రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నేతన్నలపై కక్ష గట్టింది. కార్మికులు రోడ్డున పడుతున్నా కనికరించడం లేదు. వాళ్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోవడం లేదు. తత్ఫలితంగా పదేండ్ల తర్వాత రాష్ట్రంలో ఉమ్మడి ఏపీ నాటి సంక్షోభం తలెత్తింది. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం వలె నేతన్నలకు చేతినిండా పనివ్వాలి. వస్త్ర పరిశ్రమను ఆదుకోకపోతే కాంగ్రెస్ సర్కార్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖ పూర్తి పాఠం…
గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గారికి…బీఆర్ఎస్ పాలనలో పదేండ్లు పండుగలా కళకళలాడిన చేనేత రంగం మీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మళ్లీ సంక్షోభంలోకి కూరుకుపోయింది. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో వస్త్ర పరిశ్రమ ఎలాంటి దుర్భర పరిస్థితుల్లో మునిగిపోయిందో, మళ్లీ కాంగ్రెస్ వచ్చి నాలుగు నెలలు గడవకముందే అదే విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్నది. మీ కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షపూరిత వైఖరి వల్ల గత నాలుగు నెలలుగా నేతన్నలు చేనేత పనులకు దూరం కావడమే కాదు, పవర్లూమ్స్ పూర్తిగా బంద్ అయ్యాయి. చేనేత కార్మికులు, పవర్లూమ్ ఆసాములతోపాటు కార్మికులు రోడ్డునపడటంతో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి, ముందుచూపు లేకపోవడం వల్ల వేలాది మంది నేతన్నలు, పవర్లూమ్ కార్మికులు, వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులతో వారి జీవితాలు దుర్భరంగా మారుతున్నా మీ ప్రభుత్వానికి కనీసం కనికరం లేదు. తమకు పని కల్పించాలని డిమాండ్ చేస్తూ కార్మిక లోకం నిత్యం దీక్షలు, ధర్నాలు, నిరసనల రూపంలో ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తున్నప్పటికీ మీ ప్రభుత్వంలో ఏ మాత్రం చలనం లేకపోవడం అత్యంత దారుణమైన విషయం. ఆదుకోవాల్సిన అధికార పార్టీ నేతలే కార్మికులను అవమానించేలా మాట్లాడటం.. వారి మనోైస్థెర్యాన్ని మరింత దెబ్బతీస్తున్నది. ఇటీవల కాంగ్రెస్ నేత కేకే మహేందర్రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రతి కార్మికుని గుండెను గాయపరిచాయి. ఈ క్రమంలోనే ఆర్థిక ఇబ్బందులతో సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తడక శ్రీనివాస్ అనే నేత కార్మికుడు ఉరి వేసుకుని తనువు చాలించాడు. ఇది ఆత్మహత్య కాదు, ముమ్మాటికీ మీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యగానే నేతన్నలు భావిస్తున్నారు. నేతన్నలపై కాంగ్రెస్కున్న చిన్నచూపు ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టంగా అర్థమవుతున్నది.
కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చిన మీకు ఒక్కసారి గతం గురించి వివరించే ప్రయత్నం చేస్తున్నాను. సరిగ్గా ఇవే పరిస్థితులు సమైక్య రాష్ట్రంలో నెలకొని ఉండేవి. తెలంగాణ సాధించాక పాలనా పగ్గాలు చేపట్టిన కేసీఆర్ తెలంగాణలో నేతన్నలను, వస్త్ర పరిశ్రమకు అత్యంత ప్రాధాన్యాన్ని ఇచ్చి, సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. చిక్కి శల్యమైన ఈ పరిశ్రమను ఆదుకోవడానికి స్వయంగా వస్త్ర పరిశ్రమ పెద్దలను పిలిపించి.. ఒక రోజంతా అధికారులతో కలిసి అప్పటి సీఎం కేసీఆర్ గారు సమీక్ష నిర్వహించారు. నేతన్నల వేతనాలు, కూలీ రెట్టింపయ్యేలా, ప్రతి కార్మికుడు నెలకు రూ.15 వేలు నుంచి రూ.20 వేలు సంపాదించుకొని గౌరవప్రదంగా జీవించేందుకు పటిష్ఠమైన కార్యాచరణను రూపొందించారు. అనేక వినూత్నమైన సంక్షేమ కార్యక్రమాలు తీసుకువచ్చారు. చేనేత మిత్ర, నేతన్నకు చేయూత వంటి కార్యక్రమాలు ప్రారంభించారు. వీటి కోసం భారీ ఎత్తున గత 60 ఏండ్లలో ఎప్పుడు లేనంతగా బడ్జెట్లో నిధులను కేటాయించారు.
