ఆరు దశాబ్దాల పాటు మన తెలంగాణ.. సమైక్య పాలనలో అరిగోస పడ్డది. నిండు శాసనసభలో తాము పుట్టిన గడ్డ పేరు కూడా చెప్పుకోలేని దుస్థితిని తెలంగాణ బిడ్డలు అనుభవించారు. ఆత్మగౌరవం అవమానానికి గురైంది. అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతున్నదని.. ఎదిరించిన ప్రజల్ని పాలకులు బెదిరించారు. నిలదీస్తే నిండు ప్రాణాలు తీశారు. పోరాడితే తుపాకులతో కాల్చి చంపారు, పొట్టనబెట్టుకున్నారు.
దశాబ్దాల తెలంగాణ తల్లి బానిస సంకెళ్లు తెంచేందుకు.. ఈ గడ్డపై ఓ ధిక్కార స్వరం వినిపించింది. ఓ వేగుచుక్క ఆశాజ్యోతిని వెలిగించింది. ఆ ధిక్కార స్వరం, ఆశాజ్యోతి మరెవరో కాదు, తెలంగాణ కోసం బరిగీసి నిలిచి కొట్లాడిన ఉద్యమ వీరుడు కే చంద్రశేఖర్రావు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది ఓ స్వప్నంగా మిగిలిపోయిన దశలో ఇది ఆరని జ్వాల.. ఒడువని ముచ్చట అంటూ కేసీఆర్ ప్రజాచైతన్యం కలిగించారు. కేంద్రం మెడలు వంచి, చిరకాల స్వప్నాన్ని సాకారం చేశారు.
ప్రత్యేక రాష్ట్రం సాధించిన తర్వాత కూడా సమైక్యవాదుల కుట్రలు కొనసాగుతాయని కేసీఆర్ ముందే గ్రహించారు. తెలంగాణ రాష్ట్రం విఫల ప్రయోగం అని చాటేందుకు తెలంగాణ శత్రువు చంద్రబాబు చేసిన కుట్రలను రాజకీయ వ్యూహ చతురతతో తిప్పికొట్టారు. సాఫీగా సాగుతున్న దశలో తెలంగాణకు కాంగ్రెస్ రూపంలో పెను విపత్తు వచ్చింది. పదేండ్ల పాలన ముగించుకుని పరుగులు పెట్టాల్సిన తెలంగాణ.. ఈనగాచి నక్కల పాలైన చందంగా కాంగ్రెస్ పాలకుల చేతికి చిక్కింది. అలవిగాని హామీలతో అరచేతిలో వైకుంఠం చూపించిన కాంగ్రెస్.. ప్రజల్ని మాయ చేసి అధికారాన్ని దక్కించుకుంది.
సమైక్య పాలనలో కుదేలైన రంగాలన్నీ ప్రత్యేక రాష్ట్రంలో శక్తిని కూడదీసుకుని, నడక మొదలు పెట్టాయి. అభివృద్ధి పరుగుల బాట పట్టే సమయంలో కాంగ్రెస్ నాయకుల కళ్లల్లో మంటపుట్టింది. కదులుతున్న తెలంగాణ కాళ్లల్లో కట్టె పెట్టినట్టు కాంగ్రెస్ అధికారం చేపట్టింది. తెలంగాణను మళ్లీ సంక్షోభ చెరలో బంధించింది. కాంగ్రెస్ నేతలు జనాన్ని నమ్మించి ముంచిన్రు.. ద్రోహం చేసిన్రు. తెలంగాణ జనం బతుకులతో చెలగాటమాడుతున్రు. ఆశపడ్డ జనం.. ఇప్పుడు గోస పడుతున్రు. కాంగ్రెస్ ప్రజాకంటక పాలనలో రైతుబంధు రాలేదు. రైతుల పంటలు చేతికందలేదు. కల్యాణలక్ష్మి ఇయ్యకపాయె. తులం బంగారం ఏడపాయె? రుణమాఫీ ఏమాయె? మహిళలకు నెలకు రూ.2500 ఊసే లేదు.
