తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి నేటికి సరిగ్గా నెల. నాలుగు రోజులదేముందిగానీ, తెలంగాణలో కాంగ్రెస్ అధికారానికి కూడా నెలరోజులేనని అనుకోవచ్చు. నిజాయితీగా చెప్పాలంటే ఒక ప్రభుత్వ పనితీరును అంచనా వేయడానికి ఇది తక్కువ సమయమే. అదీగాక వాకిట్లో లోక్సభ ఎన్నికలు నిలబడ్డ తరుణంలో ఏ పార్టీ- ప్రభుత్వమైనా ఆచితూచి అడుగేయక తప్పదు. ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు, లోక్సభ ఎన్నికల షెడ్యూలు, ముందుగానే అంటే ఫిబ్రవరి ఆఖర్లోనే వస్తుందనే వార్త నిజంగా చలికాలంలో నిప్పుల నెగడు వంటిదే.
‘కోడ్’ ఎంత తొందరగా కూస్తే అంత మంచిదని కాంగ్రెస్ ముఖ్య నేతలు భావిస్తారనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేకపోవచ్చు. ఎందుకంటే గతంలోలాగా షెడ్యూలు మార్చి ఆఖర్లో వస్తే, అప్పటికి వంద రోజుల గడువు పూర్తవుతుంది. అంటే ఆలోగా ఆరు గ్యారెంటీలను అమలు చేయాల్సి ఉంటుంది. సాగుతున్న పరిణామాలను చూస్తే అది అసాధ్యంలా కనిపిస్తున్నది. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ అన్నట్టు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మాత్రమే నేర్చుకున్న రేవంత్, ఇప్పుడు జవాబు చెప్పాల్సిన పాత్రలోకి మారిపోయారు. రేవంత్ ఎంత తెలివైన నాయకుడైనప్పటికీ, గతంలో ఎప్పుడూ మంత్రి పదవి కూడా నిర్వహించిన అనుభవం లేనందున, అధికారిక వ్యవహారాలు చాలా కొత్తకొత్తగా అనిపిస్తాయి. వాటిలో కుదురుకోవడానికి, రోజువారీ విధి నిర్వహణకు అలవాటు పడటానికి, అధికారులతో, వారి వ్యవహారశైలితో సర్దుబాటు కావడానికి, అవగాహన చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది.
విమర్శించినంత తేలిక కాదు కదా విషయాన్ని అర్థం చేసుకోవడం! అదీగాక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కేసీఆర్,తెలంగాణను ఆకళింపు చేసుకున్న, ముఖ్యమంత్రిగా వేసిన ముద్రను కాదని, తన బ్రాండ్ చూపించడం అనుకున్నంత ఈజీ కాదు. తన సహజ స్వభావానికి భిన్నంగా, దూకుడుతనాన్ని, దుందుడుకు ధోరణిని ప్రస్తుతానికి పక్కనబెట్టి, అందరితో మంచి, ఆల్ ఈజ్ వెల్ అనిపించుకునే ప్రయత్నాల్లో పడ్డారు. ఎవరు అవునన్నా కాదన్నా, ఎన్నికలకు ముందు వరకు రేవంత్పై ఒక నెగిటివ్ ఇమేజ్ ఉందన్నది కాదనలేని నిజం. దీనికి తోడు వందేండ్ల కాలక్రమంలో అబ్బిన అవలక్షణాలు, ముద్రలు కాంగ్రెస్కు ఒక బ్యాగేజీగా మారాయి. అనైక్యత, అంతఃకలహాలు, తిరుగుబాట్లు కాంగ్రెస్ బ్రాండ్ ఇమేజ్గా పేరుమోసాయి. ఈ క్రమంలో మరీ అంత సెలబ్రేషన్ మూడ్లో ఏమీ తెలంగాణలో అధికారాన్ని చేపట్టలేదు కాంగ్రెస్.