గతంలో ఇతర రాష్ర్టాల నుంచి సరఫరా అయ్యే, రాజీవ్ విద్యా మిషన్, సర్వశిక్ష అభియాన్ కార్యక్రమాల ఆర్డర్లను రాష్ట్రంలోని నేతన్నలకు ఇచ్చి, చేతి నిండా పని కల్పించింది నాటి ప్రభుత్వం. దీంతో అప్పటిదాకా ఉపాధి లేక అల్లాడిన కార్మికులకు పని లభించింది. సంప్రదాయంగా వస్తున్న వృత్తిని కొనసాగిస్తూనే పోటీ ప్రపంచాన్ని తట్టుకునేలా వారిని తీర్చిదిద్దేందుకు కూడా ప్రభుత్వం తోడ్పాటునందించింది. మగ్గాల ఆధునికీకరణ, రుణాల మాఫీ, మార్కెట్తో అనుసంధానం వంటి ఆల్రౌండ్ అప్రోచ్తో ముందుకుసాగింది. వీటన్నింటి వల్ల కార్మికులకు ఊరట లభించింది. వారికి మరింత పని కల్పించడంతో పాటు, కడుపునిండా అన్నం పెట్టేలా బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా బతుకమ్మ చీరల పథకం ప్రారంభించి, అమలు చేసింది. బతుకమ్మ చీరల ఆర్డర్లు కూడా అందించడంతో.. కార్మికులకు చేతినిండా పని దొరికింది. దీంతోపాటు.. రంజాన్, క్రిస్మస్ కానుకల్లో ఇచ్చే వస్ర్తాల ఆర్డర్లు కూడా వారికి ఇవ్వడంతో కార్మికులకు మరింతగా ఉపాధి అవకాశాలు పెరిగాయి. ఇలా ఏడాదికి దాదాపు ఎనిమిది నెలల వరకూ వరుస ఆర్డర్లు అందడంతో.. సాంచాల పరిశ్రమలో సంతోషం వెల్లివిరిసింది. పవర్లూమ్లను ఆధునీకరించుకునేందుకు సబ్సిడీపై రుణాలు కూడా ఇవ్వడంతో వస్త్ర పరిశ్రమపై ఆధారపడినవారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపినట్టయింది.
నేత రంగానికి పూర్వవైభవం తీసుకురావడమే లక్ష్యంగా సాగిన ఆ మహాయజ్ఞం ఎన్నో గొప్ప ఫలితాలను ఇచ్చింది. తెలంగాణలో వస్త్ర పరిశ్రమ విస్తరించి ఉన్న వివిధ ప్రాంతాలతోపాటు.. కాంగ్రెస్తో సహా గత ప్రభుత్వాల పాలనలో ఒకప్పుడు ఉరిశాలగా మారిపోయిన సిరిసిల్ల కొత్త కాంతులతో వెలుగులీనింది. వీటికితోడు నేతన్నకు బీమా అమలు చేయడంతో కార్మికుల కుటుంబాలకు ధీమా లభించింది. వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో కార్మికలోకం కొనుగోలు శక్తి కూడా పెరిగింది. ఓ వైపు కార్మికుల సంక్షేమం, మరోవైపు సమగ్ర అభివృద్ధితో వారి జీవితాల్లో గుణాత్మక మార్పు వచ్చింది. పవర్లూమ్ కార్మికులు అధికంగా ఉండే కరీంనగర్, సిరిసిల్లతో పాటు.. వరంగల్, ఇతర ప్రాంతాల్లోని కార్మికులకు కూడా బీఆర్ఎస్ హయాంలో రూ.కోట్ల విలువైన ఆర్డర్లు ఇవ్వడంతో.. వస్త్ర పరిశ్రమకున్న అన్ని సమస్యలు తొలగిపోయాయి.
