి రాష్ర్టాల్లోనే గవర్నర్లకు రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య తరచూ వివాదాలు ముసురుతూ ఉంటాయి. ఇది కేవలం రాజకీయ కారణాల వల్లనే గానీ రాజ్యాంగ కారణాల వలన కాదు. ఈ దుష్ట సంస్కృతి ఈనాటిది కాదు. ఇది కాంగ్రెస్ హయాంలో ఊపిరి పోసుకున్నది. ఇప్పుడు బలపడింది. అంతే తేడా.
మన ప్రధాని మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజకీయ నేపథ్యం ఉన్నవారిని గవర్నర్లుగా నియమించరాదని కరాఖండిగా చెప్పారు. మరి వారే ప్రధాని అయిన తర్వాత రాజకీయ నేపథ్యం లేనివారిని ఎంతమందిని గవర్నర్లుగా నియమించారు? ఏటికి ఆవలి ఒడ్డున ఉన్నప్పుడు ఒక మాట, ఇవతల ఒడ్డున ఉన్నప్పుడు దానికి భిన్నమైన మాట మాట్లాడడం మన రాజకీయ నేతలకు పరిపాటి అయింది. ఈ నేపథ్యంలో రాజ్యాంగ విలువలను గురించి ఏ నేత అయినా మాట్లాడటం హాస్యాస్పదమే. తమిళనాడు విషయమే తీసుకుందాం. కేంద్ర హోంమంత్రి సలహామేరకు మంత్రి బర్తరఫ్ ఆదేశాన్ని నిలిపివేసినట్టు ప్రకటించారు గవర్నరు. అంటే ఆయన చర్య రాజ్యాంగబద్ధమేనా అన్న సందేహం ఉన్నట్టే కదా! అసలు సందేహాస్పదంగా ఉండే నిర్ణయం తీసుకునే అధికారం గవర్నర్కు రాజ్యాంగం కట్టబెట్టలేదు. రేపు అటార్నీ జనరల్ ఈ నిర్ణయం చెల్లుబాటు కాదని చెప్తేనో లేక కోర్టు ఈ నిర్ణయాన్ని కొట్టివేస్తేనో అప్పుడు గవర్నర్ పరిస్థితి ఏమిటి? ఆయన పదవిలో కొనసాగాలా లేక ఇంటికిపోవాలా? అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు కొనితెచ్చుకోవాలి? ఎంతకాలం ప్రజలు ఈ రామ్లాల్లను భరించాలి?
ఈ విపత్కర పరిస్థితిలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలు ప్రశాంతంగా తమ పని తాము చేసుకునిపోయే వాతావరణం ఉంటుం దా? ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఈ వింత పరిస్థితిని? వారు చోద్యం చూస్తూ ఉండవలసిందేనా? ఏదీ ఈ ప్రశ్నకు సమాధానం? ఈ దఫా గవర్నర్ రచ్చకు కర్ణాటక వేదికయ్యే అవకాశాన్ని కొట్టివేయలేం. హోరాహోరీగా సాగిన సమరంలో బీజేపీ ఓటమి పాలైంది. ప్రజా క్షేత్రంలో గెలుపొందిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ ప్రశాంతంగా పనిచేసుకోనిస్తుందనుకుంటే పప్పులో కాలు వేసినట్టే!
(వ్యాసకర్త: లోక్సభ సచివాలయంలో విశ్రాంత సంచాలకులు)
-గుమ్మడిదల రంగారావు