నిజానికి బీఆర్ఎస్ ఓడిపోతుందని, కాంగ్రెస్ గెలుస్తుందని ఆ పార్టీవాళ్లలోనే సగం మంది నమ్మలేదు. నమ్మి ఉంటే సీనియర్ నేత, ముఖ్యమంత్రి యాస్పిరెంట్ జానారెడ్డి తాను పోటీ చేయకుండా కొడుకును నిలబెట్టేవారా! పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పార్టీని వీడి పోయేవారా! ‘ప్రజలు ఓడించలేదు, కేసీఆర్ను కేసీఆరే ఓడించుకున్నడు. కాంగ్రెస్ను ప్రజలు కాదు; కేసీఆరే గెలిపించిండు’ వంటి ఈక్వేషన్స్ని కొంచెంసేపు పక్కనబెడితే, కాంగ్రెస్ తరహా రాజకీయాలకు, ప్రభుత్వ అధికారిక వ్యవహారాలకు కొత్త అయిన రేవంత్, అటు పార్టీపరంగాను, ఇటు ప్రభుత్వపరంగాను ప్రస్తుతానికి బ్యాలెన్సింగ్ యాక్ట్ను నమ్ముకున్నట్టు కనిపిస్తున్నది. అసెంబ్లీలో అయినా, బయట అయినా అవసరానికి మించి, సహచర మంత్రులను పదేపదే ఒకటికి నాలుగుసార్లు ప్రశంసించడం, ముఖ్యమంత్రి స్థాయిని కొంచెం తగ్గించి చూపుతున్నట్టుగా కనిపిస్తున్నది.
అసెంబ్లీలో కాంగ్రెస్కు తక్కువ మెజారిటీ, కేవలం ఐదు సీట్ల ఆధిక్యమే ఉన్న తరుణంలో, తాను అందరినీ కలుపుకొని పోవడానికి ప్రయత్నిస్తున్నట్టు చాటిచెప్పడం ముఖ్యమంత్రి ఉద్దేశం అయి ఉండవచ్చు. అంపశయ్యపై ఉన్న కాంగ్రెస్ను రేవంత్ ఒంటిచేత్తో లేపి నిలబెట్టారన్న వాదన ఒకటున్నా, దీన్ని కాంగ్రెస్లో తొలి నుంచీ ఉన్న సీనియర్లలో ఎందరు మనస్ఫూర్తిగా ఆమోదిస్తారన్నది సందేహమే! ముఖ్యమంత్రి ఎంపిక సమయంలో, దాదాపు అయిదారుగురు సీనియర్లు ఆ పదవికి పోటీపడటమే ఇందుకు నిదర్శనం. ఢిల్లీ పరిశీలకుల అభిప్రాయ సేకరణలో ఎక్కువమంది ఎమ్మెల్యేలు రేవంత్కు మద్దతు పలకడం వల్ల, తప్పనిసరి పరిస్థితిలో సీనియర్లు తగ్గి ఉంటున్నారే తప్ప, దానర్థం అస్త్ర సన్యాసం చేశారని కాదు! తాను అందరినీ కలుపుకొని పోతున్నట్టు రేవంత్ ఎన్ని సంకేతాలు పంపుతున్నా, మిగతా మంత్రుల వ్యవహార శైలి అంత సానుకూలంగా ఏమీ ఉన్నట్టు లేదు.
ప్రజాపాలన దరఖాస్తు ఆవిష్కరణ సమయంలో రేవంత్ సుదీర్ఘ ఉపన్యాసంతో చిరాకు పడ్డ ఒక సీనియర్ మంత్రి, ఇంకెంతసేపు అన్నట్టుగా మిగతా మంత్రులకు చేసిన సైగల్ని ఆ సమావేశాన్ని కవర్ చేసిన జర్నలిస్టులు గుర్తించారు. కలెక్టర్ల సదస్సులో, ప్రజా పాలన దరఖాస్తు నమూనా, ప్రజల నుంచి సేకరించే ప్రక్రియ సమగ్రంగా లేవని గుర్తించిన సీనియర్ అధికారులు కొందరు ఆదే విషయాన్ని కీలక మంత్రుల దృష్టికి తీసుకువెళ్తే, అంతా ఆయనే నడిపిస్తున్నాడుగా, నడిపించనీయండి చూద్దాం అన్న ధోరణిలో నిరాసక్తంగా స్పందించడం గమనార్హం. రేవంత్ తర్వాత తనకే ఎక్కువమంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని భావిస్తున్న ‘బలమైన’ నాయకుడు ఒకరు తనకు తగినంత ప్రాధాన్యం లభించడం లేదనే అసంతృప్తితో ఉన్నట్టు చెప్తున్నారు.
