‘ఏం సంగతి తమ్మీ..ఏం నడుస్తున్నది రాష్ట్రంల..?’ అని ఖమ్మం సభ అయిపోయినంక ఓ పెద్దమనిషి అడిగితే ఇట్లా నాకు తోచింది జెప్పిన.
‘కొన్నెల్ల సంది రాష్ట్రంల కేసీఆర్, బీఆర్ఎస్ మీదనే చర్చ నడుస్తున్నది. ఖమ్మంల జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభగ్గూడ మస్తుమందే జనాలొచ్చిర్రు. ‘టీఆర్ఎస్’ను ‘బీఆర్ఎస్’గా మార్చాలనే కేసీఆర్ ఉపాయం మంచిదే. ఇగ ఆ పార్టీ విజయవంతమైనట్టే లెక్క..’
‘రాష్ట్రంల ఉన్నది బీఆర్ఎస్ సర్కారే. కేసీఆర్ అంటే తెలంగాణ ప్రజలకు మస్తిట్టం. ఆయన మాటలినాల్నని అందరికుంటది. అంతేగనీ, ఖమ్మం సభను జూసి నువ్వెట్ల బీఆర్ఎస్ విజయవంతమైనట్టు లెక్కగడ్తవ్, ఒక్క మన తెలంగాణలొస్తే సాలా? వేరే రాష్ట్రంల గూడ ఇట్లనే అస్తరనుకుంటున్నవా?’ అని ఉల్టా నాకే సవాలేసిండు.
శుక్లారం మజ్జాన్నం ఒంటిగంటకు ఇంత సల్లవడినంక బైలెల్లింది మా కారు. సంగారెడ్డి నుంచి మొదలైన ఆరు లైన్ల రోడ్డు డెగ్లూర్ల తెగిపోయింది. డెగ్లూర్ అంటే ఇగ మేం మహారాష్ట్రల ఎంటరైనట్టే లెక్క. సంగారెడ్డి నుంచి నల్లటి రోడ్లు… ఆ రోడ్డుకు రెండు దిక్కుల పచ్చటి చెట్లను జూస్కుంట సంబురంగా ఆడుతూ.. పాడుతూ తొంభై, వంద స్పీడు మీద గొట్టిన డ్రైవర్ మాంజా డెగ్లూరుకు వొయ్యేసరికి డీలా అయిండు. డీలా అయిండంటే కారు నడిపి యాష్టకొచ్చి గాదు. డెగ్లూర్ నుంచి నాందేడ్కు వొయ్యేదాన్క ఉన్న డబుల్ రోడ్డును జూసేసరికే మాంజా సంతోషం సగం సచ్చిపోయింది. నాందేడ్కు జేరేసరికి నాత్రి ఎనిమిదిన్నరగొట్టింది.
నాందేడ్ పట్నం, డెగ్లూర్ నాఖా చౌరస్తా… మస్తుమందే కనవడ్తున్నరు. ఏమైందో సూద్దామని కారు దిగిన. నాత్రి తొమ్మిది గంటలకు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభిస్తున్నరని తెలిసింది ఆడికి వోయినంక. కండువాలు కప్పుకొని ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు (మరాఠాలు) చేతుల్ల థౌజెండ్, దో థౌజెండ్ వాలాలు పట్టుకొని ఆత్రంగా ఎదురుజూస్తున్నరు. వాళ్ల సంబురాన్ని జూస్తుంటే నాగ్గూడ అక్కన్నుంచి రాబుద్దిగాలె. కొంచెం సేపు ఆన్నే ఉన్న. ఓ పది నిమిషాల తర్వాత బీఆర్ఎస్ నాయకుడు సర్దార్ రవీందర్సింగ్ అచ్చిండు. ఆయన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిండో లేదో… నాఖా చౌరస్తా(పెద్దది)ల ఐదు నిమిషాల పాటు ట్రాఫిక్ను ఎక్కడికక్కడ ఆపేసి కార్యకర్తలు సీటీలు కొట్టుకుంట, పటాకలు కాల్శిర్రు. వాళ్ల సంబురాన్ని జూస్తే నాగ్గూడ సీటి గొట్టబుద్దయింది.