తెలంగాణ సాధించిన క్షణం నుంచి పదేండ్ల పాటు పండుగలా మారిన వస్త్ర పరిశ్రమ చుట్టూ.. కాంగ్రెస్ సర్కార్ రాగానే మళ్లీ చిమ్మచీకట్లు అలుముకుంటున్నాయి. పరిశ్రమను దెబ్బతీయడంతో పాటు కార్మికుల జీవితాలతో చెలగాటమాడే విధంగా వ్యవహరిస్తున్న మీ కాంగ్రెస్ సర్కారు వెంటనే తన తీరు మార్చుకోవాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేసిన కార్యక్రమాలను భేషజాలకు వెళ్లకుండా కొనసాగించాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏటా బతుకమ్మ చీరల ఆర్డర్లకు సంబంధించి జీవోను ఫిబ్రవరి మాసంలోనే విడుదల చేసేది. కానీ, ఏప్రిల్ నెల మొదలైనా కాంగ్రెస్ సర్కారు వైపు నుంచి కదలిక లేకపోవడంతో వీటిపై ఆధారపడిన వారందరిలో ఆందోళన రోజురోజుకూ పెరిగిపోతున్నది. ఇది 35 వేల మంది కార్మికులు, వారి కుటుంబాలకు సంబంధించిన కీలకమైన సమస్య కాబట్టి వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. వెంటనే నేతన్నలకు బతుకమ్మ చీరల ఆర్డర్లు అందించి వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలి. అలాగే యార్న్ సబ్సిడీని కూడా వెంటనే విడుదల చేయాలి. మా ప్రభుత్వం ఉన్నప్పుడు నెలనెలా కార్మికుల ఖాతాల్లో నేరుగా సుమారు రూ.3000 వరకు పడేవి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక చేనేత మిత్ర కార్యక్రమం అగిపోయింది. మూలన పడిన సాంచాలను తిరిగి తెరిపించడానికి.. పరిశ్రమకు రావాల్సిన రూ.270 కోట్లు బకాయిలను కూడా ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. మరోవైపు సొంత రాష్ట్రంలోని కార్మికులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వ పెద్దలు కమీషన్లకు కక్కుర్తి పడి.. తమిళనాడుకు, సూరత్కు ఆర్డర్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తున్నది.
రైతాంగ సంక్షోభాన్ని చూసినట్టు నేతన్నల సంక్షోభాన్ని కూడా రాజకీయ కోణంలో కాకుండా.. పేద, బడుగు, బలహీనవర్గాలైన నేతన్నల కోణంలో ఆలోచించి వెంటనే పరిష్కరించాలని రాష్ట్రంలోని నేత కార్మికుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఇప్పటికే పులువురు కార్మికులు ఆత్మహత్యకు పాల్పడిన నేపథ్యంలో.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. వస్త్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనాలి. ప్రస్తుతం అందుతున్న అన్ని కార్యక్రమాలను కొనసాగించాలి. అవసరమైతే మరింత అదనపు సాయమందేలా చూడాలి కానీ, కేవలం గత ప్రభుత్వంపై దుగ్ధతో వేల మంది నేతన్నల పొట్ట కొట్టవద్దని కోరుతున్నాను. లేకపోతే రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఈ పరిశ్రమపై ఆధారపడిన వేల మంది చేనేత కార్మికులు, వారి కుటుంబసభ్యులు మరింత సంక్షోభంలో కూరుకుపోతారని ఆవేదనతో తెలియజేస్తున్నా. ప్రభుత్వం వెంటనే ఈ అంశంపై వేగంగా స్పందించి, నేతన్నలను ఆదుకోవాలని ప్రధాన ప్రతిపక్షంగా, మా పార్టీ తరపున కోరుతున్నాను. ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్రంలోని నేతన్నలు తమ పొట్టకొడుతున్న కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ క్షమించరు. జై నేతన్న, జై తెలంగాణ, జై బీఆర్ఎస్!
-కల్వకుంట్ల తారకరామారావు
సిరిసిల్ల శాసనసభ్యులు