రేవంత్ను సీఎం చేయడానికి అంగీకరించే సందర్భంలో సీనియర్లు మంత్రి పదవులతో పాటు కీలక శాఖలను ఆశించారు. వ్యూహాత్మక కారణాల వల్లనో, రాజకీయపు లెక్కలతోనో రేవంత్, ఆశించిన వారికి ఆశించిన శాఖలన్నీ దక్కకుండా ముందు జాగ్రత్త పడగలిగారు. పార్టీలో సీనియారిటీ, రాజకీయ అనుభవం, అధికారిక పదవుల నిర్వహణ, విషయ అవగాహన వంటి ప్రాతిపదికల్లో దేనిబట్టి చూసినా రేవంత్కంటే సీనియర్లు కాంగ్రెస్లో చాలా మంది ఉన్నారు. రేవంత్ను తమ నాయకుడిగా అంగీకరించడానికి వారికి ఎంత సమయం పడుతుందనేది ఒక ప్రశ్న. రేవంత్ వారి ఆమోదాన్ని సాధించగలుగుతారా? లేక వారే రేవంత్పై పైచేయి సాధిస్తారా? అన్నదానికి కాలమే జవాబు చెప్తుంది. ఒకవేళ రేవంత్కు మున్ముందు సీనియర్ల సహకారం, ఆమోదం కరువైతే ఏకాభిప్రాయ అభ్యర్థిగా రంగంలోకి దిగడానికి, ఎమ్మెల్యే కాని ఒక పెద్దాయన అప్పుడే ఎత్తుగడలు మొదలుపెట్టినట్టు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
రేపటి ప్రమాదాన్ని ముందే ఊహించి కావచ్చు; రేవంత్ ఒకవైపు అందరివాడుగా ఉన్నట్టు మాట్లాడుతూనే, మరోవైపు త్రాసును బ్యాలెన్స్ చేసే పనినీ మొదలుపెట్టారు. మున్ముందు తన పదవికి పోటీ వచ్చే అవకాశమున్న నల్లగొండ నేత ఒకరిని న్యూట్రలైజ్ చేసేందుకు, ఆ జిల్లాకే చెందిన మరొక ఫైర్బ్రాండ్ని కావాలని ప్రోత్సహిస్తున్నట్టు పార్టీలో చర్చ సాగుతున్నది. అట్లాగే ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నేతకు పోటీగా, ఆ జిల్లాకే చెందిన మరొక ముఖ్యుడిని ప్రోత్సహిస్తున్నట్టు వినవస్తున్నది.
అవసరానికి మించిన ప్రజాస్వామ్యం అలవాటైన కాంగ్రెస్ లక్షణాన్ని గుర్తించిన రేవంత్, అంతగా ప్రమాదకరం కాని మంత్రులకు, విధి నిర్వహణలో పూర్తి స్వేచ్ఛనిస్తూ వారిని తన విధేయులుగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తున్నది. పదవి కోసం ఎవరైనా తనను కలిస్తే, వారికి హామీ ఇవ్వడంతో పాటు, సదరు మంత్రిని కలిసి విన్నవించుకోవాల్సిందిగా ఆయన తప్పనిసరిగా సూచిస్తున్నారు. కొందరు మంత్రులు నిరాసక్తంగా ఉండటం, మరికొందరు ‘మా ముఖ్యమంత్రి చెప్పినట్టు, మా ముఖ్యమంత్రి సారథ్యంలో’ అని అనడం రేవంత్ ఎత్తుగడలకు నిదర్శనమనే మాట వినిపిస్తున్నది.