నాఖా చౌరస్తా కాన్నుంచి గురుద్వార నాలుగైదు కిలోమీటర్లుంటది. సిక్కుల చివరి గురువు ‘గురు గోవింద్ సింగ్’ సమాధిని సిక్కులు అత్యంత పవిత్రమైన స్థలంగా ఆరాధిస్తరు. ఐతారం నాడు బీఆర్ఎస్ బహిరంగ సభ ఇక్కన్నే జరుగుతది. శుక్లారం నాత్రి గురుద్వారకు వొయ్యేసరికి మీటింగ్కు ఏర్పాట్లు పెద్ద ఎత్తున జరుగుతున్నయి. రేప్పొద్దునొద్దాం తీ అని ఆన్నుంచి ఓ హోటల్కు వొయి ఓ నిర్ద దీసినం. శనారం పొద్దుగాల్ల లేసి నాఖా చౌరస్తాల నాస్తా జేసి మళ్లా గురుద్వారకు వొయ్యేసరికి పొద్దుగాల్ల పదిగొట్టింది. ఓ దిక్కు పనులు ఫాస్టుగయితున్నయి. ఇంకో దిక్కు మేం గూసున్నం.
గోపాల్ కదం: ఈయన స్థానిక బీజేపీ నాయకుడే కానీ… బీఆర్ఎస్ బహిరంగ సభ కోసం జరుగుతున్న ఏర్పాట్లను సూడటానికి ఆత్రంగా అక్కడికొచ్చిండు. అనుప్ పవార్: స్థానిక విద్యావేత్త. వీళ్లిద్దరూ మా పక్కనే కూసున్నరు. వీళ్లతో పది, పదిహేను మంది మహారాష్ట్ర ప్రజలున్నరు. అక్కడికి వోయిన మా నలుగురైదుగురితోని ఆ ఇద్దరు ముచ్చట్లు గల్పిర్రు.
అక్కడున్న ప్రజలతో గోపాల్ అంటున్నడు.. ‘నేను బీజేపీ నాయకుడినే. కానీ, కేసీఆర్ నాకు నచ్చిన నాయకుడు. కేసీఆర్ తెలంగాణల మస్తు పనుల్జేస్తున్నడు. ఐతారం నాడు జరిగే బీఆర్ఎస్ సభకు నేనొక్కన్నే గాదు, నా వంతుకు ఓ యాభై మందిని తోల్కొనొస్తా’ అనంగనే… పవార్ మాటందుకున్నడు… ‘కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత గొప్పదో తెల్సా..? అంత పెద్ద ప్రాజెక్టును కేసీఆర్ ఇంత జెల్ది పూర్తి జేస్తడనుకోలె. ముసలోల్లగ్గూడ కేసీఆర్ నెలకు రెండు వేల పింఛన్ ఇస్తడు తెలంగాణల’ అని జెప్పిండు. ‘ముసలోల్లకు నెలకు రెండు వేల రూపాలా..?’ అని అక్కడున్న ప్రజలు నోర్దెర్సిర్రు. ‘రైతుల కోసం ఇంతగనం పనుల్జేసిన నాయకుడినైతే నేనింతవరకు సూల్లేదు… దేశంల ఎవరిస్తున్నరు రైతుబంధు.. ఏటా ఎక రానికి పదివేలంటే ఉత్తముచ్చటేనా?’ అని పవార్ ఇంకొంచెం ఆవేశంగా… ‘తెలంగాణల జరుగుతున్న అభివృద్ధి, అమలుచేస్తున్న పథకాల గురించి మా మరాఠా ప్రజలకు జెప్పండ’ని చేతులు జోడించిండు. ‘గురుద్వారలో ఐతారం నాడు జరిగే సభ కోసం… కేసీఆర్ మాటల కోసం… మా మరాఠీలు’ ఎదురుజూస్తున్నరని చెప్పవట్టిండు పవార్.
ఒక్కసారిగా నా రొమాలు నిక్కవొడ్శినయి. ఈ రెండ్రోజులళ్ల అక్కడున్న పరిస్థితిని బట్టి నాకర్థమైందేమంటే… కేసీఆర్ ఇచ్చిన ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదం ఒక్క తెలంగాణల్నే గాదు దేశమంతా పాకింది. కేసీఆర్ సభ పెడితే ఒక్క తెలంగాణల్నే గాదు దేశంల ఎక్కడైనా ప్రజలు ఎదురుజూస్తరని అర్థమైంది. దేశంల ‘రైతురాజ్యం’ రానున్నదనే మరాఠాల సంబురం జూసినప్పుడు తెలంగాణల నాతో చర్చ జేసిన పెద్దమనిషి కండ్లముందు మెర్శిండు.
నాందేడ్ గొప్ప నగరం. సిక్కుల చివరి గురువు అనంత జ్యోతిలో ఐక్యమైంది ఇక్కడే. ఆయన తుదిశ్వాస విడువడానికి ముందు- నాందేడ్ను దృఢ సంకల్ప నగరమని చెప్పిండట.తెలంగాణ దాటి…దేశంలో మొదటి బహిరంగ సభ ఇదికేసీఆర్ దృఢ సంకల్పానికి చిహ్నం!
-గడ్డం సతీష్
99590 59041