కాంగ్రెస్ ప్రజాపాలనలో రైతుబంధు అడిగితే చెప్పుతో కొడుతామని మంత్రులు అంటున్నారు. పథకాలు ఏమయ్యాయని విలేకర్లు, ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తుంటే.. ‘పేగులు తెంపి మెడలేసుకుంటా.. కనుగుడ్లు పీకి గోటీలాడుకుంటా’ అని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారు. మీడియా ప్రతినిధుల్ని ‘గాడిద కొడుకులు’ అని తిట్టి.. ప్రశ్నించే గొంతుకలను ‘పండవెట్టి తొక్కుతా’నని బెదిరిస్తూ రేవంత్రెడ్డి తన అసలైన నైజాన్ని బయటపెట్టుకున్నారు. కాంగ్రెస్ పాలకులు తమను నమ్మించి ముంచిన్రని తెలుసుకున్న ప్రజలు ఇప్పుడు గుండెలు బాదుకుంటున్నారు. అందుకే గొంతెండిన తెలంగాణ రోడ్డెక్కి కాంగ్రెస్పై గొడవ చేస్తున్నది.
ప్రజల కోసమే పోరాటం.. తెలంగాణ కోసమే ఆరాటంగా మరో ఉద్యమానికి సిద్ధమయ్యారు కేసీఆర్. తెలంగాణ ఆగమవుతుంటే చూస్తూ ఊరుకోనంటూ నినదిస్తున్నారు. ‘కొట్లాట కొత్త గాదు.. తెలంగాణ ఓడిపోదు’ అంటూ ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే ప్రభుత్వాన్ని నిలదీసే ప్రతిపక్ష బీఆర్ఎస్కు చైతన్యవంతమైన తెలంగాణ అండగా నిలవాలి.
హక్కుల కోసం గొంతెత్తుతున్న ప్రజల్ని పండవెట్టి తొక్కుతామంటున్న కాంగ్రెస్ నేతలు.. ప్రశ్నించే బలమైన గొంతుకలు లేకపోతే అన్నంతపని చేసినా చేస్తారు. ఇది కీలకమైన సమయం. మరోసారి మోసపోవద్దు. నవ్వేటోళ్ల ముందు జారిపడొద్దు. తెలంగాణను బాగు చేసుకునే మహాయజ్ఞం ఇంకా ముగిసిపోలేదు. రాష్ర్టాన్ని సుభిక్షం చేసుకోవడంలో ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది. అందుకు సరైన నేత కేసీఆర్ నాయకత్వానికి ప్రజలు మద్దతుగా నిలవాలి. పేదల కోసం కొట్లాడుతున్న తెలంగాణ పెద్ద దిక్కుకు కొండంత అండగా నిలవాలి. ఇది ఎడ్డి తెలంగాణ కాదని చాటి చెప్పాలి. ‘నమ్మిస్తే నమ్ముతాం కానీ.. నమ్మకద్రోహం చేస్తే ఊరుకోం’ అని ఓటుతో దీటైన సమాధానం ఇవ్వాలి.
సమైక్య నిర్బంధాన్ని అధిగమించిన తెలంగాణ.. నిత్య చైతన్యశీలిగా మారింది. కష్టాల కడలి నుంచి బయటపడ్డ తెలంగాణ.. అభివృద్ధి బాటలో మరెన్నో మైలురాళ్లు దాటాల్సి ఉంది. మన కోసం మనం రాసుకునే అద్భుత చరిత్ర మిగిలే ఉంది. ఇది ఆరని జ్వాల.. ఒడువని ముచ్చట.
జై తెలంగాణ.. జాగో తెలంగాణ!
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
ఇనుగుర్తి సత్యనారాయణ
97046 17343