మొండి గుర్రంలాంటి పార్టీని చేతుల్లోకి తెచ్చుకునేందుకు ఒకవైపు ప్రయత్నిస్తూనే మరోవైపు పాలనపై పట్టు సాధించేందుకు ప్రధానంగా అధికారులపై రేవంత్ ఆధారపడుతున్నారు. ‘మీ శాఖపై నాకన్నా మీకే ఎక్కువ అవగాహన ఉంటుంది. మీరే నాకు మార్గనిర్దేశం చేయాలి, ఉన్నది ఉన్నట్టుగా, తప్పును తప్పుగా నాకు చెప్పండి, నేనేమీ అనుకోను’ అని ముఖ్యమంత్రి దాదాపు ప్రతి సమావేశంలో సీనియర్ అధికారుల నుంచి సలహాలు అడుగుతున్నారు.
మొత్తం సమాచారాన్ని తీసుకుని, విశ్లేషించుకుని, సమగ్ర నిర్ణయం తీసుకునే పద్ధతిలో కాకుండా.. కట్టె, కొట్టె, తెచ్చె పద్ధతిలో, తనకు కావాల్సిన సమాచారం లభిస్తే చాలన్నట్టుగా సమీక్షా సమావేశాల్లో సీఎం ధోరణి ఉంటున్నదని, దీనివల్ల నిర్ణయాలు తీసుకునే క్రమంలో తప్పులు జరగడానికి ఆస్కారం ఉందనీ చెప్తున్నారు. ఈ క్రమంలోనే కావచ్చు, కొంత తడబాటు కూడా కనిపిస్తున్నది. అరకొరగా శ్వేతపత్రాల రూపకల్పన- అసెంబ్లీలో చర్చ అనేది కాంగ్రెస్కన్నా బీఆర్ఎస్ తన వాదనను మరోసారి గట్టిగా చెప్పేందుకు దోహదపడిందనీ, ప్రభుత్వ ముఖ్యులు విషయ అవగాహన సాధించకముందే చర్చకు దిగడం వ్యూహ రాహిత్యమని పార్టీలో చర్చ నడుస్తున్నది. కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యిలా ఉన్న పదేండ్ల తెలంగాణలో శ్వేతపత్రాల రూపకల్పనకే కాంగ్రెస్ ఇంతగా కష్టపడితే, మరి పదేండ్ల కిందట కొత్త రాష్ర్టాన్ని అర్థం చేసుకుని ఒక దారిలో పెట్టడానికి కేసీఆర్ ఎంత కష్టపడి ఉంటారన్నది కీలక అంశం.
క్షేత్రస్థాయి వాస్తవాలకు విరుద్ధంగా తుమ్మిడిహట్టిని మళ్లీ కట్టాలనుకోవడం, రైతు బంధు ఇస్తున్నామని చెప్పి కొందరికే వేసి ఆపేయడం, రాయదుర్గం- ఎయిర్పోర్టు మెట్రో రద్దు అని ఒక్కసారి, రద్దు చేయలేదని మరోసారి చెప్పిన సీఎం చివరికి ప్రాజెక్ట్ను తాత్కాలికంగా అటకెక్కిం చినట్టు అధికారికంగా ప్రకటించారు. నిరుద్యోగులకు భృతి పై ప్రియాంకతో హామీ ఇప్పించి, మ్యానిఫెస్టోలో పెట్టి కూడా అసెంబ్లీ సాక్షిగా లేదనడం, ధరణిని రద్దు చేస్తామని చెప్పి ఇప్పుడు మార్పులు మాత్రమే చాలనడం… ఇలా కీలక విషయాల్లో సైతం ప్రభుత్వంలో ఉన్న ముఖ్యుల నుంచి తలకొకరకమైన, తడవకోరకమైన, పరస్పర విరుద్ధమైన ప్రకటనలు వెలువడుతున్నాయి.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కో అంశంపై గంటల తరబడి జరిగిన లోతైన చర్చల్లో పాల్గొన్న అధికారులు ప్రస్తుత సమావేశాలను దాంతో పోల్చి చూసుకుంటున్నారు. ‘కేసీఆర్ సబ్జెక్ట్ ముందు, డెప్త్ ముందు మేం మాట్లాడలేకపోయేవాళ్లం. ఇప్పుడు మాట్లాడగలుగుతున్నాం’ అని కొందరు సంబురపడుతున్నప్పటికీ, సీనియర్ అధికారుల్లో మాత్రం ప్రస్తుత సమీక్షలు ఆశించినంత లోతుగా ఉండటం లేదనే అభిప్రాయమే వినిపిస్తున్నది.
టీఎస్పీఎస్సీ బోర్డు నుంచి రాజీనామాలు తీసుకోవడంలో ఉన్న తొందర, కొత్త బోర్డును వేయడంలోగానీ, పరీక్షలు నిర్వహించడంలోగానీ, పూర్తయిన వాటి ఫలితాలను ప్రకటించడంలోగానీ లేదు. కలెక్టర్ల బదిలీని సమగ్రంగా పూర్తి చేయకుండానే ప్రజా పాలనపై కలెక్టర్ల సదస్సు నిర్వహించడం, ఒకవైపు కలెక్టర్ల సదస్సు జరుగుతూ ఉండగానే కలెక్టర్లను బదిలీ చేయడం, నెల రోజులు గడిచినా ఇప్పటికీ తనదైన బ్యూరోక్రాటిక్ టీమ్ను ఏర్పాటు చేసుకోలేకపోవడం మరొక లోపంగా కనిపిస్తున్నదంటున్నారు. ప్రభుత్వానికి ముఖ్యమంత్రి ఒక ఫేస్ అయితే, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ మరో మూడు ముఖాలు. సాధారణంగా కొత్త ముఖ్యమంత్రి ఎవరైనా, బాధ్యతలు చేపట్టిన వెంటనే తనకు నచ్చిన ఇంటెలిజెన్స్ చీఫ్ని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, డీజీపీని నియమించుకుని, తర్వాత బ్యూరోక్రాటిక్ టీమ్ రూపకల్పనలో పడతారు.
కానీ రేవంత్ ప్రభుత్వం అందుకు భిన్నంగా కింది స్థాయి అధికారుల బదిలీలను ముందు చేయడం అవగాహన లేమిలా కనిపిస్తున్నదని అంటున్నారు. సమర్థులైన అధికారులు కొరవడటం, ఉన్న సీనియర్లను పక్కకు జరిపితే ప్రభుత్వ వ్యవహారాలపై పూర్తి సమాచారం, పట్టు రాదేమోనన్న అనుమానం అందుకు కారణం కావచ్చు. బ్యూరోక్రాటిక్ రీ ఆర్గనైజేషన్ పూర్తిస్థాయిలో జరగకపోవడంతో పైనుంచి కిందిదాకా అధికారుల్లో ఒకరకమైన నిర్లిప్తత ఏర్పడింది. తాము ఉన్న చోట ఉంటామో లేదో అన్న సంశయంతో వారు పూర్తి బాధ్యత తీసుకోవడానికి జంకి, మొక్కుబడిగా పనిచేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు మొదలుకుని, ప్రజాపాలనను పర్యవేక్షిస్తున్న కలెక్టర్ల దాకా ఇదే స్థితి.
అసెంబ్లీలోనైనా, అధికారిక సమీక్షల్లో అయినా రేవంత్ ఉపన్యాసం ఇంకా రాజకీయ ప్రసంగంలాగే ఉంటున్నదని, డ్రెస్సింగ్, భాష, సబ్జెక్టుల్లో ఆయన ఇంకా ముఖ్యమంత్రి స్థాయిని అందిపుచ్చుకోలేదనే అభిప్రాయాలు పాత్రికేయ,
అధికారిక వర్గాల్లోనే కాదు, సామాన్యుల నుంచి కూడా వ్యక్తమవుతున్నాయి.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కో అంశంపై గంటల తరబడి జరిగిన లోతైన చర్చల్లో పాల్గొన్న అధికారులు ప్రస్తుత సమావేశాలను దాంతో పోల్చి చూసుకుంటున్నారు. ‘కేసీఆర్ సబ్జెక్ట్ ముందు, డెప్త్ ముందు మేం మాట్లాడలేకపోయేవాళ్లం. ఇప్పుడు మాట్లాడగలుగుతున్నాం’ అని కొందరు సంబురపడుతున్నప్పటికీ, సీనియర్ అధికారుల్లో మాత్రం ప్రస్తుత సమీక్షలు ఆశించినంత లోతుగా ఉండటం లేదనే అభిప్రాయమే వినిపిస్తున్నది. ప్రస్తుతానికి రేవంత్ కొత్త పాత్రలో కుదురుకునే పనిలో ఉన్నారు. పార్టీలో వివాదరహితుడిగా, కొత్త సమస్యలు తలెత్తకుండా, ఇమేజ్ మేకోవర్ కోసం ప్రయత్నిస్తున్నారు. మరీ సృజనాత్మక ధోరణిలో (ఇన్నోవేటివ్గా) కాకుండా, కొంతకాలం పాటు బండి నడిపించే పనిలో ఆయన ఉన్నట్టు కనిపిస్తున్నది.
ప్రస్తుతానికి ఆయన ‘కేసీఆర్ చేసిన తప్పులు తాను చేయకూడదనే’ ఏకైక లక్ష్యంతో పని చేస్తున్నారు కనుక రెప్లికేట్ అవుతారు తప్ప, అంతగా కొత్తదనమేమీ ఉండటం లేదు. కక్ష సాధింపు ఉండదని మాటల్లో చెప్తున్నప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి వెలువడినవన్నీ ప్రతీకారాత్మక (రెస్పాన్సివ్), ప్రతీకాత్మక (సింబాలిక్) చర్యలు మాత్రమే. నా అంచనా ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇప్పుడు పెద్ద సంకటంలో చిక్కుకుని ఉండి ఉంటారు. అది పూర్తి బడ్జెట్ పెట్టాలా? ఓటాన్ అకౌంటా? నిజాలను ఇప్పుడే చెప్పా ల్నా? లేక కొంతకాలం వాయిదా వేయాల్నా? పూర్తి బడ్జెట్ పెడితే ఆరు గ్యారెంటీలకు అందులో కేటాయింపులు చూపించాల్సి వస్తుంది.
ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చిన స్థాయిలో గ్యారెంటీలను అమలు చేయడం తెలంగాణ బడ్జెట్ పరిధిలో దాదాపు అసాధ్యం. కరెంటు మీటర్లపై కేంద్రం షరతులకు కూడా ఒప్పుకొని 0.5 ఎఫ్ఆర్బీఎంను అదనంగా తెచ్చుకోవడం తప్ప కాంగ్రెస్కు మరో గత్యంతరం లేదు. అయినా గండం గట్టెక్కేది అనుమానమే. అలాగని గ్యారెంటీలకు పరిమితులు విధిస్తే లోక్సభ ఎన్నికల్లో ప్రజాగ్రహం ఎదురుకావచ్చు. వంద రోజులకు మించి సాగదీస్తే హనీమూన్ పీరియడ్ ఆశాభంగమైపోవచ్చు. అటూ ఇటూ కాకుండా అబద్ధం చెప్పి కాలం గడిపితే అది పోనుపోనూ మరిన్ని అబద్ధాలకు కారణం కావచ్చు.
‘ఆరు గ్యారెంటీలను ఇంతవరకు మాత్రమే అమలు చేయగలం అనే నిజమా? అటూ ఇటూ చెప్పకుండా సాగదీతా?’ అనే రెంటిలో ఏదో ఒకదాన్ని ముఖ్యమంత్రి రేవంత్ కొద్ది రోజుల్లో ఎంచుకోక తప్పదేమో! ఎందుకంటే పాలిటిక్స్ని ఎంతకాలమైనా ఎమోషన్స్తో నడిపించవచ్చు. కానీ పరిపాలనకు మాత్రం ఫలితాలే గీటురాయి!!
– తిగుళ్ల కృష్ణమూర్తి